‘ఆ నరకం అనుభవించలేక నన్ను చంపేయమన్నా'
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి కుమార్తెగా ప్రేక్షకులకు పరిచయమైన సుప్రిత నాయుడు.. సోషల్ మీడియాలో స్టార్గా మారి ఇప్పుడు హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరుచుకుంటోంది. గ్లామర్, డ్యాన్స్ వీడియోలు, సోషల్ మీడియా రీల్స్తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సుప్రిత.. తాజాగా ఆమె గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని అత్యంత భయంకరమైన దశను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా బాడీ షేమింగ్, సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ తనను ఎంతగా మానసికంగా కుంగదీసాయో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇంటర్య్వూలో సుప్రిత మాట్లాడుతూ.. "సోషల్ మీడియాలో చాలా మంది నా బరువు గురించి కామెంట్స్ చేసేవారు. హీరోయిన్ కావాలంటే స్లిమ్గా ఉండాలని, లావుగా కనిపిస్తున్నావని ట్రోల్ చేసేవారు. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకీ ఆ కామెంట్స్ పెరుగుతుండటంతో నేను కూడా బరువు తగ్గాలని తీవ్రంగా ఫిక్స్ అయ్యాను" అని చెప్పారు. ఆ తర్వాత తాను తీసుకున్న తప్పు నిర్ణయాల వల్లే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని ఆమె వెల్లడించారు.

"బరువు తగ్గాలనే ఆరాటంలో రోజుకు 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండేదాన్ని. ఆ తర్వాత ఒక్కసారిగా హెవీ ఫుడ్ తినేదాన్ని. అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల నా శరీరం పూర్తిగా దెబ్బతింది. తీవ్రమైన వాంతులు, బలహీనతతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కనీసం మంచి నీళ్లు తాగినా కూడా వాంతులు అయ్యేవి. 15 రోజుల పాటు ఆస్పత్రిలో నరకం అనుభవించాను. ఆ నొప్పి భరించలేక ఒక దశలో 'నన్ను చంపేయండి' అని మా అమ్మను అడిగాను" అంటూ సుప్రిత ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తన తల్లి సురేఖా వాణి ఎంతో ధైర్యం చెప్పి తనను మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకొచ్చారని ఆమె తెలిపారు.
ఈ అనుభవం తనకు జీవితంలో పెద్ద పాఠం నేర్పిందని సుప్రిత చెప్పారు. "సోషల్ మీడియాలో ఎవరో చేసే కామెంట్స్ కోసం మన ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. ఆరోగ్యం కంటే ముఖ్యం ఏదీ లేదు. ఇప్పుడు నేను ఫిట్గా ఉండటానికి హెల్తీ డైట్, వర్కౌట్స్ ఫాలో అవుతున్నాను కానీ ఎప్పుడూ ఆకలితో ఉండడం వంటి తప్పులు చేయను" అని పేర్కొన్నారు. ప్రస్తుతం యువతలో సోషల్ మీడియా ఒత్తిడి ఎంత ప్రమాదకరంగా మారుతుందో తన అనుభవమే ఉదాహరణ అని ఆమె అన్నారు.
ఇక తన సినీ కెరీర్ గురించి కూడా సుప్రిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కావాలని లేదని, మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించడానికి సిద్ధమేనని చెప్పారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలి పాత్రలైనా చేయడానికి రెడీ అని తెలిపారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేని సినిమాల్లో మాత్రం అలాంటి పాత్రలు చేయడం కష్టమే అంటూ సరదాగా నవ్వించారు.
తల్లి సురేఖా వాణి ప్రోత్సాహంతో నటనలో శిక్షణ తీసుకున్న సుప్రిత.. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపును ఇప్పుడు సినిమాల్లో అవకాశాలుగా మార్చుకుంటోంది. ఇప్పటికే 'అమరావతికి ఆహ్వానం', 'లేచింది మహిళా లోకం' వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం అమర్ దీప్ చౌదరి సరసన 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు, ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2019లో 'మనీ మైండెడ్ గర్ల్ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్తో ప్రారంభమైన సుప్రిత ప్రయాణం.. ఇప్పుడు హీరోయిన్ స్థాయికి చేరుకుంది. గ్లామర్తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె చెప్పిన ఆరోగ్య సమస్యల అనుభవం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా బాడీ షేమింగ్ కారణంగా యువత మానసికంగా ఎంతగా ప్రభావితమవుతున్నారో సుప్రిత వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేశాయి.


Click it and Unblock the Notifications





