శ్రియ భర్తకు అస్వస్థత.. కూతుర్ని కూడా ఎత్తుకోలేకపోయాడని ఎమోషనల్ అయిన శ్రియ.. అసలు ఏమైందంటే?
శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాలతో ఆమె ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమా అవకాశాలు రావడం లేదు అనుకుందో? లేక చేసిన సినిమాలు చాలు అనుకుందో తెలియదు కానీ అనూహ్యంగా ప్రేమ వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.. కరోనా సమయంలో బిడ్డను కూడా కనేసిన ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పకుండా బిడ్డతో కలిసి ఫోటోలు దిగి ఆ తర్వాత అందరికీ మరోసారి షాక్ ఇచ్చింది. అయితే తన భర్త అస్వస్థతకు గురైన విషయాన్ని తాజాగా శ్రియ శరన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

మ్యూజిక్ వీడియో ద్వారా
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పుట్టిన శ్రియ శరణ్ అసలు పేరు శ్రియ శరణ్ భట్నాగర్ కాగా ఆమె చిన్నతనం నుంచి డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ముందుగా రాజస్థాన్ ఫోక్ డాన్స్, కథక్ నేర్చుకున్న తర్వాత ఆమె ఎన్నో డాన్స్ కాంపిటీషన్స్ లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా తొలుత ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించిన ఆమె ఆ మ్యూజిక్ వీడియో ద్వారా రామోజీ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఇష్టం అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించగా చరణ్ ఈ హీరో ఈ సినిమాలో నటించారు.

ప్రేమలో పడి
అయితే శ్రియ శరణ్ మంచి పేరు తెచ్చుకున్నది మాత్రం సంతోషం సినిమాలో అనే చెప్పాలి. ఆ సినిమాలో నటించింది సెకండ్ హీరోయిన్ రోల్ అయినా సరే ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అలా ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే, ఠాగూర్ లాంటి హిట్ సినిమాల్లో అవకాశాలు అందుకని టాలీవుడ్ లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. 2018 వరకు ఏడాదికి రెండు మూడు సినిమాలతో బిజీబిజీగా గడిపిన ఆమె ఆ తర్వాత రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చీవ్తో ప్రేమలో పడి పెళ్లిపీటలెక్కింది.

గ్లామరస్ ఫొటోలతో
కరోనా సమయంలో గర్భవతి అయిన ఆమె పాప పుట్టిన తరువాత తమకు 9 నెలల కూతురు ఉన్నట్లు గతేడాది చివరిలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వివాహమయ్యాక సినిమాలు తగ్గించుకున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది శ్రియ. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో పాటు భర్తతో దిగిన రొమాంటిక్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి
అయితే తాజాగా తన భర్త ఆండ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అని పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. హెర్నియాతో బాధపడుతున్న ఆండ్రీకి ఇటీవల అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. తాజాగా ఈ సర్జరీ విజయవంతం కావడంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఆస్పత్రిలో చేతికి బ్యాండేజీలతో ఉన్న ఆండ్రీ ఫొటోలను షేర్ చేస్తూ.. 'హెర్నియా సమస్య కారణంగా నా భర్త సుమారు రెండు నెలల పాటు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడు కోలుకుంటున్నాడు. నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు' అంటూ ఆమె పేర్కొంది.

ఉపాసన కొణిదెలకి కృతజ్ఞతలు
అంతేకాక ఆండ్రీ రికవరీలో సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్మెంట్తో పాటు ఉపాసన కొణిదెల, డాక్టర్ రజనీష్ రెడ్డికి కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది శ్రియ. ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. గతేడాది గమనంలో ఒక చెవిటి మధ్య తరగతి మహిళ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తోంది.


Click it and Unblock the Notifications











