Ileana: ఇలియానాపై ఇండస్ట్రీ బ్యాన్.. అలా చేయడమే కారణమా?
ఒకప్పుడు టాలీవుడ్ను ఊపేసిన స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ (Ileana D Cruz). అయితే.. దాదాపు పదేళ్లుగా తెలుగు, తమిళ చిత్రాలకు దూరంగా ఉండడానికి బలమైన కారణమే ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి మరింత బలం చేకూర్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం.. ఇలియానాపై సౌత్ ఇండస్ట్రీలో అధికారికంగానే నిషేధం విధించారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
రూ.40 లక్షల అడ్వాన్స్.. ఆగిపోయిన సినిమా.. మొదలైన వివాదం
విషయానికొస్తే, రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలోనే ఇలియానాకు కోలీవుడ్లో ఓ భారీ ప్రాజెక్ట్ అవకాశం వచ్చిందట. ఆ సినిమాకు కమిట్ అయిన ఆమె, నిర్మాత దగ్గర అడ్వాన్స్గా రూ.40 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే వివిధ కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో నిర్మాత అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని కోరగా, ఇలియానా డబ్బులు ఇవ్వనని, కావాలంటే ఇంకో సినిమా చేస్తానని దురుసుగా ప్రవర్తించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాగ్ షీట్ల పరిశీలనలో బయటపడ్డ నిజాలు
ఈ నేపథ్యంలో నిర్మాత కాట్రా గడ్డ ప్రసాద్ చేసిన పాత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇలియానా బ్యాన్కు దారి తీసిన వివాదంపై సంచలన విషయాలను బయటపెట్టారు. తాను ఇండస్ట్రీలో తలెత్తే అనేక వివాదాలను దగ్గర నుంచి చూశానని, వాటిలో చాలావరకు పరిష్కరించిన అనుభవం తనకు ఉందని కాట్రా గడ్డ ప్రసాద్ తెలిపారు. అదే క్రమంలో హీరోయిన్ ఇలియానా విషయంలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఒక తమిళ నిర్మాత దగ్గర సినిమా చేస్తానని చెప్పి ఇలియానా అడ్వాన్స్గా రూ.40 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ సినిమా కోసం డేట్లు ఇవ్వకుండా, తీసుకున్న అడ్వాన్స్ను కూడా తిరిగి చెల్లించకుండా నిర్మాతను ఇబ్బంది పెట్టిందని ఆయన ఆరోపించారు.
దీంతో ఆ తమిళ నిర్మాత ఈ విషయాన్ని కోలీవుడ్ నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశాడట. అనంతరం కౌన్సిల్ ఇలియానాను పిలిపించి ప్రశ్నించగా, తాను కొన్ని డేట్లు ఇచ్చానని, కానీ ఆ డేట్లను ప్రొడ్యూసర్ వినియోగించుకోలేదని చెప్పిందట. అంతేకాదు, అడ్వాన్స్ను తిరిగి ఇవ్వలేనని కూడా స్పష్టం చేసిందని తెలిపారు. అయితే పరిశ్రమ నిబంధనల ప్రకారం, అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా చేయాలి లేదా ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోతే ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కాట్రా గడ్డ ప్రసాద్ వివరించారు.
ఒకవేళ డేట్ ఇచ్చిన తర్వాత కనీసం ఒక్క షాట్ అయినా నటిస్తే, ఆ సినిమా ఆగిపోయిన సందర్భంలో అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు. కానీ ఇలియానా విషయంలో అలా జరగలేదని స్పష్టం చేశారు. ఆమె ఆ నిర్మాత సినిమా కోసం ఒక్కరోజు కూడా షూటింగ్కు హాజరు కాలేదని, కనీసం మేకప్ వేసుకుని లొకేషన్ చుట్టూ కూడా తిరగలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో డబ్బులు తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు. అయితే ఇలియానా తాను డేట్లు ఇచ్చానని చెప్పుతూ కొన్ని ఫేక్ డేట్లను చూపించిందని, వాటిని లాగ్ షీట్ల ద్వారా చెక్ చేయగా, ఆ రోజుల్లో ఆమె మరో సినిమాకు షూటింగ్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. దీంతో ఇలియానా మోసం బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారం తర్వాత ఆమెకు డబ్బులు తిరిగి చెల్లించాలా? లేక బ్యాన్ను ఎదుర్కోవాలా? అనే రెండు ఆప్షన్లు ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ ఇలియానా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో, సౌత్ ఇండస్ట్రీలో ఆమెపై నిషేధం విధించినట్లు తెలిపారు. అంతేకాదు, ఆమె అప్పటికే సౌత్లో మరికొన్ని సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చిందని, ఆ ప్రొడ్యూసర్లకు కూడా ఫోన్ చేసి, ఇలియానాపై సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఉందని హెచ్చరించినట్లు చెప్పారు. "ఆ రూ.40 లక్షలు మీరు కడితేనే ఆమెతో సినిమాలు చేయండి" అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
ఆ సమయంలో డైరెక్ట్గా ఇలియానా డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని కూడా చెప్పామని, కానీ ఆ దిశగా ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. దీంతో బ్యాన్ కొనసాగుతూనే ఉందని, ఆ తర్వాత ఆమె నటించిన 'త్రీ ఇడియట్స్' సినిమా (తెలుగులో స్నేహితులు)నే సౌత్లో ఆమె చివరి చిత్రం అయిందని వెల్లడించారు. ఇలా ఇలియానా వ్యవహారం ఇండస్ట్రీలో ఒక ఉదాహరణగా మారిందని, ఇలాంటి సమస్యలను తాము ఇతర సందర్భాల్లో కూడా చక్కదిద్దుతూ వచ్చామని కాట్రా గడ్డ ప్రసాద్ తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి, ఇలియానా సౌత్ సినిమాలకు దూరమైన అసలు కారణంపై మరోసారి పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.


Click it and Unblock the Notifications











