మానభంగం వ్యాఖ్యలపై వరలక్ష్మీ సీరియస్.. డబ్బులిచ్చి కొనుకున్నా అంటూ..
తమిళ హీరోయిన్గా వరలక్ష్మీ శరతక్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్లతో అలరించిన ఈ నటి తొలి సారి ఆమె మెగా ఫోన్ పట్టింది. ఇటీవల నిర్మాతగా మారి రూపొందించిన మూవీ సరస్వతి. తాజాగా థియేటర్లలో విడుదలైన 'ఎస్ సరస్వతి' సినిమా చుట్టూ వివాదం నెలకొనడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్ర చేసిన విమర్శలు ఈ విషయాన్ని మరింత పెద్ద చర్చగా మార్చాయి. ఇంతకీ ఏమన్నారంటే?.
సరస్వతి సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సహకారంతో, ఓటీటీ వేదిక ఈటీవీ విన్ మద్దతుతో నిర్మించారు. మొదట ఈ సినిమాను 'సరస్వతి' అనే పేరుతో ప్రకటించినప్పటికీ, సెన్సార్ సూచనల నేపథ్యంలో చివరకు 'ఎస్ సరస్వతి'గా మార్చి విడుదల చేశారు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ప్రేక్షకులు సినిమాలోని సస్పెన్స్ అంశాలు, ట్విస్టులను మెచ్చుకుంటుండగా, మరికొందరు కథనం మరింత బలంగా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే వరలక్ష్మి నటన మాత్రం మంచి ప్రశంసలు అందుకుంటోంది. దర్శకురాలిగా ఆమె చేసిన ప్రయత్నాన్ని కూడా సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.

సాయి బుర్ర వివాదస్పద వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర తన సోషల్ మీడియా ఖాతాలో 'నా కథతో మొదలై వేరే కథతో ముగిసింది. ఒక్క మాట చెప్పకుండా కథను పూర్తిగా మార్చేశారు. నా కథని మానభంగం చేశారు. నేను రాసింది రివెంజ్ డ్రామా కాదు. అసలు కథకు వేరే ఆత్మ ఉంది' అంటూ ఆయన చేసినవ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయన నేరుగా సినిమా పేరు ప్రస్తావించకపోయినా, ఆ వ్యాఖ్యలు 'ఎస్ సరస్వతి' సినిమాకే సంబంధించినవని పలువురు భావించారు. దీంతో ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి.
వరలక్ష్మి వివరణ
ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వరలక్ష్మి శరత్కుమార్ ఈ విషయంపై స్పందించారు. సాయి మాధవ్ బుర్రపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె స్పష్టం చేశారు. 'నేను ఎవరి కథను దొంగిలించలేదు. కథ హక్కులను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన తర్వాత అది నా కథ అవుతుంది. ఆ కథ ఆయన దగ్గర దాదాపు ఆరు సంవత్సరాలుగా ఉంది. అంత గొప్ప కథ అయితే ఇన్నాళ్లూ సినిమా ఎందుకు చేయలేదనే ప్రశ్న కూడా వస్తుంది' అని ఆమె పేర్కొన్నారు.
కథలో మార్పులు ఎందుకు?
సినిమాగా రూపొందించే సమయంలో కథలో మార్పులు చేయాల్సి వస్తుందని వరలక్ష్మి తెలిపారు. నేనుచాలా మందికి చెప్పాను. అందరూ సెకండాఫ్ బలంగా లేదని చెప్పారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో రైటర్తో కలిసి కూర్చుని మార్పులు చేస్తాం. కానీ సాయి మాధవ్ గారు పెద్ద సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ అవకాశం రాలేదు" అని ఆమె వెల్లడించారు. సాయి మాధవ్ బుర్ర కథను పూర్తి రూపంలో ఇవ్వలేదని, కేవలం ఆడియో నోట్ రూపంలో పంపించారని వరలక్ష్మి తెలిపారు.
'ఆ ఆడియో నోట్లో ఉన్న ప్రధాన ఆలోచనను మాత్రమే తీసుకుని నేను స్క్రీన్ప్లేను పూర్తిగా మార్చుకున్నాను. నేటి ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా కథను మళ్లీ రూపుదిద్దాను' అని ఆమె వివరించారు. తాను కథ హక్కులు కొనుగోలు చేసినప్పటికీ గౌరవార్థం టైటిల్స్లో సాయి మాధవ్ బుర్ర పేరును ఉంచామని వరలక్ష్మి చెప్పారు. 'ఆయనపై ఉన్న గౌరవం వల్లే కథా రచయితగా ఆయన పేరు పెట్టాను. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత చాలామంది కథ బాగుందని ఆయనను ట్యాగ్ చేస్తున్నారు. అది ఆయనకు వచ్చిన గౌరవమా, లేక మాకు వచ్చినదా అన్నది ప్రేక్షకులే నిర్ణయించాలి' అని ఆమె వ్యాఖ్యానించారు.
వరలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలతో వివాదం మరింత చర్చకు దారి తీసింది. ఆమె వెర్షన్ ప్రకారం కథను అధికారికంగా కొనుగోలు చేసి, స్క్రీన్ప్లేలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై రచయిత సాయి మాధవ్ బుర్ర ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. మొత్తంగా 'ఎస్ సరస్వతి' సినిమా చుట్టూ మొదలైన ఈ కథా వివాదం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











