మనుషులంటే నమ్మకం పోయింది... విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్లో స్టార్ కపుల్గా వెలుగొందుతున్న దశలో అక్కినేని నాగచైత్య- సమంత దంపతులు విడిపోవడం చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఏళ్ల పాటు డేటింగ్, ఆ తర్వాత పెళ్లితో ఎంతో అన్యోన్యంగా మెలిగింది ఈ జంట. అయితే అనూహ్య కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. దీనికి కారణం ఏదైనా కోట్లాది మంది అభిమానులు మాత్రం వారి నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇదంతా గతం.. నాగచైతన్య - సమంతలు వారి వారి వ్యక్తిగత జీవితాల్లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించి వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.
సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో ప్రేమలో పడిన నాగచైతన్య ఆమెను కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించారు. అటు విడాకుల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్నారు సమంత. ఇంతలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడి ఎంతో కష్టపడి కోలుకున్నారు. ఈ మధ్యలో చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం సమంత బాగా కృంగిపోయారు. సినిమాలకు దూరంగా ఆధ్యాత్మికత వైపు నడిచి మనసును తేలికపరచుకున్నారు. అనంతరం హిందీలో ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్లతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించారు.

ఈ వెబ్సిరీస్ల షూటింగ్ సమయంలో రాజ్ నిడిమోరుతో సమంత పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సీక్రెట్గా ప్రేమాయణం సాగించారు. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. అయినప్పటికీ ఇద్దరూ బయటపడలేదు. అప్పటికే రాజ్కు పెళ్లయిన సంగతి తెలిసిందే. రాజ్తో సమంత సాన్నిహిత్యం మరింత పెరగడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ గతేడాది డిసెంబర్ 1వ తేదీన తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు రాజ్- సమంత. తనకెంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆవరణలో భూత శుద్ధి ప్రక్రియ అనే సాంప్రదాయంలో ఇద్దరూ ఒక్కటయ్యారు.
రాజ్తో పెళ్లి తర్వాత తిరిగి యాక్టీవ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల పిక్చర్స్ బ్యానర్పై మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నారు. సమంత స్నేహితురాలు నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇది కాకుండా తన వ్యాపారాలు, పికెల్ బాల్ లీగ్, కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు సమంత. తాజాగా వోగ్ అనే ఇంగ్లీష్ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, విడాకులు, రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి తదితర అంశాలపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..
విడాకుల తీసుకుని ఓ బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాతో నేనే క్లోజ్ అయ్యాను. అప్పటికే మనుషులంటే నమ్మకం పోయింది.. ఎవరి మీదా ఆధారపడకూడదని అనుకున్నా. కొత్తగా ప్రేమ, రిలేషన్ వంటివి అంగీకరించే పరిస్ధితుల్లోనూ నేను లేను. అయితే రాజ్ నిడిమోరుతో పరిచయం, రిలేషన్ తర్వాత నాలో బలమైన మార్పు వచ్చింది. రాజ్ను కలవడానికి ముందు మెడిటేషన్, ఒంటరిగా గడపటం, సూర్యోదయాన్ని చూడటమే పనిగా ఉండేది. రాజ్ నా జీవితంలోకి వచ్చాక.. కలిసి పనిచేయడం, వర్కవుట్స్, గేమ్స్ ఆడటం, బయటికి వెళ్లడాన్ని ఇష్టపడ్డామని సామ్ తెలిపారు.
రాజ్ వచ్చాకే నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆయన వల్లే మంచి వ్యక్తిగా మారాను. నాలో వచ్చిన ఈ మార్పును నా స్నేహితులు గమనిస్తున్నారు. ఇటీవలే ఓ పాత స్నేహితురాలిని కలవగా నాలో మార్పు చూసి ఆశ్చర్యపోయింది. గతంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డావు.. ఇప్పుడు మళ్లీ పాత సమంతలా ఉన్నావని వాయిస్ మెసేజ్ పెట్టింది. రాజ్ నా పక్కన ఉన్నంత వరకు జీవితంలో ముందుకు కొనసాగుతానని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సమంత- రాజ్లు ఇలాగే అన్యోన్యంగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











