ఎన్నో అవమానాలు.. ఇండస్ట్రీ వదిలిపెట్టాలనుకున్నా.. ధురంధర్ డైరెక్టర్ భార్య ఆవేదన..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటూ, ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రతి సెంటర్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త మైలురాయిని నమోదు చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే, ఈ విజయోత్సాహం మధ్యలో ఆదిత్య ధర్ భార్య, బాలీవుడ్ నటి యామీ గౌతమ్ గతంలో బాలీవుడ్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
నటి యామీ గౌతమ్.. తెలుగు సినిమా 'నువ్విలా'తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. 'కొరియర్ బాయ్ కళ్యాణ్', 'గౌరవం' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్ద విజయాలు అందుకోలేక పోయింది. దీంతో బాలీవుడ్పై దృష్టి పెట్టింది. అక్కడ 'విక్కీ డోనర్'తో గుర్తింపు తెచ్చుకుని, 'కాబిల్', 'ఉరి', 'ఓ మై గాడ్' వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక దర్శకుడు ఆదిత్య ధర్తో 'ఉరి' సినిమా సమయంలో ప్రేమలో పడిన యామీ, 2021లో ఆయనను వివాహం చేసుకుంది. వివాహానంతరం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె, 'ఆర్టికల్ 370', 'హక్' వంటి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా 'ధురంధర్ 2'లో గెస్ట్ రోల్లో కనిపించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

గతంలో నటి యామీ గౌతమ్ బాలీవుడ్లో తాను ఎదుర్కొన్న వివక్ష, అవమానాల గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. యామీ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్లో తాను ఎన్నోసార్లు వివక్షను ఎదుర్కొన్నానని వెల్లడించారు. 'కొన్ని సందర్భాల్లో నేను ఈ ఇండస్ట్రీలో భాగమే కాదన్న ఫీలింగ్ కలిగేది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు... ఒక చూపే చాలుతుంది' అని భావోద్వేగానికి లోనయ్యారు. సెట్స్లో తనను చులకనగా చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయని, ఇతర హీరోయిన్లకు ఇచ్చే గౌరవం తనకు ఇవ్వలేదని ఆమె వెల్లడించారు.
ఇంకా కొన్ని సందర్భాల్లో తాను పూర్తిగా ఒంటరిగా ఫీలయ్యానని యామీ భావోద్వేగంగా చెప్పారు. 'చుట్టూ అందరూ ఉన్నా.. నేను పరాయి వ్యక్తిలా అనిపించేది. హీరోయిన్గా తీసుకుని తర్వాత అవకాశాలు తీసేయడం జరిగేది. కారణాలు కూడా చెప్పేవారు కాదు' అంటూ తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. బయటకు కనిపించే బాలీవుడ్ ప్రపంచం, లోపల ఉన్న వాస్తవ పరిస్థితులకు అసలు సంబంధం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అయితే ఈ కష్టకాలంలో తన కుటుంబం, ముఖ్యంగా భర్త ఆదిత్య ధర్ తనకు ఎంతో బలంగా నిలిచారని యామీ తెలిపారు. 'ఒక ఫోన్ కాల్ నా అమ్మకు లేదా సిస్టర్కు చేస్తే చాలు... ఇప్పుడు ఆదిత్య కూడా ఉన్నాడు. మేమిద్దరం ఒకే విలువలతో జీవిస్తాం' అంటూ భావోద్వేగంగా చెప్పారు. తన జీవితంలో ఆదిత్య రావడం తర్వాత తన ఆలోచనా విధానం మారిందని, కష్టాల మధ్య ముందుకు సాగేందుకు ఆయన ప్రోత్సాహం ఇచ్చారని వెల్లడించారు. ఒకప్పుడు వివక్ష ఎదుర్కొన్న అదే ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రశంసలు అందుకోవడం ఆమె ప్రయాణం నిజంగా స్పూర్తిదాయకమే. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.


Click it and Unblock the Notifications

















