అందుకే పిల్లల్ని కనలేదు .. నా మరణం తర్వాత ఆస్తులన్నీ .. విజయశాంతి డేరింగ్ స్టెప్
చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు ఉన్నా కొందరే ప్రజలపై తరతరాలుగా ప్రభావం చూపుతారు. ఇలాంటి కోవలోకే వస్తారు విజయశాంతి. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా, లేడీ అమితాబ్గా స్టార్ హీరోల రేంజ్లో క్రేజ్తో రికార్డులన్ని తిరగరాశారు విజయశాంతి. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఇప్పటికీ అదే క్రేజ్. చివరి వరకు ప్రజా సేవలోనే తరిస్తానని చెబుతున్న ఆమె.. గతంలో తన జీవితంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అలనాటి నటి విజయలలితకు కూతురు వరుస అవుతారు విజయశాంతి. సినీ నేపథ్యం ఉండటంతో 15వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె 40 ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 1980లలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన విజయశాంతి.. తెలుగు , తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 200 సినిమాలలో నటించారు. దక్షిణ భారతదేశంలోని అందరు అగ్ర హీరోలతో నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు విజయశాంతి. నటిగా తొలుత రూ.5000 పారితోషికం తీసుకున్న విజయశాంతి.. పదేళ్లు తిరిగే సరికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటిగా విజయశాంతి చరిత్ర సృష్టించారు.

కెరీర్లో చాలా మంది హీరోలతో నటించినప్పటికీ అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలలో నటించారు . వీరిద్దరితో చేసిన సినిమాలు ఆమెకు పేరు తీసుకురావడంతో పాటు హిట్ పెయిర్ అనిపించుకున్నారు. కర్తవ్యం, ప్రతిఘటన, నేటిభారతం, రేపటి పౌరులు, ఓసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. అయితే అగ్రనటులతో విజయశాంతి నటించకపోవడం వారి అభిమానులను నిరాశకు గురిచేసింది.
కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాంబు పేల్చారు విజయశాంతి. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా ఉన్న సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి దిగి అనంతరం ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించిన ఆమె.. 2014లో ఓటమి పాలు కావడంతో రాజకీయాలకు, సినిమాలకు దూరమయ్యారు. కొన్నేళ్ల తర్వాత మహేశ్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు, తాజాగా కళ్యాణ్రామ్తో కలిసి అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో నటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్నాళ్లు పనిచేసిన విజయశాంతి ఆ తర్వాత బిజేపీలోకి వెళ్లి , తిరిగి హస్తం గూటికి చేరుకుని ఇటీవల ఎమ్మెల్సీగా ఛాన్స్ కొట్టేశారు.
2014 ఎన్నికల తర్వాత తన ఆరోగ్యం క్షీణించి సర్జరీ జరిగిందని తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని అందుకే సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు విజయశాంతి తెలిపారు. జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలన్న ఉద్దేశంతో తాము పిల్లల్ని కనొద్దు అనుకున్నామని.. మరణాంనతరం నా ఆస్తి మొత్తం ప్రజలకు దక్కేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్య, వైద్యం కోసం నా ఆస్తిని కేటాయిస్తానని విజయశాంతి పేర్కొన్నారు. ఇప్పటికీ నా దగ్గరున్న నగలన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేశానని లేడీ సూపర్స్టార్ తెలిపారు. ప్రస్తుతం విజయశాంతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











