సమంత బాటలో తమన్నా.. అందరూ వెళ్లిపోయారంటూ మిల్కీబ్యూటీ ఎమోషనల్
హీరోయిన్గా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ ఆమె క్రేజ్, డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తమన్నాతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. సినిమాలు చేస్తూనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు తమన్నా. తన సంపాదనను పలు వ్యాపారాలలో, పెట్టుబడుల రూపంలో మళ్లించి సినీరంగంలో ఉన్న వారికి ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుతం తమన్నా తమిళంలో పురుషన్.. హిందీలో వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, వి శాంతరామ్, రేంజర్స్, మరియా ఐపీఎస్, రాగిణి 3లో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. గత కొంతకాలంగా తమన్నా భాటియా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలుతున్నారు. మానసికంగా, శారీరకంగా రీఛార్జ్ అవ్వడానికి ఆమె ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే సద్దుగు జగ్గీ వాసుదేవ్ ఆలయాన్ని దర్శించి ధ్యానం, లింగ భైరవి అమ్మవారికి పూజలు చేశారు. అలాగే ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుడిని దర్శించుకుని భస్మ హారతిలో పాల్గొన్నారు తమన్నా భాటియా. తాజాగా ముంబైలోని తన నివాసంలో లింగ భైరవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తమన్నా షేర్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

అందరూ వెళ్లిపోయారు, మంత్రోచ్ఛారణలు ఆగిపోయాయి. అయినా ఆ రోజు ముగిసిపోకూడదన్నట్లుగా నేను దేవి పక్కన కూర్చొని ఉన్నాను. ఆ ప్రదేశంలో ఇంకా ఎంతో జీవకళ నిండి ఉంది. రోజంతా ప్రార్ధన, వేడుక, నవ్వులు, భక్తి, ఐక్యతతో గడిపిన ఒక ఇంటి శఖ్తి అది. ఏదో అందమైనది ఇంకా గాలిలో నిలిచి, వదిలి వెళ్లడానికి నిరాకరిస్తున్నట్లుగా అనిపించింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, ఒక్క చోటికి చేరిన అందరితో ఆ రోజును గడపటం దానిని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను ఇంటికి తీసుకొచ్చినప్పుడు దానిని నిర్వహించే వారిని మాత్రమే కాకుండా, ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టే ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందని నేను ఎప్పుడూ భావిస్తుంటాను.
అత్యంత భక్తిభావంతో లింగ భైరవి దేవి పుణ్యపూను నిర్వహించిన ఈశా యోగ కేంద్రానికి చెందిన సాధ్వులకు కృతజ్ఞతలు. దేవి ఇంటికి వచ్చినప్పుడు ఆమె కేవలం గదిలోకి అడుగుపెట్టడమే కాదు.. ఆ పరిసరాల వాతావరణాన్నే మార్చేస్తుందని భావన. కొన్ని రోజులుగా ముంబైలో ఎండలు భరించలేనంత తీవ్రంగా ఉన్నాయి. పూజకు వచ్చిన వారిని సౌకర్యంగా ఎలా చూసుకోగలమా అని ఆందోళన చెందాము. తెల్లవారుజామున నేను నిద్రలేచి చూస్తే చెట్లు ఊగుతున్నాయి, పూలు వర్షంలో తడిసిపోయాయి. కొన్ని రోజులుగా నగరాన్ని అలుముకుని ఉన్న వేడి ఒక్కసారిగా మారిపోయింది. ఆ వర్షంతో పాటు దేవి ఇంటికి చేరుకున్నట్లుగా అనిపించింది అని తమన్నా రాసుకొచ్చారు.
కోయంబత్తూరులోని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈశా ఫౌండేషన్, ఆశ్రమానికి సెలబ్రిటీలు పోటెత్తున్న సంగతి తెలిసిందే. బిజీ లైఫ్లో పరుగులు తీసే ప్రముఖులు.. ఆశ్రమంలో మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. ఒకరిని చూసి మరొకరు కోయంబత్తూరుకు పరుగులు తీస్తున్నారు. అగ్రనటి సమంత కూడా వాసుదేవ్ శిష్యురాలే... గత తన వైవాహిక జీవితం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంఘటనలతో సమంత మానసికంగా కృంగిపోయారు. ఈ దశలో జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన ఆమె రీఛార్జ్ అయ్యారు.
లింగై భైరవి అమ్మవారికి భక్తురాలిగా మారిపోయిన సమంత.. తనకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు, ధ్యానంలో మునిగిపోతారు. ముంబైలో తను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కొత్త ఇంటిలో లింగ భైరవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిన సమంత.. ఆయనతో తన పెళ్లిని కోయంబత్తూరులోని లింగ భైరవి అమ్మవారి సన్నిధిలోనే జరుపుకున్నారు. భూతశుద్ధి ప్రక్రియ అనే పురాతన పద్ధతిలో రాజ్- సమంత ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా సమంత దారిలో లింగ భైరవి అమ్మవారి భక్తురాలిగా మారిపోయారు. ప్రస్తుతం తమన్నా పూజ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications



