Sai Pallavi సాయి పల్లవిని వెంటాడుతున్న పాత వివాదం.. ఎలక్షన్ టైమ్లో వీడియో వైరల్
తన పనేదో తాను చూసుకోవడం, మనసుకు నచ్చిన సినిమా చేయడం లేదంటే కుటుంబంతోనే గడపడం సాయిపల్లవి స్టైల్. ఒక్క సినిమా చేసినా తరాలు తనను గుర్తుపెట్టుకునేలా వుండాలన్నదే ఆమె అభిమతం. సాయిపల్లవి ఓ సినిమాకు కమిట్ అయ్యిదంటే ఆ కంటెంట్లో ఏదో కొత్తదనం వుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా పడింది. నటనే కాదు.. డ్యాన్స్ల్లోనూ ఆమెకు తిరుగులేదు. క్రేజ్ వున్నప్పుడే దానిని క్యాష్ చేసుకోవాలనే అభిప్రాయం సినీ జనాల సెంటిమెంట్. కానీ సాయిపల్లవి తీరు అందుకు పూర్తి భిన్నం. తన పాత్ర నచ్చకపోతే.. ఎంత పెద్దమొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేసినా తనకి నచ్చకుంటే నో చెప్పేయడమే. ఇవన్నీ కూడా ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. అందుకే సాయిపల్లవిని లేడీ పవర్స్టార్ అంటూ ముందుగా పిలుచుకుంటారు అభిమానులు.
ఈ ఏడాది, వచ్చే ఏడాది సాయిపల్లవి డైరీలో అసలు ఖాళీలు లేవు. ఆమె నటించిన అమరన్ తమిళంలో రిలీజ్కు రెడీ అయ్యింది. మరోవైపు ఈ ఏడాది సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రణ్బీర్ కపూర్ సరసన రామాయణతో పాటు మరో చిత్రంలో ఆమె నటిస్తున్నారు. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ తెరకెక్కనుంది. కన్నడ స్టార్ హీరో యశ్ రావణాసురుడి క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్స్ ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్లు ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెబుతూనే మేకర్స్ ఈ సినిమాను సైలెంట్గా సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఈ మూవీలో రాముడు, సీత పాత్రల్లో వున్న రణ్బీర్ కపూర్, సాయిపల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్, సీత గెటప్స్లో వీరిద్దరూ అందంగా వున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ ఫోటోలు బయటకు వచ్చాయో లేదో వివాదాలకు, కాంట్రవర్సీలకు దూరంగా వుండే సాయిపల్లవి ఉత్తరాది జనాలకు టార్గెట్ అయ్యారు. సీతమ్మ తల్లిగా ఆమె లుక్స్ బాగాలేవని ఒక వర్గం ట్రోలింగ్ మొదలెట్టింది. కానీ సీతగా సాయిపల్లవి పెర్ఫార్మెన్స్పై ఎవరికీ అనుమానమే అక్కర్లేదు. తన పాత్రకు ప్రాణం పెట్టయినా న్యాయం చేస్తారామె. గత సినిమాల ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. మరి ఎందుకు ఇంతలా ఆమెపై విషం కక్కుతున్నారంటే '' ది కాశ్మీర్ ఫైల్స్ '' మూవీ కారణంగానే.
దశాబ్ధాల కిందట జమ్మూకాశ్మీర్లోని కశ్మీరీ పండిట్ల ఊచకోత, వారిపై జరిగిన దారుణాలే ఇతివృత్తంగా వివేక్ అగ్నిహోత్రి రెండేళ్ల క్రితం '' ది కాశ్మీర్ ఫైల్స్ '' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వివాదాలకు, సంచలనాలకు కారణమైన ఈ సినిమాపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఉగ్రవాదుల అరాచకం, గోరక్షకులు ముస్లిం వ్యక్తిపై చేసిన దాడి ఒకటే అన్నట్లుగా ఆమె మాట్లాడారు. హింస ఏదైనా హింసేనని సాయిపల్లవి పేర్కొన్నారు. దీనిపై భజరంగ్దళ్ కార్యకర్తలు మండిపడ్డారు. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాదు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు కూడా.

వివాదం ముదరడంతో సాయిపల్లవి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఓ డాక్టర్గా ప్రాణం విలువ తనకు తెలుసునని.. తాను ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూడకుండానే ఓ చిన్న క్లిప్ను వైరల్ చేశారని .. మంచి మనుషుల్లా జీవించాలనే ఆ ప్రస్తావన తీసుకొచ్చానని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వివాదం కాస్తా సద్దుమణిగింది. కానీ నార్త్లోని ఓ సెక్షన్ సాయిపల్లవిని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు రామాయణలో సీత పాత్రలో నటిస్తూ వుండటంతో సరిగ్గా ఆమె దొరికింది. ఇంకేముందు పాత వీడియోను, సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. దేశంలో లోక్సభ ఎన్నికల ఫీవర్ నేపథ్యంలో ఈ అంశం మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











