ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు.. ఆ కామెంట్స్ చూసి షాక్ అయ్యా..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, సలార్ తో సూపర్ హిట్ అందుకోగా, కల్కి 2898 ADతో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం సలార్ 2, కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ను ఫ్యాన్స్ ప్రేమగా డార్లింగ్, రెబల్ స్టార్ అని పిలుస్తుంటారు. అయితే.. ఓ యంగ్ హీరోయిన్ మాత్రం తనని ప్రభాస్ ఫ్యాన్ టార్గెట్ చేశారని షాకింగ్స్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
ఆ యంగ్ హీరోయిన్ ఎవరోకాదు.. అహల్యా బమ్రూ.. భారతీయ తెరపై ఇప్పటివరకు చూడని సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా 'సింగ్ గీతం'. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అహల్యా నటిస్తుంది. అలాగే.. అయాన్, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అహల్యా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఇటీవల ప్రభాస్కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్పై కూడా ఆమె స్పందించారు. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ స్టోరీ పెట్టానని, ఆ తర్వాత వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. "నేను ఆ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ప్రభాస్ అభిమానుల నుంచి భారీగా స్పందన వచ్చింది. నా ఇన్బాక్స్ మొత్తం కామెంట్లు, మెసేజ్లతో నిండిపోయింది. చాలామంది డైనోసార్ ఎమోజీలతో రియాక్ట్ అయ్యారు. కొందరు సరదాగా 'మా డార్లింగ్ గురించి ఎందుకు పోస్ట్ చేశావు?', 'నువ్వు ఎవరు?' అంటూ ప్రశ్నలు అడిగారు" అని తెలిపారు.
అంతేకాదు, కొంతమంది లేడీ ఫ్యాన్స్ మరింత ఫన్నీగా స్పందించారని అహల్యా చెప్పారు. "ప్రభాస్ మా సొంతం, ఇకపై ఆయన ఫోటోలు పెట్టొద్దు" అంటూ సరదా మెసేజ్లు కూడా వచ్చాయని నవ్వుతూ చెప్పారు. అయితే ఆ కామెంట్స్ తనకు చాలా ప్రత్యేకంగా అనిపించిందని వెల్లడించారు. "నిజానికి ప్రభాస్ గారు మా సినిమా గురించి స్పందించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఆయన అభిమానుల ఫాలోయింగ్ ఎంత పెద్దదో అప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. వారి ప్రేమ, అంకితభావం చూసి నిజంగా షాక్ అయ్యాను. ఒక పోస్ట్ వల్లే నా సోషల్ మీడియా అకౌంట్లో ఫాలోవర్లు భారీగా పెరిగారు. వ్యూస్ కౌంట్ కూడా క్షణాల్లో మారిపోయింది. ప్రభాస్ గారి క్రేజ్ ఎంత పెద్దదో అప్పుడు తెలిసింది" అని అహల్యా వివరించారు.
ఇక దక్షిణాది సినిమాలపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని కూడా ఆమె తెలిపారు. "సౌత్ ఇండియన్ సినిమాల్లో కథలకు, భావోద్వేగాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. అలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు. తెలుగు హీరోల్లో తనకు మహేశ్ బాబు నటన చాలా ఇష్టమని అహల్యా వెల్లడించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన తనను ఆకట్టుకుంటాయని చెప్పారు.
అలాగే యాక్షన్ ప్రధానమైన సినిమాలు చూడటం తనకు చాలా ఇష్టమని, భవిష్యత్తులో యాక్షన్ పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళంలో ఓ కొత్త సినిమా చేస్తున్నానని, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నానని అహల్యా బమ్రూ తెలిపారు. ఇక 'సింగ్ గీతం' విడుదల తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications




