సెల్ఫీ వంకతో అలాంటి ప్రవర్తన... అందరిముందే చావబాదిన విశాల్ ప్రియురాలు
భారతదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఒక మతమైతే సినీతారల్ని ఇలవేల్పుల మాదిరిగా కొలుస్తారు అభిమానులు. వారిని ఒక్కసారి చూసినా చాలు జన్మధన్యం అన్నట్లుగా అనుకునేవారు కోట్లలో ఉన్నారు. ఇక అభిమాన తారలతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు కొందరు ఉత్సాహం చూపుతారు. అయితే ఈ అభిమానం ఇటీవలి కాలంలో హద్దులు దాటుతోంది. తాజాగా సెల్ఫీ దిగేందుకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించిన ఓ అభిమానిని స్టార్ హీరోయిన్ చితకబాదారు. ఈ వివరాల్లోకి వెళితే..
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా విశాల్
నిన్న మొన్నటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా ఉన్నారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. 50కి చేరువ అవుతున్నా ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి చేసుకుంటారో లేదోనని అభిమానులు టెన్షన్ పడ్డారు. విశాల్ పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించినట్లుగా పలుమార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. మరికొందరైతే ఏకంగా పెళ్లి జరిగిపోయినట్లుగా వార్తలు వండి వార్చేవారు. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తాను ఓ హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు విశాల్. ఆ తర్వాత కొద్దిరోజులకే తన ప్రియురాలిని పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ సాయి ధన్సిక.

సాయిధన్సికతో ఎంగేజ్మెంట్
నడిగర సంఘం భవనం పూర్తి చేసుకున్నాకే తన పెళ్లి అని శపథం చేసిన విశాల్.. చెప్పినట్లుగానే చేశారు. సాయిధన్సికను త్వరలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపి గతేడాది ఆగస్ట్ 29న తన పుట్టినరోజు నాడు సాయి ధన్సికతో సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్నారు విశాల్. వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కొన్నేళ్లుగా వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరి వయసు తేడాపై సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్యా దాదాపుప 13 ఏళ్లు ఏజ్ గ్యాప్ రావడంతో దారుణంగా ట్రోలింగ్ చేశారు. దీనికి విశాల్ - సాయిధన్సికలు ఘాటుగా బదులిచ్చారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ పెళ్లి గురించి మాత్రం ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో వీరిద్దరి వివాహం ఎప్పుడన్న దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.
యోగి డా మూవీలో పవర్ఫుల్ యాక్టింగ్
ఇకపోతే సాయి ధన్సిక నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్స్టార్ రజనీకాంత్కు హీరోగా కబాలి సినిమాలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత షికారు సినిమాతో తెలుగువారిని పలకరించింది. అలాగే అంతిమ తీర్పు, దక్షిణ తదితర సినిమాలలో నటించింది. ప్రస్తుతం సాయి ధన్సిక లీడ్ రోల్లో నటించిన యోగి డా మూవీ ఫిబ్రవరి 6న విడుదలైంది. ఇందులో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. గౌతమ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. వీ సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగి డా మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటున్న సాయిధన్సిక ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని దురుసు ప్రవర్తన కారణంగా తాను చేయి చేసుకున్నట్లు వెల్లడించారు.
వెంటాడి చితకబాదా
ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కేరళలోని ఓ ప్రాంతంలో ఉన్నాం. ఓ వ్యక్తి అభిమానినంటూ నాతో సెల్ఫీ దిగాలని మా అంకుల్ని అడిగాడు. అయితే అప్పటికే సదరు వ్యక్తి పీకలదాకా తాగినట్లు గమనించిన మా అంకుల్.. నా దగ్గరికి పంపడానికి ఒప్పుకోలేదు. ఆ మాటలతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి మా అంకుల్ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇదంతా చూసిన నేను వాడిని పట్టుకుని.. వెంటాడి వెంటాడి చితకబాదాను. నా కోపం చూసిన ఆ చిత్ర హీరో, దర్శకుడు వెంటనే జోక్యం చేసుకుని నన్ను అడ్డుకున్నారు. నా అనుకున్న వాళ్లని ఏదైనా అన్నా, వాళ్లకి ఏమైనా జరిగినా నేను చూస్తూ ఉండలేను. అప్పటికే ఆత్మరక్షణ విషయంలో నేను ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఉండటంతో అది ఆ సమయంలో ఉపయోగపడిందని సాయి ధన్సిక తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సాయి ధన్సికను మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











