అనుష్క ఫ్లాప్ షో.. మరి సమంత మ్యాజిక్ పనిచేస్తుందా?
ఒకప్పుడు టాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉండేది. కథ బలంగా ఉంటే స్టార్ హీరో అవసరం లేకుండానే సినిమాలు భారీ విజయాలు సాధించేవి. అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి','భాగమతి', సమంత నటించిన 'ఓ బేబీ' వంటి చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం థియేటర్లలో కమర్షియల్ యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ సినిమాల హవా కొనసాగుతుండటంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.
గతేడాది విడుదలైన అనుష్క శెట్టి భారీ సినిమా 'ఘాటీ'ఫలితం ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా నిరూపించింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుష్క లుక్, యాక్షన్ ఎపిసోడ్స్, పాన్ ఇండియా రిలీజ్ కారణంగా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ విడుదలైన తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. సుమారు రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్ అయ్యేలా చేసింది. మొదటి వారాంతంలో కొంత మేర వసూళ్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు సోలో హీరోయిన్గా 'అరుంధతి','భాగమతి' వంటి విజయాలతో బాక్సాఫీస్ను శాసించిన అనుష్కకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ ఫలితంలో ఈ తరహా సినిమాలకు దూరంగా ఉందనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత 'మా ఇంటి బంగారం'అనే లేడీ ఓరియెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కేవలం మరో సినిమా మాత్రమే కాదు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ స్థితిగతులను నిర్ధారించే పరీక్షగా మారింది. ఎందుకంటే అనుష్క 'ఘాటీ' ఫలితం తర్వాత ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాల వచ్చినా అంతగా ఆదరణ అందుకోలేదు. మధ్యలో అనుపమ పరమేశ్వరన్ ప్రయోగం చేసిన 'పరదా'సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో ఇలాంటి సినిమాల భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, సమంత 'మా ఇంటి బంగారం'విషయంలో పరిస్థితుల్లో తేడా కనిపిస్తోంది. చాలా మంది హీరోయిన్లు సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్లను పరిమితంగా నిర్వహిస్తుంటే, సమంత మాత్రం 'మా ఇంటి బంగారం' కోసం అసాధారణ స్థాయిలో ప్రచారం చేసింది. చిన్న, పెద్ద మీడియా సంస్థలు అనే తేడా లేకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఒకే రోజులో దాదాపు 40కు పైగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మీడియా మీట్లు, సోషల్ మీడియా ప్రచారం, రీజినల్ ప్రమోషన్లు ఇలా ప్రతి వేదికను సమంత ఉపయోగించుకుంది.
ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం విజయ్, ఇతర ప్రముఖులను కలవడం ద్వారా కూడా సినిమాపై దృష్టిని ఆకర్షించింది. ఒక సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఒక దశ అయితే, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో పెద్ద బాధ్యత అని సమంత తన ప్రమోషన్ స్ట్రాటజీతో నిరూపించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో 'మా ఇంటి బంగారం' అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్పందనను అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి మార్కెట్లలో ప్రీ-సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయని సమాచారం. ఇక ఇండియన్ మార్కెట్లో కూడా బుకింగ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందనే సంకేతాలను ఇస్తోంది.
అలాగే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం దర్శకురాలు నందిని రెడ్డి. గతంలో సమంత-నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'ఓ బేబీ' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమా సమంత కెరీర్లోనే ప్రత్యేక సినిమాగా నిలిచింది. అదే కాంబినేషన్ మళ్లీ రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇక బిజినెస్ పరంగా చూస్తే 'మా ఇంటి బంగారం' ఇప్పటికే సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నాన్-థియేట్రికల్ రైట్స్, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలోనే సుమారు రూ.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ వసూళ్లు అదనపు లాభాలుగా మారే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలపై పెద్దగా ఒత్తిడి కనిపించడం లేదు.
అయితే అసలు ప్రశ్న మాత్రం ఒకటే. ప్రస్తుతం ప్రేక్షకులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను థియేటర్లలో చూడటానికి సిద్ధంగా ఉన్నారా? లేక ఓటీటీ కోసం వేచి చూస్తున్నారా? అనుష్క 'ఘాటీ' విషయంలో ఈ ప్రశ్నకు ప్రతికూల సమాధానం వచ్చినట్లే కనిపించింది. ఇప్పుడు సమంత 'మా ఇంటి బంగారం' ఆ అభిప్రాయాన్ని మార్చగలదా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై మళ్లీ నమ్మకం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆశించిన ఫలితం రాకపోతే ఈ జానర్కు మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం 'మా ఇంటి బంగారం'ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications






