8 గంటలకోసారి సుస్మితాసేన్కు మెడిసిన్.. లేకపోతే ప్రాణాంతకం.. ఏం జరిగిందంటే?
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత అగ్ర నటి సమంత రూత్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడినట్లు చెప్పడంతో సినీ పరిశ్రమ, ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు. చాలా మంది స్టార్స్ తమ కెరీర్ను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత విషయాలతో పాటు తమకున్న అనారోగ్య సమస్యలను బయటపెట్టడానికి ఇష్టపడరు. ఎంత బాధనైనా భరిస్తూ సినిమాలు చేస్తూ.. సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అలాంటిది సమంత తన అనారోగ్యం బయటపెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
సల్మాన్కు అనారోగ్య సమస్యలు
సమంత ఓపెన్ కావడంతో పలువురు హీరోయిన్లు, నటులు వారి వారి అనారోగ్యాల గురించి బయటపెట్టడం మొదలుపెట్టారు. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బయటపెట్టారు. ఏవీ మాల్ఫోర్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజమ్ సమస్యలతో తాను ఇబ్బంది పడుతున్నట్లు సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొంటూనే తన కెరీర్ కొనసాగిస్తున్నానని ఆయన వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తన అనారోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మిస్ యూనివర్స్ పోటీలలో విజయం
మిస్ యూనివర్స్ అనేది ఒకటి అంటుందని, ఈ పోటీలలో పాల్గొంటే క్రేజ్ ఎలా ఉంటుందో మొట్టమొదట భారతదేశానికి పరిచయం చేశారు సుస్మితా సేన్. 1994లో మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో విజయం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సుస్మితా సేన్ చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. అందం, అభినయం, ప్రతిభ, ఆత్మ విశ్వాసం ఆధారంగా ఆమెకు ఈ ఘనత దక్కింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఇంతటి ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొని శెభాష్ అనిపించుకున్నారు సుస్మిత.
డజను మందితో డేటింగ్
1996లో దస్తక్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సుస్మిత ఆ తర్వాత రక్షకుడు సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఎక్కువగా గెస్ట్ రోల్స్తోనే సుస్మిత అలరించేవారు. ఇది కాకుండా బ్రాండ్ అండార్స్మెంట్స్, మోడల్గా భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా ఆమె నిలిచారు. సినిమాలు ఇతర అంశాల కంటే ఎఫైర్స్, ప్రేమాయణాలతోనే సుస్మిత ఎక్కువగా వార్తల్లో నిలిచారు. దాదాపు డజను మందితో ఆమె డేటింగ్ చేశారని బాలీవుడ్ టాక్. 50 ఏళ్ల వయసొచ్చినా నేటికీ సింగిల్గానే ఉన్న ఈ మాజీ మిస్ యూనివర్స్ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని తన పెద్ద మనసును చాటుకున్నారు.
8 గంటలకోసారి ఆ స్టెరాయిడ్
తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. 2014 నుంచి తాను అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన అడిసన్స్ డిసీజ్తో బాధపడుతున్నటు వెల్లడించింది. చికిత్సలో భాగంగా ప్రతి 8 గంటలకోకసారి హైడ్రోకార్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. మన శరీరంలో అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తాయని.. కానీ తనకు ఇది ఉత్పత్తి కాకపోవడంతో అనారోగ్యం బారినపడినట్లు తెలిపింది. దాంతో జీవితాంతం తాను స్టెరాయిడ్ వాడాల్సిందేనని పేర్కొంది. అయితే కేవలం మందులపైనే ఆధారపడకుండా వ్యాయామాలు, యోగాతో పాటు జిమ్నాస్టిక్స్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు సుస్మిత. ఆమె కృషి ఫలితంగా సుస్మిత శరీరంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అడ్రినల్ గ్రంథి సహజంగానే కార్టిసాల్ను ఉత్పత్తి చేస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరించి ఆశ్చర్యపోయారు. అలా సుస్మితా సేన్ తన అనారోగ్యాన్ని జయించి తిరిగి మామూలు మనిషి కాగలిగారు.


Click it and Unblock the Notifications











