అలా జరిగితే హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో!.. సమంత షాకింగ్ రివీల్
సినీ పరిశ్రమలోకి రావాలంటే చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి, ఎన్నో సంవత్సరాల కష్టం, ఆడిషన్లు అవసరమని చాలా మంది భావిస్తారు. అయితే అందరి ప్రయాణం ఒకేలా ఉండదు. కొందరు నటుడు లేదా నటిగా మారాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే, మరికొందరు పూర్తిగా అనుకోకుండా సినిమా రంగంలోకి వచ్చి స్టార్డమ్ను అందుకున్నారు. ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ లేదా ఇతర రంగాల్లో కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో వచ్చిన ఒక్క అవకాశం సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలో రాణించిన వారు ఎందరో ఉన్నారు. అలా యాదృచ్ఛికంగా సినీ రంగంలోకి ప్రవేశించి, తమ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వారిలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కూడా ఒక్కరూ.
ఏంటీ? సమంత యాదృచ్ఛికంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా నిలిచింది. సౌత్లోనే కాదు నార్త్లోనూ సామ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సామ్.. గతంలో కొంతకాలం అనారోగ్యంతో ఇబ్బందిపడింది. అనంతరం డైరెక్టర్ రాజ్ నిడిమోరు రెండో పెళ్లి, కొంత గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా స్టార్ యాంకర్ సుమ కనకాల నిర్వహించిన సుమ ఛాట్ షాలో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత తన కెరీర్ తొలి రోజుల గురించి, ఇండస్ట్రీ లో అడుగుపెట్టానికి గల కారణాలను వెల్లడించారు.

సమంత ఈ చిట్ చాట్ లో సమంత తన కెరీర్, చదువు, మొదటి ఉద్యోగం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా మొదటగా తన కొత్త సినిమా 'మా ఇంటి బంగారం'గురించి సమంత మాట్లాడారు. ట్రైలర్లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలపై స్పందించారు. ప్రేక్షకులు తనను సాఫ్ట్ పాత్రల్లో ఎక్కువగా చూసినా, తాను నటించిన సినిమాల్లో చాలా వరకు స్టంట్స్, ఫైట్స్ను స్వయంగా చేస్తానని తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు సహజంగా కనిపించాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలని, అందుకే ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని వెల్లడించారు.
షోలో భాగంగా సమంత కాలేజీ రోజుల్లో చేసిన ఒక ప్రకటన వీడియోను యాంకర్ సుమ చూపించగా.. ఆమె తన తొలి ఉద్యోగం గురించి చెప్పుకొచ్చారు. పాకెట్ మనీ కోసం హోటళ్లలో జరిగే పెళ్లిళ్లు, ఫంక్షన్లలో అతిథులకు స్వాగతం పలికే పని చేసేదాన్నని తెలిపారు. రోజుకు రూ.500 పారితోషికం ఇచ్చేవారని, అయితే ఆ డబ్బు కోసం ఎనిమిది గంటల పాటు నిలబడి పనిచేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన, కసి అప్పటినుంచే ఉండేదని అన్నారు.
ఈ సందర్భంగా దర్శకురాలు నందిని రెడ్డి సమంత గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చదువులో టాపర్ అయిన సమంతకు ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనే కోరిక ఉండేదని చెప్పారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ అవకాశం రాకపోవడంతో మోడలింగ్, ఆడిషన్ల వైపు అడుగులు వేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన సమంత, అవును, చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని కలలు కన్నారని చెప్పారు. కానీ ఇంట్లో వాళ్లు తనను విదేశాలకు పంపలేదని అన్నారు.
దీంతో మోడలింగ్, సినిమాల కోసం ఆడిషన్స్ ఇచ్చానని సమంత గుర్తుచేసుకున్నారు. ఒక వేళ తన పేరెంట్స్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించి ఉంటే.. ఈ రోజు ఇండస్ట్రీలో ఉండే దాన్ని కాదని పరోక్షంగా చెప్పారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. సినీ ప్రేక్షకులు కూడా "అలా జరిగి ఉంటే ఇండస్ట్రీ ఒక అద్భుతమైన నటిని కోల్పోయేది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications




