నేను పుట్టుకతోనే ఆ వ్యాధితో పోరాడుతున్నా.. రేణు దేశాయ్ ఎమోషనల్..
రేణూ దేశాయ్ (Renu Desai) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తక్కువ సినిమాలు చేసినప్పటికీ, తన వ్యక్తిత్వం, అభిప్రాయాలు, ప్రత్యేక శైలితో మంచి గుర్తింపు సంపాదించారు. ఒకవైపు నటిగా, మరోవైపు దర్శకురాలు, ఎడిటర్, నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్గా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న రేణూ దేశాయ్, సోషల్ మీడియాలో కూడా సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై ధైర్యంగా స్పందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటపెట్టడం ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ తాను చిన్నప్పటి నుంచి ఒక గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని వెల్లడించారు. ఈ సమస్య జన్యుపరమైనదని, దీనిని 'మయోకార్డియల్ బ్రిడ్జింగ్' (Myocardial Bridging) అని పిలుస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె ఎంతో ఓపెన్గా చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ ఆరోగ్య సమస్యలను బయటపెట్టేందుకు వెనుకాడుతుంటారు. కానీ రేణూ దేశాయ్ మాత్రం తన సమస్యను బహిరంగంగా చెప్పి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. 'లాక్డౌన్ సమయంలో నాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనిపించాయి. అప్పటివరకు నాకు చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని టెస్టులు, సిటీ స్కాన్ చేయించుకున్న తర్వాత నాకు ఈ సమస్య ఉందని తెలిసింది' అని తెలిపారు. ఈ సమస్య వల్ల ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి సరిగా అందకపోవడం, చెమటలు పట్టడం, హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా అనిపించడం జరుగుతుందని వెల్లడించారు.
అంతేకాకుండా ఈ సమస్య కుటుంబ వారసత్వంగా వచ్చిందని కూడా చెప్పారు. 'మా నానమ్మకు కూడా ఇదే సమస్య ఉండేది. ఆమె కేవలం 47 ఏళ్ల వయసులోనే మరణించారు. నా తండ్రి కూడా చిన్న వయసులో హార్ట్ ఎటాక్తో చనిపోయారు. అందుకే మా కుటుంబంలో ఈ సమస్యపై ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని ఆమె తెలిపారు. ఈ మాటలు విన్న అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.
తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ క్రమశిక్షణతో జీవిస్తున్నానని రేణూ దేశాయ్ తెలిపారు. "నేను ప్రతిరోజూ యోగా చేస్తాను. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. రెగ్యులర్గా మందులు తీసుకోవాల్సిందే. డాక్టర్లు చెప్పినట్టు కొన్ని పనులు చేయకూడదు. రన్నింగ్ చేయడం, ఎక్కువ మెట్లు ఎక్కడం, ఒత్తిడికి గురికావడం వంటివి తగ్గించాలి" అని వెల్లడించారు. మందులు వాడటం వల్ల బరువు కొద్దిగా పెరిగిందని కూడా ఆమె స్పష్టం చేశారు. 'చాలామంది ఎందుకు లావయ్యావని అడుగుతుంటారు. కానీ కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అలాంటి మార్పులు వస్తాయి' అని చెప్పి, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని ఎగతాళి చేయకూడదనే సందేశం ఇచ్చారు.
రేణూ దేశాయ్ సినీ ప్రయాణం గురించి చెప్పాలంటే.. ఆమె బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆధ్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయినా, పిల్లల పెంపకంపై ఇద్దరూ తమ బాధ్యతలు తీసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రేణూ దేశాయ్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications