మానసిక ప్రశాంత కావాలి.. ‘ది ప్యారడైజ్' హీరోయిన్ సంచలన నిర్ణయం..
Actress Kayadu Lohar: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న యంగ్ హీరోయిన్లలో కయాదు లోహర్ ఒకరు. కన్నడ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు, తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు కయాదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.ఆ నిర్ణయంతో తన అభిమానులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే?
తాజాగా హీరోయిన్ కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన తన పోస్టులో కయాదు ఒక కీలక విషయాన్ని ప్రస్తావించారు. "శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మనసుకు కూడా అంతే అవసరం. కొంతకాలం సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండి నాతో నేను సమయం గడపాలని అనుకుంటున్నాను" అంటూ ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా.. సెలబ్రిటీల జీవితంలో కీలకంగా మారిపోయింది. ప్రతి రోజు తన ఫోటోలు, వీడియోలు, ప్రమోషన్లు, అభిమానులతో ఇంటరాక్షన్స్ వంటి వాటితో నిరంతరం యాక్టివ్గా ఉంటారు. ఈ సమయంలో సెలబ్రిటీలపై నిరంతరం ఉండే ఒత్తిడి, ట్రోలింగ్, నిరంతర ఆన్లైన్ ప్రెజెన్స్ వంటి అంశాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కయాదు తీసుకున్న నిర్ణయం కూడా ఇలాంటి డిజిటల్ డిటాక్స్లో భాగమేనని భావిస్తున్నారు అభిమానులు.
అయితే ఈ విరామం వెనుక కేవలం మానసిక విశ్రాంతి మాత్రమే కాకుండా కెరీర్పై మరింత దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కయాదు చేతిలో పలు భాషల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రం ఆమె కెరీర్లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్గా మారింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ది ప్యారడైజ్ లో కయాదు 'సుబ్బలక్ష్మి' అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానున్నది.
ఇక మరోవైపు తమిళంలో దర్శకుడు మరియప్పన్ చిన్న తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్'లో కూడా కయాదు నటిస్తున్నారు. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, కయాదు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందన అందుకోవడంతో ఈ సినిమాపై కూడా ఆసక్తి పెరిగింది. హారర్, థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కయాదు మరో భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఆమె సోషల్ మీడియా నుంచి కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ, ఆమె సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ను ఆమె టీమ్ అభిమానులతో పంచుకోనుంది.మరోవైపు అభిమానులు మాత్రం ఆమెను మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో మిస్ యూ అని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


