రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటిస్తే విమర్శిస్తారా? విశ్వంభర హీరోయిన్ ఫైర్!
సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో, ముఖ్యంగా టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్ల పాత్రల ప్రాధాన్యతపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో కథానాయికల పాత్రలు కేవలం గ్లామర్కే పరిమితమవుతున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలతో పాటు అలాంటి పాత్రలను అంగీకరిస్తున్న హీరోయిన్లపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటి ఆషికా రంగనాథ్(Ashika Ranganath)స్పందించారు. పాన్ ఇండియా సినిమాల హీరోయిన్లకు మద్దతుగా నిలుస్తూ.. సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ సోర్టీని పోస్టు చేసింది. అందులో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించింది. స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సినిమాల్లో నటించే కథానాయికలపై "కేవలం భారీ రెమ్యునరేషన్ కోసం, క్రేజ్ కోసం, గుర్తింపు కోసం మాత్రమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా కథలో ప్రాధాన్యత లేని పాత్రలను కూడా హీరోయిన్లు అంగీకరిస్తున్నారని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వాదనలో పూర్తి నిజం లేదని ఆషికా రంగనాథ్ స్పష్టం చేశారు.
'ఒక హీరోయిన్కు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడం అనేది కేవలం మరో సినిమా అవకాశం మాత్రమే కాదు. అది ఆమె కెరీర్ను జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాల ద్వారా ఒక నటికి కోట్లాది మంది ప్రేక్షకుల దృష్టిలో పడే అవకాశం లభిస్తుంది. అందువల్ల అలాంటి ప్రాజెక్టులను అంగీకరించడం వెనుక కేవలం డబ్బు మాత్రమే కాకుండా కెరీర్ గ్రోత్, మార్కెట్ విస్తరణ, భవిష్యత్ అవకాశాలు వంటి అనేక అంశాలు ఉంటా'యని ఆమె వివరించారు.
ప్రస్తుతం కమర్షియల్ సినిమాల నిర్మాణ శైలి కూడా పూర్తిగా హీరో-సెంట్రిక్గా మారిపోయిందని ఆషికా అభిప్రాయపడ్డారు. బాక్సాఫీస్ మార్కెట్, అభిమానుల అంచనాలు, థియేటర్లలో మాస్ రెస్పాన్స్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కథలు ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో హీరోయిన్ పాత్రలకు కథలో సహజంగానే పరిమిత స్థలం మాత్రమే మిగులుతోందన్నారు. యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్ సీన్లు, భారీ మాస్ మూమెంట్స్ మధ్య కథానాయిక పాత్రలు చాలా సందర్భాల్లో కేవలం గ్లామర్ ప్రెజెన్స్కే పరిమితమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే దీనికి నటీమణులను బాధ్యులను చేయడం సరైన పద్ధతి కాదని ఆమె స్పష్టం చేశారు. ఒక సినిమాలో మహిళా పాత్ర బలహీనంగా కనిపిస్తే లేదా కథలో ఆమెకు సరైన ప్రాధాన్యత లేకపోతే దానికి కారణం ఆ పాత్రను పోషించిన నటి కాదు. ఆ పాత్రను రాసిన రచయితలు, రూపొందించిన దర్శకులు, ఆమోదించిన నిర్మాతలే ప్రధాన బాధ్యత వహించాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా పాత్రలకు మరింత లోతు, స్వతంత్రత, కథలో ప్రాధాన్యత కల్పించే బాధ్యత మేకర్స్పైనే ఉందని పేర్కొన్నారు.
ఆషికా రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా మంది నెటిజన్లు ఆమె అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ హీరోయిన్లను విమర్శించే ముందు ఇండస్ట్రీలో ఉన్న వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం కమర్షియల్ సినిమాల స్వభావం అలాంటిదేనని, బాక్సాఫీస్ అవసరాల దృష్ట్యా కొన్ని ఫార్ములాలను అనుసరించడం తప్పదని వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చర్చ మహిళా పాత్రల రూపకల్పనలో మార్పులకు దారితీస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications




