15 రోజులు కోమాలో.. చావు అంచుల వరకు వెళ్లొచ్చా..
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. తెరపై ఆమె కనిపిస్తే థియేటర్లలో విజిల్స్ మోగేవి. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ ఉంటే మొదటి ఛాయిస్ ఈ ముద్దుగుమ్మనే. "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" అనే పాటలో హాట్ స్టెప్పులతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఈ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. కానీ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆమె సినిమాలకు దూరమైంది. అయితే కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితాన్ని తలకిందులు చేసిన ఘటన గురించి ముమైత్ చెప్పిన విషయాలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో తన జీవితంలో ఊహించని ప్రమాదం జరిగిందని ముమైత్ చెప్పుకొచ్చింది. "ఆ రోజు కూడా మామూలుగానే ఉంది. స్నానం చేసి బయటకు వచ్చాను. పాట పాడుకుంటూ అద్దం దగ్గరకు వెళ్తున్నాను. ఒక్కసారిగా నా ఇటాలియన్ బెడ్ మూలకు బలంగా తగిలి కిందపడిపోయాను. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ ఒక్క దెబ్బ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది" అంటూ ఆమె గుర్తుచేసుకుంది.

ఆ ప్రమాదం తర్వాత తనకు తలనొప్పి, అస్వస్థత మొదలయ్యాయని, కానీ అది ఎంత పెద్ద ప్రమాదమో అప్పుడు అర్థం కాలేదని తెలిపింది. "నాకు మైగ్రేన్ సమస్య ఉండేది. అందుకే అది కూడా అదే అనుకున్నాను. కానీ వాస్తవానికి నా మెదడులో రక్తస్రావం జరుగుతోంది. మూడు రోజుల పాటు బ్రెయిన్లో బ్లీడింగ్ జరుగుతున్నా నాకు తెలియలేదు" అని చెప్పింది. మూడో రోజు పరిస్థితి విషమించడంతో తల్లి తనను ఆస్పత్రికి తీసుకెళ్లిందని ముమైత్ తెలిపింది. అక్కడ వైద్యులు వెంటనే ఐసీయూలో చేర్చారని చెప్పింది. ఆ తర్వాత ఏమైందో తనకు గుర్తులేదని, ఎందుకంటే తాను కోమాలోకి వెళ్లిపోయానని వెల్లడించింది.
"నేను 15 రోజుల తర్వాత కళ్లు తెరిచాను. కానీ నాకు మాత్రం అది మరుసటి రోజు ఉదయం అనిపించింది. ఒకరోజు మాత్రమే నిద్రపోయాననుకున్నాను. డాక్టర్లు 15 రోజుల పాటు కోమాలో ఉన్నావని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను" అని చెప్పుకొచ్చింది. ఆ 15 రోజులు తన కుటుంబానికి నరకప్రాయంగా మారాయని ముమైత్ తెలిపింది. ముఖ్యంగా తన తల్లి పడిన బాధను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. "అమ్మ ఒక్క కన్నీరు కూడా పెట్టుకోలేదు. నా బిడ్డ బతికితేనే నేను ఏడుస్తాను అని దేవుడితో మొక్కుకుంది. ప్రతి క్షణం నా కోసం ప్రార్థించింది" అని చెప్పింది.
అయితే ఆ మానసిక ఒత్తిడి కారణంగా తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని ముమైత్ తెలిపింది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చాయని చెప్పింది. మరోవైపు తన తండ్రి కూడా మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నారని వెల్లడించింది. "నేను 32 ఏళ్ల వయసులో మా నాన్నను మొదటిసారి ఏడుస్తూ చూశాను" అంటూ ఎమోషనల్ అయింది. కోమా నుంచి బయటపడిన తర్వాత కూడా అసలు పోరాటం మొదలైందని ముమైత్ తెలిపింది.
డాక్టర్లు ఏకంగా ఏడేళ్ల పాటు పని చేయవద్దని చెప్పారని వెల్లడించింది. "చిన్న వస్తువు ఎత్తడం కూడా చాలా కష్టంగా ఉండేది. సీజర్ అటాక్స్ వచ్చేవి. మందుల కారణంగా బరువు పెరిగాను. నాలుగేళ్ల పాటు నరకం అనుభవించాను" అని పేర్కొంది. అయితే ఆ కష్టకాలమే తనకు జీవితాన్ని కొత్తగా నేర్పిందని ముమైత్ తెలిపింది. "దేవుడు నాకు రెండో జీవితం ఇచ్చాడు. ఆ ఏడేళ్లలో నేను నన్ను నేను తెలుసుకున్నాను. జీవితంలో నిజంగా ఏం కావాలో అర్థమైంది" అని చెప్పింది. సినిమాలకు దూరమైన తర్వాత కూడా ఖాళీగా కూర్చోలేదని ముమైత్ వెల్లడించింది.
బ్యూటీ, హెయిర్ స్టైలింగ్ రంగంపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించానని తెలిపింది. ఒకప్పుడు తన కోసం ముంబై నుంచి మేకప్ ఆర్టిస్టులను పిలిపించుకునేదాన్నని, ఇప్పుడు అదే రంగంలో వ్యాపారవేత్తగా నిలబడగలిగానని చెప్పింది. ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ క్వీన్గా వెలిగిన ముమైత్ ఖాన్ జీవితం వెనుక ఇంతటి విషాదం దాగి ఉందని చాలామందికి తెలియదు. స్టార్డమ్ మధ్యలో జరిగిన ఒక ప్రమాదం ఆమె కెరీర్ను ఆపేసినా, జీవితాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications




