15 నిమిషాలు కాదు.. 15 సెకన్లు.. సినీ నటి నవనీత్ కౌర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..
దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నవనీత్ కౌర్ అనుకున్న స్థాయిలో స్టార్డమ్ని దక్కించుకోలేకపోయింది. తెలుగులో యమదొంగ, గుడ్బాయ్, రూమ్మేట్స్, శ్రీను వాసంతి లక్ష్మీ, మహారథి, జాబిలమ్మ తదితర చిత్రాల్లో నటించింది. కానీ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా గెలిచింది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్వతంత్ర అభ్యర్ధిగా కాకలు తీరిన పార్టీలకే షాకిచ్చారు నవనీత్ కౌర్.
2014 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎన్సీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన నవనీత్ కౌర్.. శివసేన నేత ఆనందరావు అద్సుల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ బాధ నుంచి త్వరగానే కోలుకుని పుంజుకన్నారు. 2019లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి.. ఎన్సీపీ మద్ధతుతో ఆనందరావును ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ విజయంతో నవనీత్ కౌర్ పేరు సినీ, రాజకీయ రంగాల్లో మారుమోగిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో అదే బీజేపీలో చేరి నవనీత్కౌర్ షాకిచ్చారు. ఆమెకు అమరావతి నుంచి టికెట్ కేటాయించారు కమలనాథులు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచే 400 సీట్లలో అమరావతి ఉండేలా కృషి చేస్తానని నవనీత్ పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ఆమె పార్టీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నవనీత్ కౌర్పై కేసు నమోదైంది. అది కూడా తెలంగాణలో. షాద్నగర్ పట్టణంలో ఇటీవల మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన డీకే అరుణ తరపున ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నవనీత్ కౌర్ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవనీత్ కౌర్పై షాద్నగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. మరి దీనిపై నవనీత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కాగా.. ఇటీవల హైదరాబాద్లో బీజేపీ అభ్యర్ధి డాక్టర్ మాధవీలతకు మద్ధతుగా జరిగిన ఎన్నికల ప్రచారసభలోనూ నవనీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఒవైసీలను టార్గెట్ చేశారు. కొన్నేళ్ల క్రితం అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామన్నారని నవనీత్ పేర్కొన్నారు. కానీ వాళ్లకు 15 నిమిషాలు కావాలేమో.. మాకు 15 సెకన్లు చాలంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే నవనీత్ కౌర్కు కౌంటరిచ్చారు అసదుద్దీన్ . 15 సెకన్లు ఎందుకు గంట సమయం తీసుకో.. ముస్లింలను ఏం చేస్తారో చేయండి, అధికారం మీ దగ్గరే వుంది.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని ఒవైసీ సవాల్ విసిరారు.
అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపైనా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు రాజకీయ పార్టీల ఆస్తులు కాదన్నారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందని.. ముస్లింలను ద్వేషించడమే ఆర్ఎస్ఎస్ ఆలోచనా విధానమని అసదుద్దీన్ దుయ్యబట్టారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ.. సీనీ నటి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అక్బరుద్దీన్ 15 నిమిషాలు సమయం ఇస్తే.. అంటూ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇస్తూ.. 15 నిమిషాలు కాదు.. మాకు 15 సెకన్లు ఇస్తే ఏమౌతుందో చూపిస్తాం అని నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సినీ నటి, ఎంపీపై కఠిన శిక్ష విధించాలని ఎన్నికల సంఘానికి సూచించారు.


Click it and Unblock the Notifications











