కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. అలా మోసపోయానంటూ రేణు దేశాయ్ ఆవేదన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత కుమారుడు అకీరా, కుమార్తె ఆద్యల పెంపకానికే తన జీవితాన్ని కేటాయించారు రేణు దేశాయ్. ఒంటరి మహిళగా ఎన్నో కష్టాలు పడి పిల్లలను పెంచి పెద్ద చేశారు. తొలి నుంచి సేవా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనేవారు రేణు దేశాయ్. ప్రస్తుతం సామాజికవేత్తగా, జంతు సంరక్షకురాలిగా వణ్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్నారు. ముఖ్యంగా కుక్కల యోగ క్షేమాలను చూసుకుంటున్నారు. ఈ విషయంలో పలుమార్లు విమర్శలు వచ్చినప్పటికీ ఆమె ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తాజాగా కుక్కల రక్తాన్ని అమ్ముతున్న ముఠా వ్యవహారాలు వెలుగులోకి రావడంతో రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ మేరకు వీడియో పెట్టిన ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
గడిచిన 3 రోజుల నుంచి ఒక వెటర్నరీ ఆసుపత్రిలో రక్తం అమ్ముతున్నారని మనం వింటూనే ఉన్నాం. వీధి కుక్కలను పట్టుకుని.. దాని రక్తం తీసుకుని అమ్ముతున్నారు. నేను ఒక్కటే చెబుతున్నాను.. వాళ్లు చేసింది తప్పు. కానీ ఎవరు కొంటున్నారు. వాళ్లది కూడా తప్పే. నా కుక్కకి బాలేదు.. దానికి రక్తం అవసరమైంది.. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని మనం కూడా అడగాలి. మనం కలియుగంలో ఉన్నాం.. మనుషుల కిడ్నీలు, లివర్ తీసుకోవడానికి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, ముసలివాళ్లను కిడ్నాప్ చేస్తున్నారు. వాళ్ల అవయవాలు అమ్ముకుంటున్నారు.. ఇక కుక్కల్ని ఏం వదులుతారు అంటూ రేణు దేశాయ్ మండిపడ్డారు.

ఈ కలియుగంలో కొంచెం భయం, భక్తి పెట్టుకోండి.. ఒక్క శాతమైనా కర్మను నమ్మండి. ఈరోజు నేను ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ నాకే కాదు.. నా పిల్లలకి, తర్వాత తరాలకి కర్మ తగులుతుందని కొంచెం నమ్మకం పెట్టుకోండి. ఇష్టమొచ్చినట్లు డబ్బు సంపాదిస్తున్నారు. వీధి కుక్కల్ని పట్టుకుని వాటి రక్తం తీసుకుని 10 వేలు, 20 వేలకు అమ్ముతున్నారంటే ఏమనాలి. డబ్బు పిచ్చి.. అందరికీ డబ్బులు కావాలి, నాకు కూడా ఎవరైనా 10 కోట్లు ఇస్తే శుభ్రంగా తీసుకుంటా. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్లు నాకెందుకు ఇస్తున్నారు? డబ్బును కష్టపడి సంపాదిస్తున్నానా? ఏదైనా తప్పులు చేసి సంపాదిస్తున్నానా? ఆ భయం, భక్తి పెట్టుకోండి, యూనివర్స్ నుంచి ఏదో ఒక శక్తి చూస్తుందని నమ్మండి అని రేణు దేశాయ్ తెలిపారు.
కుక్కల్ని పట్టుకుని వాటి రక్తం తీసి.. డబ్బున్న వాళ్లకి అమ్ముతున్నారు. స్కామ్లు చేస్తున్నారు, ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. నేను కష్టపడి ఎన్జీవో స్టార్ట్ చేశాను.. కానీ కొందరు ఫేమ్, డబ్బు కోసం గాయపడిన కుక్కని తీసుకొచ్చి పది వీడియోలు తీసుకొచ్చి డొనేషన్స్ తీసుకుంటున్నారు అది మంచి కర్మ కాదు. నాకు డబ్బు కావాలంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, సినిమాలు చేస్తా. నాకు పాపులారిటీ, ఫేమ్ కావాలనుకుంటే ఇంకో పది సినిమాలు సైన్ చేస్తాను. కానీ ఆ కుక్క, పిల్లి బ్రతుకు మీద పేరు సంపాదిస్తున్నారు.. దానిని దేవుడు క్షమించడని రేణు దేశాయ్ హెచ్చరించారు.
నిన్న కూడా ఫస్ట్ టైం నేను మోసపోయా.. కొన్ని మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేశా. ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే పగిలిపోయి కనిపించాయి. ముసలివాళ్లకు కాల్ చేసి వాళ్ల దగ్గరి నుంచి ఓటీపీలు చెప్పమని వాళ్ల దగ్గరి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మీరంతా రాక్షసులు.. మనుషులు ఇలాంటి పనులు చేయరు. రాక్షస ప్రవృత్తి ఉంటేనే ఇలా చేస్తారు. కుక్కల దగ్గరి నుంచి రక్తం లాగడం, దొంగతనం చేయడం, గ్యాబ్లింగ్ చేయడం ఆపేయండి. ఎలాగూ ఇది కలియుగం కాబట్టి.. అందరి బుద్ధి చెండాలంగానే ఉంటుంది. నాకు డబ్బు కావాలి, ఫేమస్ కావాలని అందరికీ ఉంటుంది. కానీ అది ఎలా వస్తాయని ఆలోచించండి. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి.. పక్షుల కోసం నీళ్లు పెట్టుకోండి. రోడ్డు మీద కుక్క పిల్లి కనిపిస్తే వాటి కోసం వాటర్ పోయండి. మీకు, రాబోయే తరాలకు పుణ్యం వస్తుందని రేణు దేశాయ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రేణు దేశాయ్కి అండగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


