‘ఎయిర్పోర్ట్ నుంచే హీరోయిన్లను వెంటాడతారు... లక్షల్లో ఖర్చు చేసి’
నటీనటులకు ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంత తేలికకాదు. వెనక్కి లాగే చేతులు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిపై ఒక కన్నేసి ఉంచాలి. అయినా ఆఫర్లు వస్తాయని లేదు.. ఇందుకోసం ఎన్నో త్యాగాలు చేయాలి, అవమానాలు భరించాలి, ఎందరినో తృప్తి పరచాలి. ఇక అమ్మాయిల సంగతి సరేసరి.. అవకాశాల పేరుతో వల విసిరి జీవితాలను నాశనం చేసే కీచకులు అడుగడుగునా ఉంటారు. ఇవే కాదు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఇంకా చాలానే చేయాలని అంటున్నారు ఓ సీనియర్ హీరోయిన్. ఆమె ఎవరు? అవకాశాల కోసం ఆ నటి ఎంత శ్రమించింది? ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ వివరాల్లోకి...
తెలుగు కుటుంబంలో పుట్టి బాలీవుడ్లో సెటిలయ్యారు సమీరా రెడ్డి. 2002లో మైనే దిల్ తుజ్కో దియా అనే హిందీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 2005లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహుడు సినిమాతో తెలుగువారిని పలకరించారు. అనంతరం జై చిరంజీవా, అశోక్ చిత్రాలలో నటించారు. అయితే తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో తన ఫోకస్ పూర్తిగా హిందీ ఇండస్ట్రీపైనే పెట్టారు సమీరా రెడ్డి. ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు కావొస్తుండగా.. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. 2013 వరదనాయక అనే సినిమాలో చివరిసారిగా కనిపించారు సమీరా రెడ్డి.

మహారాష్ట్రకు చెందిన అక్షయ్ వార్దేతో 2014, జనవరి 21న సమీరా రెడ్డి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కుమార్తె నైరా జన్మించారు. వివాహం తర్వాత భర్త, పిల్లల కోసం తన కెరీర్ను త్యాగం చేశారు సమీరా రెడ్డి. పూర్తిగా ఇంటికే పరిమితమై తన కుటుంబానికే సమయం కేటాయించారు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ మహిళలు, సమాజానికి సంబంధించిన విషయాలు, బ్యూటీ, ఫిట్నెస్ టిప్స్ చెబుతూ గడుపుతున్నారు సమీరా రెడ్డి. ఆమె సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోయింగ్ ఉంది.
ఇక ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం సమీరా రెడ్డి స్టైల్. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్కు తన ఇంటిని, ఖరీదైన వస్తువులను చూపిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలను పంచుకున్నారు. 2000వ దశకం ప్రారంభంలో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డా. ట్రెండీ లుక్లో కనిపించడం, విలాసవంతమైన బ్రాండ్ల కోసం భారీ ఖర్చు చేశా. బాలీవుడ్ వాతావరణానికి తగినట్లుగా కనిపించడానికి 24వ ఏట ఎంతో ఒత్తిడి అనుభవించానని సమీరా తెలిపారు.
ఇప్పుడు పూర్తిగా ఆర్గానిక్ దుస్తులకే అలవాటు పడిపోయా. నా దగ్గర ఎంతో హుందాగా కనిపించే బట్టలు ఉన్నా వాటిని పెద్దగా ముట్టుకోవడం లేదు. పెళ్లికి ముందే 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేసి షానెల్ జాకెట్ కొన్నా. గోవాకు మకాం మార్చినప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటున్నా. ఫాస్ట్ ఫ్యాషన్ను పక్కనపెట్టి.. నా దగ్గరున్న దుస్తులనే రకరకాలుగా కలిపి ధరిస్తున్నా. 2005లో కొన్న డియోర్ గౌచో బ్యాగ్ను చూపిస్తూ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గర అన్ని లేటెస్ట్ బ్యాగ్లు ఉండాలని అనుకున్నా. బాలీవుడ్ కల్చర్కు తగినట్లుగా ఉండాలనే ఒత్తిడిలో లక్షలు పోసి ఈ బ్యాగ్లు కొన్నాను. ఎందుకంటే నేను ఓ స్థాయికి చేరుకున్నానని ప్రజలు, ఇండస్ట్రీ జనాలు అనుకోవడం కోసం అని సమీరా ఆవేదన వ్యక్తం చేశారు.
1.7 లక్షల విలువైన లూయిస్ విట్టన్ టోట్ బ్యాగ్ కొన్నా. అప్పట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే హీరోయిన్లపైనే అందరి కళ్లూ ఉండేవి. అక్కడ కనిపించే విధానాన్ని బట్టే మనల్ని అంచనా వేసేవారు. అప్పటి టాప్ స్టార్స్ కూడా ఈ భారీ బ్యాగ్లను చంకలో తగిలించుకుని ఎయిర్పోర్ట్లో కనిపించేవారు. దాంతో నాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ లుక్ ఉండాలనే ఒత్తిడితో, మన దగ్గర ఏముందో చూపించాలనే ఉద్దేశంతో లక్షలు ఖర్చు చేసి ఖరీదైన, లగ్జరీ బ్యాగ్లను కొన్నాను. ఈ బ్యాగ్లకు బదులు గోల్డ్ బిస్కెట్ కొనుగోలు చేసుంటే బాగుండేదని సమీరా రెడ్డి సరదాగా నవ్వుతూ అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


















