ఏం పీక్కుంటారో పీక్కోండి.. సినీ పెద్దలకు బిగ్బాస్ బ్యూటీ సవాల్.. ఏం జరిగిందంటే?
బాలీవుడ్ సూపర్స్టార్ రణ్వీర్ సింగ్పై బ్యాన్ వివాదం ఇటీవల భారతీయ చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ధురంధర్ వంటి భారీ హిట్ను ఇండస్ట్రీకి అందించిన కొద్దిరోజులకే రణ్వీర్ లాంటి అగ్రనటుడిపై నిషేధం తీవ్ర చర్చనీయాంశమైంది. డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ తప్పుకోవడంతో చిత్ర నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్డబ్ల్యూఐసీఈ)ను ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన పెద్దలు.. రణ్వీర్ మూడేళ్లు నిషేధం విధించింది. ఈ కాలంలో ఆయనతో నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ పనిచేయకూడదని తీర్పు చెప్పారు. ఇది వివాదాస్పదం కాగా.. రణ్వీర్కు పరిశ్రమలకు అతీతంగా మద్ధతు లభించింది. దీనిపై రణ్వీర్ సింగ్ న్యాయ పోరాటాన్ని చేయడంతో ఈ నిషేధాన్ని ఎత్తేస్తూ ఎఫ్డబ్ల్యూఐసీఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం సద్దుమణగగా.. ఓ నటిపై పరిశ్రమ పెద్దలు నిషేధం విధించేందుకు సిద్ధం కావడం హాట్ టాపిక్గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆ నటి ఎవరో కాదు... హిందీ బుల్లితెర నటి శిల్పా షిండే. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ద్వారానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిన్నా అనే చిత్రంలో ఆమె నటించారు. ఆ తర్వాత శివానీ అనే మరో సినిమాలోనూ శిల్పా కనిపించారు. అనంతరం మరాఠీ, హిందీ చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో బుల్లితెరపై అడుగుపెట్టిన శిల్పను మహిళా ప్రేక్షకులు ఆదరించారు. ఆమ్రపాలి అనే సీరియల్లో తొలుత నటించిన శిల్పాకు ఆ తర్వాత బాబీ, సంజీవని, హరి మిర్చి లాల్ మిర్చి, వారిస్, చిడియా ఘర్ తదితర ధారావాహికలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
అయితే బాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్తో శిల్పా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. 2017లో హిందీ బిగ్బాస్ 11లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె విజేతగా నిలిచి సంచలనం సృష్టించారు. ఈ ఫేమ్తో 2018లో ఇండియాలో టాప్ 10 బుల్లితెర నటుల్లో ఒకరిగా టైమ్స్ ప్రకటించింది. అయితే బాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్తో కెరీర్ పీక్స్లో ఉన్న దశలో ఆమె ఈ ధారావాహిక నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా ఈ సీరియల్ మేకర్స్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం బుల్లితెర వర్గాల్లో కలకలం రేపింది.
నిర్మాత సంజయ్ కోహ్లీ తనను లైంగికంగా వేధించారని శిల్పా ఆరోపిస్తూ కేసు పెట్టింది. దాంతో ఆమెకు సినీ, బుల్లితెర ప్రముఖులు మద్ధతుగా నిలిచారు. అయితే ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న శిల్పా షిండే.. సంజయ్ కోహ్లీపై తాను తప్పుడు కేసు పెట్టానని బాంబు పేల్చారు. కాంట్రాక్ట్లో వివాదాలు, ఆర్ధిక పరమైన అంశాల కారణంగా తనకు వేరే మార్గం కనిపించలేదు, డబ్బులు రాగానే సంజయ్తో వివాదం పరిష్కరించుకున్నానని శిల్పా చెప్పడంతో ఫిల్మ్ అసోసియేషన్లు, నెటిజన్లు మండిపడ్డారు. శిల్పా షిండేపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సహా పలు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు కూడా లేఖలు రాశాయి. తప్పుడు లైంగిక వేధింపులు చేయడం వల్ల నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుంది, వారి పోరాటాలు దెబ్బతింటాయని వారు మండిపడుతున్నారు.
ఈ పరిణామాలతో శిల్పా షిండే స్పందించారు. ఫిల్మ్ బాడీలు, ప్రభుత్వ వర్గాలు ఆమెపై చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో సంచలన పోస్ట్ పెట్టారు. జో ఉఖాడ్నా హై ఉఖాడ్లో ( ఏం పీక్కుంటారో పీక్కోండి) అంటూ రెచ్చగొట్టేలా పోస్ట్ చేశారు. తద్వారా సినీ రంగంలో పెద్దల బెదిరింపులకు తాను భయపడేది లేదని శిల్పా శెట్టి సంకేతాలు పంపారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా.. శిల్పాపై సినీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



