ఆ హీరోయిన్ని తట్టుకోలేం... అర్ధరాత్రి 2 గంటలైనా 3 సెకన్లలో ఖేల్ ఖతం... సమంత
రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకెళ్తున్నారు అగ్రనటి సమంత. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్పై మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తూ, స్వయంగా నటిస్తున్నారు సమంత. ఇది కాకుండా బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రానున్న ఓ సినిమాలో హీరోయిన్గా సమంత ఎంపికైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్, వ్యాపారాలు, తన పికెల్ బాల్ టీమ్ వ్యవహారాలు చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు సామ్. మే 15న మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ పనులు చూసుకుంటున్నారు సమంత.
ప్రతి మనిషికి తన కష్ట సుఖాలను పంచుకునేందుకు స్నేహితులు ఉంటారు. అలాగే సినీ పరిశ్రమలో నటీనటులకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వారిలోనూ ఒకరో ఇద్దరితోనో బాగా క్లోజ్గా ఉంటారు. సమంతకు కూడా ఇండస్ట్రీలో స్నేహితులు చాలా తక్కువ. గాయనీ చిన్మయి శ్రీపాద, దర్శకురాలు నందినీ రెడ్డితో పాటు హీరోయిన్ కీర్తి సురేష్.. ఆమెకు బాగా క్లోజ్. ముఖ్యంగా కీర్తి సురేష్తో అనుబంధం ఎక్కువ. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్తో తన అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా నుంచి కీర్తి సురేష్- సమంతల ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. అందులో కీర్తి.. మహానటిగా... సమంత జర్నలిస్ట్గా నటించారు. వీరిద్దరూ బీచ్ వాక్స్, పార్టీలు, వెకేషన్స్తో పాటు పలు సందర్భాల్లో కలుసుకుంటూ ఉంటారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఇద్దరూ ప్రాధాన్యతను ఇస్తూ తమ బంధాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కీర్తి సురేష్తో లంచ్కి కూర్చుంటే .. తిరిగి లేచేసరికి సాయంత్రం అయిపోతుందని ఆమెతో గడపటం ఎంత బాగుంటుందో చెప్పారు సామ్.
అర్ధరాత్రి 2 గంటలకు తాను ఫోన్ చేసినా కీర్తి సురేష్ ఖచ్చితంగా స్పందిస్తారు. ఆ సమయంలోనూ కీర్తి ఎంతో ఉత్సాహంతో.. సరదాగా ఉంటారు. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు. కీర్తి జోకులు, నవ్వులు తట్టుకోలేక మీరు పరిగెత్తాల్సిందే. అలాగని ఆమె డ్రింక్స్ తీసుకోరు. ఆ సమయంలోనూ హైపర్ యాక్టీవ్ మోడల్లో ఉండే కీర్తి.. మన ఎలాంటి మూడ్నైనా కేవలం 3 సెకన్లలోనే డిస్ట్రాచ్ చేస్తుంది. ఆమెకు సెన్సాఫ్ హ్యూమర్ అద్భుత అంటూ సమంత ప్రశంసించారు. ప్రస్తుతం కీర్తి సురేష్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. 2024లో తన ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సైరన్, రఘు తాతతో పాటు బేబీ జాన్ అంటూ హిందీలో ఎంట్రీ ఇచ్చినా కీర్తికి కలిసిరాలేదు. గతేడాది చేసిన ఉప్పు కప్పురంబు, రివాల్వర్ రీటా చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం తమిళంలో కన్నివీడి, మలయాళంలో తోట్టం, తెలుగులో రౌడీ జనార్థన సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆమె ఆశలన్నీ ఈ సినిమాల పైనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications

















