అసలు బంగారం సాయిపల్లవే.. ట్విస్ట్ రివీల్ చేసిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత 'మా ఇంటి బంగారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి సమంత వెల్లడించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సాధారణంగా ఒక కథను హీరో లేదా హీరోయిన్ను దృష్టిలో పెట్టుకుని రాయడం ఇండస్ట్రీలో కామన్. కానీ 'మా ఇంటి బంగారం' విషయంలో జరిగిన ట్విస్ట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా సమంతను కాదంట, ఈ సినిమా హీరోయిన్ గా నేచురల్ బ్యూటీ సాయిపల్లవిని తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సమంతే ప్రమోషన్స్లో భాగంగా వెల్లడించింది.

సమంత మాట్లాడుతూ.. "ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రారంభించినప్పుడు మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. 'మా ఇంటి బంగారం' కథను మొదట సాయిపల్లవికి చెప్పాలని, ఆమెతోనే ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశాం. ఆమె నటనకు నేను పెద్ద అభిమానిని. నా బ్యానర్లో ఆమె హీరోయిన్గా నటిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. కానీ అప్పట్లో సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు" అని తెలిపింది.
అయితే కథను పూర్తిగా పక్కన పెట్టకుండా, దానిని తనకు సరిపోయేలా మార్చి తానే హీరోయిన్గా నటించాలని నిర్ణయించుకున్నట్లు సమంత చెప్పింది. 'ఈ సినిమాను నేను ఎంపిక చేసుకోలేదు. ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది. సాయిపల్లవి చేయలేకపోవడంతో కథలో కొన్ని మార్పులు చేసి నా ఇమేజ్కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత నేనే ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది'అని వివరించింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవేళ సాయిపల్లవి ఈ సినిమా చేసి ఉంటే, ప్రస్తుతం ప్రేక్షకులు చూస్తున్న 'మా ఇంటి బంగారం' పూర్తిగా భిన్నంగా ఉండేదని ఇండస్ట్రీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాయి పల్లవి నటన, ఆమె నేచురల్ స్టైల్కు అనుగుణంగా కథ ఉండేదని, సమంత కోసం యాక్షన్ ఎలిమెంట్స్, కమర్షియల్ టచ్ మరింత పెంచినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సమంత ఓ పవర్ పుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. ఓ పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన యువతి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కథలో ప్రధానాంశం అని తెలుస్తోంది. ట్రైలర్లో సమంత ట్రెడిషనల్ లుక్తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
'మా ఇంటి బంగారం'లో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, మంజూష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ప్లే అందించగా, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ సమకూర్చారు. రెండేళ్ల తర్వాత టాలీవుడ్లో హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తున్న సమంతకు ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఇక భవిష్యత్తులో తప్పకుండా సాయిపల్లవితో తన బ్యానర్లో సినిమా చేస్తానని సమంత చెప్పడం కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకే సినిమాలో కలిసి కాకపోయినా, భవిష్యత్తులో సమంత నిర్మాతగా.. సాయిపల్లవి హీరోయిన్గా ఓ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications






