తిరుమల శ్రీవారి దర్శనం వివాదం.. ట్రోలింగ్పై లిటిల్ హార్ట్స్ హీరోయిన్ రియాక్షన్
యంగ్ హీరోయిన్ శివానీ నాగారం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, లిటిల్ హార్ట్స్, హే బల్వంత్ వంటి వరుస హిట్లతో కెరీర్లో దూసుకెళ్తుంది. అయితే.. ఈ హీరోయిన్ తాజాగా అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె చేసిన '15 నిమిషాల దర్శనం' వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీయగా, ప్రత్యేక దర్శనాలపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ట్రోలింగ్కు చెక్ పెట్టేందుకు శివానీ స్వయంగా వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
హీరోయిన్ శివానీ నాగారం తాజాగా అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. 'హే బల్వంత్' మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె 'తనకు సుమారు 15 నిమిషాల పాటు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శన భాగ్యం దక్కింది" అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో హీరోయిన్లకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు అయితే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ఉద్దేశిస్తూ పోస్టులు కూడా పెట్టారు.

ఈ విమర్శలు తీవ్రం కావడంతో శివానీ నాగారం తాజాగా ఓ వీడియో విడుదల చేసి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ... ఇటీవల తాను ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో తన చైల్డ్హుడ్ జర్నీ, సక్సెస్,డివోషనల్, స్పిరిచువల్ అనుభూతుల గురించి మాట్లాడానని తెలిపింది. అదే క్రమంలో తిరుపతి దర్శనం గురించి ప్రస్తావించానని, అందులో '15 నిమిషాల దర్శనం' అనే మాట ఎక్కువగా హైలైట్ అయిందని పేర్కొంది.
శివానీ వివరాల ప్రకారం.. 2025 అక్టోబర్లో తాను తన తల్లితో కలిసి లైన్లో నిలబడి రూ.10,500 విలువైన శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకున్నామని, ఆధార్ కార్డులు సమర్పించి సాధారణ విధానంలోనే టికెట్ పొందామని చెప్పింది. ఆ టికెట్ ద్వారా దర్శనం జరిగిందని, ఇందులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు తనకు కల్పించలేదని స్పష్టం చేసింది. 'నేను చెప్పిన 15 నిమిషాలు అంటే... లైన్ ప్రారంభం నుంచి స్వామివారి దగ్గరకు వెళ్లే వరకూ కొంచెం కొంచెంగా దర్శనం కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తం అనుభూతిని కలిపి అంచనాగా 15 నిమిషాలు అన్నాను. అంతేగానీ, పదిహేను నిమిషాలు నన్నెవరూ టచ్ చేయకుండా నిలబెట్టారన్న అర్థం కాదు'అని ఆమె క్లారిటీ ఇచ్చింది.
ఇదే సందర్భంలో గత అనుభవాన్ని కూడా శివానీ గుర్తు చేసుకుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి రూ.300 సర్వదర్శనం టికెట్ తీసుకుని కుటుంబంతో కలిసి వెళ్లానని, అప్పుడు కేవలం ఐదు-ఆరు సెకన్ల మాత్రమే స్వామివారి దర్శనం దక్కిందని తెలిపింది. ఈసారి మాత్రం 13 ఏళ్ల తర్వాత స్వామివారిని దగ్గరగా చూడగలిగానని, ఆ ఆనందం, ఎగ్జైట్మెంట్లో చాలా జెన్యూన్గా తన అనుభూతిని షేర్ చేశానని చెప్పింది. అయితే అది వేరే విధంగా అర్థమైందని బాధ వ్యక్తం చేసింది.
'నాకు మాత్రమే కాదు... శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుని వెళ్లే ఎవరికైనా స్వామివారి దర్శనం దగ్గరగా, చాలా మంచిగా జరుగుతుంది. నాలాగే మీరు కూడా హ్యాపీగా అదే అనుభూతి పొందుతారు. బాధ్యతగా క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేశాను'అంటూ ఆమె పేర్కొంది. ఇందుకు ఆధారంగా తన దర్శనం టికెట్ను కూడా వీడియోలో చూపించింది.


Click it and Unblock the Notifications











