అకీరా నందన్కి తీవ్రగాయాలు.. చెత్త ప్రభుత్వం అంటూ రేణు దేశాయ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సామాజిక కార్యకర్తగా, జంతు సంరక్షకురాలిగా సమాజానికి తన వంతు సేవ చేస్తున్నారు. అయితే ప్రధానంగా కుక్కలను చంపడం, వాటిని హింసించడంపై గళమెత్తే క్రమంలో రేణు దేశాయ్ ట్రోలింగ్ బారినపడుతుంటారు. వాటికి తనదైన శైలిలో ఆమె కౌంటర్ ఇస్తూనే ఉంటారు. తాజాగా జరిగిన ఓ సదస్సులో కుక్కలపై దాడుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు రేణు దేశాయ్.
ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో 100 కుక్కల్లో 10 కుక్కలు చెడ్డవి ఉండొచ్చు.. కేవలం 10 కుక్కల కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపొద్దని రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు అభ్యంతరకర పోస్టులతో రేణు దేశాయ్పై ట్రోలింగ్కు దిగారు. దాంతో ఈ వ్యవహారంపై రేణు దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెపై పోస్టులు పెట్టిన వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన సదస్సులో ఈ సంఘటనలను రేణు దేశాయ్ ప్రస్తావించారు.

నేను గతంలో చెప్పిన వీడియోని పూర్తిగా చూడండి. కుక్కల వల్లే చనిపోతున్నారు, కుక్కల వల్లే గాయపడుతున్నారు అని కొందరు అంటున్నారు. కానీ దానికంటే వేయి రెట్లు ఎక్కువగా రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి... వేయి రెట్లు ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు చనిపోతున్నారు.. వేయి రెట్లు ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు వాళ్లవి ప్రాణాలు కాదా? అని రేణు దేశాయ్ ప్రశ్నించారు.
అకీరా నందన్కి 12 ఏళ్ల వయసున్నప్పుడు ఆదివారం ఉదయం తన ఫ్రెండ్స్తో కలిసి సైకిల్ తొక్కుతున్నాడు. ఆ సమయంలో రోడ్డు మొత్తం తవ్వేసి ఉండటంతో సైకిల్ మీద నుంచి అకీరా కిందపడిపోయాడు. ముఖంతో సహా చాలా చోట్ల దెబ్బలు తగిలాయి. ఆ గాయం తాలూకా మచ్చ అకీరా గడ్డం మీద ఇప్పటికీ ఉంది. చేయి కూడా విరిగింది. ఇది కుక్క వల్ల జరిగిందా? లేదు కాదా? చెత్త ప్రభుత్వాల వల్లే ఇలా జరిగింది. గవర్నమెంట్ వాళ్లు రోడ్డు సరిగా వేయరు.. ఇష్టమొచ్చినట్లు తవ్వేస్తారు. ఈ దేశంలో గుంతలు లేని రోడ్డు ఉంటే నాకు చూపించండి.. రోడ్లు ఎప్పుడు రిపేర్ అవుతాయో మనం అంచనా వేయగలుగుతామా? దేశంలో ఎంతమంది చెత్త రోడ్ల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు? ఎంతమంది చనిపోతున్నారు? లెక్కలు తీయండి అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో నేనెందుకు తిట్లు తినాలి? నేను ఏం తప్పు చేశాను తిట్లు తినడానికి? నేను ఎవరినీ చంపలేదు.. వ్యసనపరురాలిని కాదు, గ్యాంబ్లర్ని కాదు, టెర్రరిస్ట్ని కాదు, క్రిమినల్ని కాదు. నేను ఎందుకు తిట్లు తినాలి? గత కొద్దిరోజులుగా నా ముఖం ఏ మాత్రం బాలేదు. నా మీద పోస్టులు పెట్టిన వారిని ఇలాంటివి ఎందుకు పెట్టారని పోలీసులు అడిగారు. అప్పుడు వాళ్లు నేనొక యూట్యూబర్ని.. నేను సెలబ్రిటీ మీద బూతులు పెడితే నాకు లైక్స్, ఫాలోయింగ్ వస్తుందని చెప్పాడట. మన సోసైటీ ఇంత నీచంగా తయారైంది. ఈ జనరేషన్ ఎందుకు ఇలా తయారవుతుందో అర్ధం కావడం లేదు. నెగిటివ్ ఎక్కువగా ఆకట్టుకుంటుంటే.. పాజిటివ్ మాత్రం దిగజారిపోతుంది. ఏదైనా కాంట్రవర్సీ జరిగితే దానికొచ్చే ఫాలోయింగే వేరు. మీరు బూతు పోస్ట్లు పెట్టండి.. అరెస్ట్ అవ్వండి ఇదంతా మీ కర్మ అంటూ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


