కాదంబరీ జత్వానీ కేసుతో పోలీస్ పెద్దల మెడకు ఉచ్చు..బెజవాడకు ముంబై నటి!
ముంబైకి చెందిన నటి కాదంబరీ జత్వానీని విజయవాడకు చెందిన కొందరు వైసీపీ నేతలు శారీరికంగా, మానసికంగా వేధించడం కలకలం రేపింది. ఇందులో పలువురు నేతలు, ఐపీఎస్ వంటి కీలక అధికారుల పేర్లు తెరపైకి రావడంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. జత్వానీని వేధించిన ఘటనలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్రపై నిర్ధారణ జరిగినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై వేటు పడుతుందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
కృష్ణాజిల్లాకు చెందిన విద్యాసాగర్ అనే వైసీపీ నేత ముంబైకి చెందిన సినీనటి కాదంబరీ జత్వానీని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి, ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించిన వ్యవహారం దుమారం రేపింది. కాదంబరీ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో విద్యాసాగర్ ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆరోపణలు వచ్చాయి. నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల సాయంతో ఈ ఇష్యూని సెటిల్ చేసుకోవాలని చూశారు. తప్పుడు కేసులు పెట్టి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులను జైలుకు పంపినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి.

కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా దీని ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం, బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముంబైలో ఆమెను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం సినీనటి, ఆమె కుటుంబ సభ్యులకు రిమాండ్ విధించింది. జైలు నుంచి బయటికొచ్చాక పెళ్లి మాటెత్తితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి.. కాదంబరీ, ఆమె కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో కాదంబరీ, ఆమె ఫ్యామిలీ తిరిగి ముంబైకి వెళ్లిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కాదంబరీ నేరుగా విజయవాడ సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై వాపోయారు. వైసీపీ నేతలు, పోలీసుల వల్ల తాను , తన కుటుంబం చాలా ఇబ్బంది పడ్డామని కాదంబరీ జత్వానీ ఆవేదన వ్యక్తం చేసింది. విద్యాసాగర్ ప్రేమను తిరస్కరించాననే తనపై కక్షకట్టారని ఆమె ఆరోపించారు. 17 క్రిమినల్ కేసులు ఉన్న విద్యాసాగర్కు వైసీపీ నేతలు ఎందుకు మద్ధతు ఇస్తున్నారని జత్వానీ ప్రశ్నించారు. ఆపై కాదంబరీని వేధించిన ముగ్గురు ఐపీఎస్లు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై ఫిర్యాదు చేసినట్లు నటి లాయర్ తెలిపారు.
కాదంబరీ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో కలకలం రేపడంతో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించమన్నారు. ఈ నేపథ్యంలో నాడు విజయవాడలో విధులు నిర్వర్తించిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్లు నాటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీలపై రేపో మాపో చర్యలు తప్పవంటూ పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











