హీరోలకు ఒక న్యాయం.. హీరోయిన్లకు మరో న్యాయమా? తాప్సీ ఫైర్!
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో సినిమా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో మెప్పించింది. వరుస సూపర్ హిట్ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా మారింది. తెలుగు సినిమాల్లో బిజీగా ఉండగానే బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ కూడా అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. అయితే.. తాజాగా నటి తాప్సీ పన్ను మరోసారి తన అభిప్రాయాలతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా నుంచి దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్న ఆమె, తాజాగా తిరిగి ఆన్లైన్లో యాక్టివ్ అవుతూ తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. అంతేకాదు, సినీ పరిశ్రమలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న వయసు వివక్ష, బ్రాండ్ల ఒత్తిళ్లు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న తాప్సీ.. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటం స్పందించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమనీ, ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ను అనుసరించడం, వైరల్ కంటెంట్ సృష్టించడం, ప్రేక్షకుల దృష్టిలో ఉండేందుకు నిరంతరం ప్రయత్నించడం తనను తీవ్రంగా అలసిపోయేలా చేసిందని ఆమె తెలిపారు. సోషల్ మీడియా ఒక పరుగు పందెంలా అనిపించడం మొదలైందని, అందుకే కొంతకాలం తన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలో ఆమె తన ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్ను కూడా తొలగించినట్టు చెప్పింది. అవసరమైతే మాత్రమే ఐప్యాడ్ ద్వారా మూడు నాలుగు రోజులకు ఒకసారి సోషల్ మీడియాను చూసేవారట. అలా నిజ జీవితాన్ని ఆస్వాదించడం తనకు అలవాటైందని, అది కూడా ఒక మంచి వ్యసనంలా మారిందని తాప్సీ పేర్కొన్నారు. నటీనటులు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు రావద్దనే ఒక సిద్ధాంతం కూడా తనకు సరైనదిగా అనిపించిందన్నారు. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాల్లో చూడాలనుకునే స్టార్గా ఉండటం కూడా ముఖ్యమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటానికి మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చిందని తాప్సీ వెల్లడించారు. కొన్ని బ్రాండ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలకే ప్రాధాన్యం ఇస్తాయని, తనకు నేరుగా అలాంటి సూచనలు కూడా వచ్చాయని చెప్పారు. "మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు కాబట్టి కొన్ని బ్రాండ్లు మీతో పని చేయవు" అని తనకు చెప్పిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ ధోరణిని తాప్సీ ప్రశ్నించారు. ఒక బ్రాండ్ తనను ఎంపిక చేసుకుంటే, అది తన వ్యక్తిత్వం కోసం కావాలని, మరొకరిలా మారమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కేవలం ఆల్గోరిథమ్ల కోసం, ఎంగేజ్మెంట్ కోసం అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక తన సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రొఫెషనల్ టీమ్ లేకుండానే స్వయంగా నిర్వహించానని తాప్సీ తెలిపారు. లైక్స్, వ్యూస్ పెంచుకోవాలంటే గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేయడం చాలా సులభమని, కానీ తాను అలాంటి షార్ట్కట్స్ను ఎంచుకోవడం ఇష్టపడనని చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతా కూడా తన వ్యక్తిత్వంలాగే సహజంగా, ఎలాంటి ఫిల్టర్లు లేకుండా ఉండాలని కోరుకుంటానని వెల్లడించారు.
అంతేకాదు, సినీ పరిశ్రమలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్యపై కూడా తాప్సీ మాట్లాడారు. మంచి పాత్రలు దక్కించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుందని, గుర్తింపు వచ్చేసరికి 30 ఏళ్లు దాటిపోతాయని అన్నారు. ఆ తర్వాత మాత్రం రొమాంటిక్ కామెడీ చిత్రాలకు మీరు వయసులో పెద్దవారని చెప్పడం బాధాకరమని వ్యాఖ్యానించారు. హీరోలకు ఈ తరహా ప్రమాణాలు వర్తించవని ఆమె పేర్కొన్నారు. హీరోలు 40, 50 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ తో రొమాంటిక్ పాత్రలు చేయగలుగుతుంటే, అదే హీరోయిన్స్ విషయంలో మాత్రం వయసును ఒక అడ్డంకిగా చూపించడం అన్యాయమని అన్నారు. ఈ సమస్య కేవలం బాలీవుడ్లోనే కాదు, దక్షిణాది సినీ పరిశ్రమలోనూ ఉందని తాప్సీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ఒత్తిళ్లు, బ్రాండ్ల అంచనాలు, సినీ పరిశ్రమలో మహిళలపై ఉన్న వయసు వివక్ష వంటి అంశాలపై తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిప్రాయాలు ఇండస్ట్రీలో జరుగుతున్న అనేక చర్చలకు మరోసారి బలం చేకూర్చాయనే చెప్పాలి.


Click it and Unblock the Notifications





