‘మగాళ్లు విప్పుకుని తిరిగితే ఓకే.. అమ్మాయిలు అయితే తప్పా?'
ఇండస్ట్రీలో మహిళల వస్త్రధారణపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు శివాజీ వ్యాఖ్యలకు మద్దతు తెలపగా, మరికొందరు వాటిని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి దుస్తులు ధరించకూడదు అనే అంశంపై పెద్ద చర్చ మొదలైంది. ఇదే సమయంలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) స్పందిస్తూ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
మహిళలపై పెరుగుతున్న వేధింపులకు వారి దుస్తులనే కారణంగా చూపించే ఆలోచనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మీ మాట్లాడుతూ.. మహిళల డ్రెస్సింగ్ను కారణంగా చూపిస్తూ వేధింపులను సమర్థించడం పూర్తిగా తప్పు అని అన్నారు. ఒక మహిళ ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని, దుస్తుల ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని తీర్పు చేయడం సరైంది కాదని చెప్పారు. సమాజంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు దుస్తులు కారణం కావని, అసలు సమస్య మనుషుల ఆలోచనా విధానంలోనే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ..'మీ ఇంట్లో మీ అక్క లేదా చెల్లి షార్ట్ వేసుకుని బయటకు వెళ్తే.. వారిని చూసి మీకు చెడు ఆలోచనలు వస్తాయా?' అని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న మహిళలను చూసినప్పుడు అలాంటి ఆలోచనలు రాకపోతే, బయట ఉన్న మహిళలను చూసినప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. ఇది వ్యక్తిత్వ లోపమేనని ఘాటుగా విమర్శించారు.
మహిళల లోదుస్తులపై కూడా సమాజంలో విభిన్న దృక్కోణాన్ని కూడా వరలక్ష్మీ బయటపెట్టారు. పురుషుల దుస్తులతో పోల్చుతూ 'మగవారు జీన్స్ ప్యాంట్ వేసుకుని వంగినప్పుడు వారి లోదుస్తులు కనిపిస్తాయి. కానీ దానిని చూసి ఎలాంటి మహిళా వారిపై అఘాయిత్యాలకు పాల్పడదు కదా?'అని ప్రశ్నించారు. అదే ఒక మహిళ బ్రా స్ట్రాప్ బయటకు కనిపిస్తే దాన్ని పెద్ద విషయంగా తీసుకుని విమర్శించడం సరైంది కాదని అన్నారు. బ్రా అనేది కేవలం ఒక ఇన్నర్వేర్ మాత్రమేనని, అది ప్రతి మహిళకు సాధారణమైన అవసరమని చెప్పారు.
ఈ విషయాన్ని పురుషుల విషయంలో ఒప్పులాగా, మహిళల విషయంలో మాత్రం ఎందుకు తప్పుగా ఎందుకు చూస్తారని ఆమె ప్రశ్నించారు. ఇది సమాజంలో ఉన్న ద్వంద్వ వైఖరిని చూపిస్తోందని అన్నారు.'వారి బాడీ వాళ్ల ఇష్టం.. మీ చెల్లి, అమ్మలతో ఎలా పద్దతిగా ఉంటారో.. బయట మహిళలతో ఎందుకు పద్దతిగా ఉండరు' అని ప్రశ్నించారు. అందాన్ని మెచ్చుకోవడం తప్పు కాదని, కానీ అది గౌరవప్రదంగా ఉండాలని, కానీ, అమ్మాయిల విషయంలో హద్దులు దాటకూడదు అని వరలక్ష్మీ హెచ్చరించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం సమాజానికి ఎంతో అవసరమని ఆమె తెలిపారు. మహిళలు వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా గళం ఎత్తాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన సరస్వతి. ఈ సినిమా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చూపించారు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











