అలాంటివారికి పుట్టగతులు ఉండవు.. సర్వ నాశనం అవుతారు
ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్గా మెప్పించిన ఇంద్రజ (Indraja) ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలాగే బుల్లితెరపై జడ్జ్గా, యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవల ఆమె కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని తన వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రేమ, బ్రేకప్లు, యువత మానసిక పరిస్థితులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే.. ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ టాక్ షోలో యాంకర్ వర్ష అడిగిన ప్రశ్నలకు ఇంద్రజ చాలా ఓపెన్గా, ఎమోషనల్గా స్పందించారు. ముఖ్యంగా "ఈ రోజుల్లో ప్రేమలో విఫలమైతే వెంటనే బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడం సాధారణమైపోయింది... దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచింపజేసింది. ఇంద్రజ మాట్లాడుతూ ప్రేమలో మోసపోవడం అనేది మనిషి అనుభవించే అత్యంత తీవ్రమైన బాధలలో ఒకటని తెలిపారు.

"ప్రపంచంలో అత్యధిక నొప్పి ప్రసవ సమయంలో మహిళ అనుభవించే నొప్పి అంటారు. కానీ ప్రేమలో మోసపోవడం కూడా దానికి సమానమైన బాధనే కలిగిస్తుంది" అంటూ భావోద్వేగంగా చెప్పారు. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించినప్పుడు, అతను లేదా ఆమె మన జీవితంలో లేకపోతే మనసు పూర్తిగా ఖాళీగా మారిపోతుందని, ఎంత మంది మధ్య ఉన్నా ఒంటరితనం వెంటాడుతుందని వివరించారు. "ఎంత సక్సెస్ సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా... మనసులో ఒకరు లేకపోతే మనిషి నిరుపేదలా ఫీల్ అవుతాడు. ప్రేమలో నమ్మకద్రోహం చేసినవాళ్లు ఆడదానై మగవాడైనా సరే వాళ్లకి ఇక పుట్టగతులు ఉండదు అంతే.. సర్వనాశనం అయిపోతారు' అంటూ ఇంద్రజ కామెంట్ చేశారు.
అయితే ఈ సందర్భంలో ఆమె అత్యంత సీరియస్గా ప్రస్తావించిన అంశం యువతలో పెరుగుతున్న ఆత్మహత్యల గురించి. "ప్రేమలో విఫలమై చాలా మంది సూసైడ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ఎప్పుడూ 'అమ్మా నాన్న ప్రేమ దొరకలేదని' ఎవరూ సూసైడ్ చేయరు. కానీ కొద్ది రోజుల పరిచయం ఉన్న వ్యక్తి కోసం జీవితాన్ని వదిలేస్తున్నారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సూసైడ్ అనేది అత్యంత తప్పు నిర్ణయమని, అది 'హైలీ ఇడియాటిక్ యాక్ట్' అని కూడా ఆమె కఠినంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆ స్థితిలో ఉన్న వారి మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు. "ఒకరిని అంతగా ప్రేమిస్తే... ఆ ప్రేమ కోల్పోయినప్పుడు వాళ్ల మనసు పూర్తిగా విరిగిపోతుంది. అందుకే వాళ్లు అలా ఆలోచిస్తారు" అంటూ చెప్పారు. యువతకు ప్రత్యేకంగా సందేశం ఇస్తూ... "మీరు ప్రేమించే వాళ్ల గురించి కాదు, మిమ్మల్ని ప్రేమించే మీ అమ్మానాన్న గురించి ఆలోచించండి. వాళ్లే జీవితంలో శాశ్వతం. ఎవరి మీదా 100% డిపెండ్ అవ్వకండి. మీ జీవితాన్ని కోల్పోకండి" అని సూచించారు.
అలాగే జీవితంలో ముందుకు సాగాలంటే ఒక లక్ష్యం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. "మీరు పుట్టింది ప్రేమ కోసం కాదు... సాధించడానికి. ఒక గోల్ సెట్ చేసుకోండి. మీరెవరో ఈ ప్రపంచానికి చూపించండి. మీరు ఎదిగితే మీ వెనక లక్ష మంది వస్తారు" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇకకర్మ సిద్ధాంతంపై కూడా ఆమె తన అభిప్రాయం వెల్లడించారు. "మన జీవితం లో జరిగే ప్రతి విషయం కర్మ ఫలితమే. మనం చేసే మంచి, చెడు... ఏదైనా పదింతలు తిరిగి వస్తుంది" అని తెలిపారు. ప్రకృతి ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎలా తిరిగి ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసునని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక మహిళల భావోద్వేగాల గురించి మాట్లాడుతూ... "ఆడవాళ్లు పెద్దగా ఏమీ ఆశించరు. చిన్న చిన్న విషయాల్లోనే ప్రేమను చూస్తారు. ఒక మాట, ఒక చిన్న సర్ప్రైజ్... ఇవే వాళ్లకు పెద్దవి. అవి కూడా లేకపోతే వాళ్లు ఎమోషనల్గా బలహీనపడతారు" అని చెప్పారు. కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుతూ, చాలా మంది మహిళలు పిల్లల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారని, అనేక సమస్యలు ఉన్నప్పటికీ విడిపోకుండా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
కానీ తర్వాత ఎక్కడో ఒక చోట వారు కోరుకున్న ప్రేమ కనిపిస్తే, అది నిజమా కాదా అన్నది ఆలోచించకుండా దానిలో పడిపోతారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని తప్పుపట్టడం కాకుండా, వారికి సహాయం చేయాలని, సరైన మార్గంలో నడిపించాలని సమాజానికి సూచించారు. ఇలా నటి ఇంద్రజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications







