ఆ కల నిజమైంది.. కూతురుపై నటి రోజా ఎమోషనల్ పోస్ట్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రోజా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించారు. ఆమె తన అందం, నటన, డ్యాన్స్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా అగ్రస్థానంలో ఉన్న రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరమయ్యారు. ఇక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరో, హీరోయిన్లకు తల్లి, అత్త, కీలక పాత్రల్లో నటిస్తూ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఇక కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు. కానీ, పలు టీవీ షోల్లో అభిమానులను అలరిస్తున్నారు. అయితే.. తాజాగా నటి రోజా కల నిజమైంది అంటూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇంతకీ ఏమైందంటే?
మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఆమె కుమార్తె అన్షు మాలిక (Anshu Malika) అమెరికాలో అరుదైన ఘనత సాధించింది. అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థ ఇండియానా యూనివర్సిటీ (Indiana University) అందించే అత్యంత ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు (Herman B Wells Award)2026కు అన్షు ఎంపికైంది. ఈ విషయం తెలిసిన వెంటనే రోజా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది.

రోజా తన పోస్టులో కుమార్తె విజయాన్ని ఎంతో గర్వంగా పేర్కొన్నారు. 'ఒక చిన్న కలగా మొదలైన ప్రయాణం.. ఇప్పుడు మాకెంతో గర్వకారణంగా, మరెందరికో స్ఫూర్తిగా మారింది. నీ కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం, ధైర్యమే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. నిన్ను చూస్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. మాకు ఇంతకంటే గొప్ప గర్వం మరొకటి ఉండదు" అంటూ భావోద్వేగంగా రాశారు.
హెర్మన్ బి వెల్స్ అవార్డు అనేది ఇండియానా యూనివర్సిటీ అందించే అత్యున్నత స్థాయి గౌరవ పురస్కారంగా గుర్తింపు పొందింది. 1961 నుంచి ప్రతి ఏడాది కేవలం ఒక్కరికి మాత్రమే ఈ అవార్డు ప్రదానం చేస్తుంటారు. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం మాత్రమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, మేధస్సు, సృజనాత్మకత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ఎంపిక చేస్తారు. అందుకే ఈ పురస్కారాన్ని పొందడం అంటే ఒక విద్యార్థి సమగ్ర ప్రతిభకు గుర్తింపుగా భావిస్తారు.
ప్రస్తుతం అన్షు మాలిక ఇండియానా యూనివర్సిటీలోని లూడీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్లో.. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉన్న ఆమె, ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో కష్టపడుతున్నారని రోజా పలుమార్లు తెలిపారు. చదువుతో పాటు టెక్నాలజీ రంగంపైనా అన్షుకు ప్రత్యేక ఆసక్తి ఉంది. ఏడేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇదే కాదు.. రోజా కుమార్తె అన్షు మాలిక 2024 చివర్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డును అందుకున్నారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది.
చాలామంది రోజా కుమార్తె కూడా తల్లి బాటలో సినిమాల్లోకి వస్తుందని భావించినా, అన్షు మాత్రం పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టింది. తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతోంది. రాజకీయ నాయకురాలి కుమార్తెగా కాకుండా, స్వంత ప్రతిభతో ప్రపంచ వేదికపై నిలబడడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న అన్షు మాలిక విజయం రోజా కుటుంబానికే కాదు.. తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.


Click it and Unblock the Notifications




