సబ్బు పెట్టిన చిచ్చు.. 6 కోట్ల వివాదంలో తమన్నా
తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కంపెనీలు బ్రాండ్ అండార్స్మెంట్స్ చేయించుకుంటూ ఉంటాయి. సినీతారలు, క్రీడాకారులు, ఇతర పేరున్న సెలబ్రెటీలను ప్రచారకర్తలుగా వాడుకుని భారీగా రెమ్యునరేషన్ చెల్లిస్తుంటాయి. స్టార్స్ కూడా డబ్బు కోసం ముందు వెనుక ఆలోచించడకుండా వాణిజ్య ప్రకటనల్లో పాల్గొని ఇటీవలి కాలంలో చిక్కుల్లో పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం సూపర్స్టార్ మహేశ్ బాబు, నందమూరి బాలకృష్ణలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేరారు. ఈ వివరాల్లోకి వెళితే..
బ్రాండ్ అండార్స్మెంట్స్తో తమన్నా బిజీ
20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుని టాలీవుడ్, బాలీవుడ్లలో అగ్ర నటిగా వెలుగొందుతున్నారు తమన్నా భాటియా. వ్యక్తిగత జీవితంలో విజయ్ వర్మతో బ్రేకప్ ఎదుర్కొన్నప్పటికీ కెరీర్ పరంగా టాప్లో ఉన్నారు తమన్నా. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తమన్నా భాటియా పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. సినిమాలు, వ్యాపారాలతో పాటు బ్రాండ్ అండార్స్మెంట్స్ ద్వారా బాగానే వెనకేస్తున్నారు తమన్నా. అయితే బ్రాండ్ అండార్స్మెంట్ల కారణంగా మిల్కీ బ్యూటీ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ కేసులలో తమన్నా పేరు
గతడాది భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా పేరు రావడం, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మహాదేవ్ అనుబంధ ఫెయిర్ ప్లే యాప్ను ప్రమోట్ చేసినందుకు గాను మహారాష్ట్ర సైబర్ సెల్ తమన్నాకు సమన్లు జారీ చేసింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు, పుదుచ్చరిలో వెలుగు చూసిన క్రిప్టో కరెన్సీ స్కామ్ విషయంలోనూ స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్తో పాటు తమన్నా భాటియాల పేర్లు వినిపించాయి.
మైసూర్ శాండల్ ప్రచారకర్తగా తమన్నా
తాజాగా తమన్నా భాటియా బ్రాండ్ అండార్స్మెంట్స్ విషయంలో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా కన్నడిగులతోనే ఆమె పెట్టుకున్నారు. భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా కర్ణాటక ప్రభుత్వం తమన్నా భాటియాను నియమిస్తూ ఉత్తర్వులు చేసింది. రెండేళ్ల కాలపరిమితికి గాను మైసూర్ శాండల్ను ప్రమోట్ చేసినందుకు గాను తమన్నాకు రూ.6.2 కోట్ల పారితోషికం చెల్లించనున్నారు. ఈ మేరకు కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ (కేఎస్డీఎల్)తో మిల్కీ బ్యూటీ ఒప్పందం కుదుర్చుకున్నారు.
తమన్నా కెరీర్లోనే మైలురాయి
దీని ప్రకారం మైసూర్ శాండల్తో పాటు ఈ సంస్థకు చెందిన మిగిలిన ఉత్పత్తులకు కూడా తమన్నా ప్రచారం చేయనున్నారు. దాదాపు 125 ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ శాండల్కు బ్రాండ్ అంబాసిడర్ కావడం తమన్నా కెరీర్లోనే ఓ మైలురాయి. అయితే ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. కన్నడిగులకు అసలే తమ ప్రాంతం, భాషపై విపరీతమైన పిచ్చి. అలాంటిది కర్ణాటక సంస్థకు కర్ణాటకకు చెందినవారిని కాకుండా బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తితో ప్రచారం చేయించడం ఏంటని కన్నడిగులు మండిపడుతున్నారు. కర్ణాటకలో ఎంతో మంది ప్రముఖులు, ప్రతిభావంతులు ఉండగా పరాయి రాష్ట్రానికి చెందిన తమన్నాని మైసూర్ శాండల్కు ప్రచారకర్తగా నియమించడం ఏంటని నిలదీస్తున్నారు.
వివాదంపై ఎంబీ పాటిల్ వివరణ
వివాదం ముదురుతుండటంతో కర్ణాటక పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మైసూర్ శాండల్కు కర్ణాటకలో మంచి డిమాండ్ ఉందని, దీనిని దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాటిల్ స్పష్టం చేశారు. పైగా తమన్నా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ అగ్రనటి అని.. అన్నింటికి మించి బాడీ కేర్, స్కీన్ కేర్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా చేసిన అనుభవం ఉందని మంత్రి తెలిపారు. మార్కెట్ నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. అయితే ఈ వివాదంపై తమన్నా భాటియా ఇంకా స్పందించాల్సి ఉంది.



Click it and Unblock the Notifications











