రాజశేఖర్ కూతురినని తెలిసి కూడా తీసేశారు... శివాత్మిక రాజశేఖర్ భావోద్వేగం
సినీ పరిశ్రమలో అవకాశాలు అందుకోవడం అంత తేలికకాదు. ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఇది సామాన్యులకే కాదు.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన వారసులకు కూడా వర్తిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఉంటే సినీ రంగంలోకి ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది, త్వరగా స్టార్స్ అయిపోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే బ్యాక్గ్రౌండ్ అనేది తొలి అవకాశం అందించడం, గ్రాండ్ లాంచింగ్ వరకే ఉపయోగపడుతుందని, అక్కడి నుంచి అందరిలా పోరాటం చేయాల్సిందేనని ఎందరో సినీ వారసుల జీవితాలు చూపిస్తున్నాయి. బలమైన సినీ నేపథ్యం ఉండి కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్ కిడ్స్ టాలీవుడ్లో ఎందరో. తాజాగా నెపోటిజం, సినీ వారసత్వం, అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్.
దొరసాని సినిమాతో రాజశేఖర్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక రాజశేఖర్. మంచి కథతో ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. టాలీవుడ్లో అనుకున్న స్థాయిలో గుర్తింపు, అవకాశాలు రాకపోవడంతో వెంటనే తమిళ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు శివాత్మిక. తమిళ్లో ఆనందం విలాయుదం వీడు, నితం ఓరు వానం సినిమాలలో నటించారు. తిరిగి టాలీవుడ్పై ఫోకస్ పెట్టిన శివాత్మిక పంచతంత్రం, రంగ మార్తాండ సినిమాలో మెరిశారు.

తిరిగి తమిళంలోనే బాంబ్, ఆరోమాలే సినిమాలలో నటించారు. ప్రస్తుతం శివాత్మిక చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. అయినప్పటికీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజశేఖర్- జీవితల కుమార్తె అయినప్పటికీ శివాత్మికకు అవకాశాలు రాకపోవడం సినీవర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దాంతో ఆమె కెరీర్ ఎటువైపు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే శివాత్మిక ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూ ఉంటారు. పద్ధతిగా చీర కట్టులోనే ఫోటోషూట్లు చేస్తూ వాటిని షేర్ చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాత్మిక మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక సినిమా చేశా.. ఇంకేముంది ఆ తర్వాత సినిమా మీద సినిమాలు వస్తాయని నేను ఫీలయ్యా. తొలి సినిమాకు ఎలాగూ నెపోటిజం వర్క్ అయ్యింది. ఆ తర్వాత అది వర్కవుట్ కావొచ్చు, కాకపోవచ్చు. రాజశేఖర్ గారి అమ్మాయి.. చాలా బాగా చేసిందని చెప్పుకున్నారు. నెపోటిజం వల్ల నాకు యాక్సెస్ మాత్రమే వస్తుంది. ఎవరో తెలియని అమ్మాయి.. ఇండస్ట్రీలోని దర్శకుడి వరకు వెళ్లలేదు. నేను వెళ్లి కలవగలను.. అంతటితో నా పలుకుబడి, యాక్సెస్ అయిపోతుంది. ఆ తర్వాత సినిమాలో అవకాశం రావడం అనేది నేను ఎవరి కూతురిని అన్న దాని మీద ఆధారపడి ఉండదు. నాకు అర్ధమైంది ఏంటంటే? ప్రతి సినిమా.. నా తర్వాతి సినిమాను డిసైడ్ చేస్తుంది. దొరసాని వల్ల రంగమార్తాండ వచ్చింది. రంగమార్తాండ మరొకటి తెచ్చిపెట్టాలి. ఫిల్మ్ టూ ఫిల్మ్ మాత్రమే నా జర్నీ ఉంది అని శివాత్మిక పేర్కొన్నారు.
హీరో రాజశేఖర్ కుమార్తెని అని తెలిసినప్పటికీ కొన్ని సినిమాల్లో నన్ను తప్పించి మరొకరిని హీరోయిన్గా తీసుకున్నారు. దానికి కారణం ఏంటీ అని ఆరా తీస్తే వాళ్లకి ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాలలో నాకంటే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారట. ఫాలోవర్లను పెంచుకోవాలంటూ మేనేజర్లు, ఇతర ఏజెంట్ల నుంచి నాపై ఒత్తిడి ఉండేది. అయినా నేను నటిని, కంటెంట్ క్రియేటర్ని కాదు. నా నటన, ప్రతిభతో నన్ను గుర్తించాలి కానీ సోషల్ మీడియాలోని నెంబర్స్ ఆధారంగా కాదు. నేను చేసిన సినిమాలకు నేను తెలిసినంత వరకు నాకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా యాక్టింగ్కి సంబంధం లేని ఒక విషయం. ఒక యాక్టర్ ఒక సినిమాలో ఉన్నారంటే వాళ్లకి యాక్టింగ్ రావాలి, సెకండ్ ఆ క్యారెక్టర్కి సూట్ అవ్వాలని శివాత్మిక తేల్చిచెప్పారు.


Click it and Unblock the Notifications


