రాజమౌళి ఆఫర్నే రిజెక్ట్ చేసిన త్రిష ... కెరీర్లో పెద్ద మిస్టేక్ చేసిందా..?
సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. నేడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే హీరోయిన్లే ఎక్కువ. కనీసం వారు నటించిన సినిమా పేరేంటో కూడా ప్రేక్షకులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక ఫేడవుట్ అయిపోతున్న వారు ఎందరో. గతంలో సావిత్రి, వాణిశ్రీ, జమున, విజయశాంతి, సౌందర్య వంటి వాళ్లు దశాబ్ధాల తరబడి కథానాయికలుగా చిత్రసీమను శాసించారు.
కానీ ఇప్పుడు రోజులు మారాయి వరుస హిట్లు పడి, బొమ్మ బాగా ఆడితే మూడేళ్లు మహా అయితే మరో రెండేళ్లు అంతే. ఈ టైంలోనే తమను తాము నిరూపించుకుని నిలబడగలగాలి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని హీరోయిన్లు బాగా ఫాలో అవుతారు. అయితే ఈ తరంలోనూ కొందరు నటీమణులు దశాబ్ధాల తరబడి కెరీర్ కొనసాగిస్తూ, లేడీ సూపర్స్టార్లు అనిపించుకుంటున్నారు . నయనతార, అనుష్క, సమంతలు ఈ కోవలోకే వస్తారు. ఈ లిస్ట్లో వినిపించే మరో పేరు త్రిష. చిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ..దాదాపు పాతికేళ్లుగా హీరోయిన్గా కొనసాగుతున్నారు త్రిష కృష్ణన్.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేటికీ తిరుగులేని నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారామె. ఎప్పటికప్పుడు త్రిష పని అయిపోందిరా అన్న దశ నుంచి ఇంకొన్నాళ్ల వరకు ఆమెకు ఢోకా లేదురా అనిపించుకుంటున్నారు. జోడీ (తమిళ్) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిషకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్లో నిలదొక్కుకున్న తర్వాత నీ మనుసు నాకు తెలుసు అంటూ తెలుగువారికి పరిచయమయ్యారు. ప్రభాస్తో నటించిన వర్షం త్రిష కెరీర్నే మార్చేసింది. ఆ వెంటనే నువ్వొస్తానంటే నేనొద్దంటానా , అతడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు వంటి వరుస బ్లాక్ బస్టర్స్తో దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందారు.
హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిలైపోవాలని ఆమె భావించారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపారవేత్తతో ఆమెకు ఎంగేజ్మెంట్ అవ్వగా.. అనూహ్య కారణాలతో నిశ్చితార్ధం రద్దయ్యింది. దీంతో త్రిషపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఆమె కృంగిపోకుండా సినిమాలపైనే దృష్టి పెట్టింది. 96 మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యి.. మణిరత్నం పొన్నియన్ సెల్వన్తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ని మించి అందంగా కనిపించింది. 40 ప్లస్లోనూ ఇంత గ్లామరస్గా ఎలా ఉండగలుగుతున్నారంటూ అభిమానులే ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
అలాంటి త్రిష ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న సినిమాలో నటించనని చెప్పేసిందట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్నతో కలిసి పనిచేయాలని స్టార్ హీరోలే ఎదురు చూస్తుంటారు. ఆయన ఛాన్స్ ఇస్తే చాలు .. ఒక్క నిమిషమైనా సినిమాలో కనిపించాలని కలలు కనేవారు ఎందరో. అలాంటిది రాజమౌళీయే పిలిచి మరీ త్రిషకు ఛాన్స్ఇస్తానంటే ఆమె నో చెప్పేసిందట. త్రిష ఆ నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కారణమే ఉందట.
రాజమౌళీ హీరోయిన్గా ఆఫర్ చేసింది .. ఓ స్టార్ హీరో సరసన కాదు, కమెడియన్ కమ్ హీరో సునీల్తో. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మర్యాద రామన్నలో ఫిమేల్ లీడ్ రోల్ కోసం త్రిషను సంప్రదించారట రాజమౌళీ. అయితే అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో, కమెడియన్ పక్కన చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో రాజమౌళీ లాంటి డైరెక్టర్ అడిగినా నిర్మోహమాటంగా నో చెప్పారట త్రిష. దీంతో జక్కన్న సలోనీని హీరోయిన్గా తీసుకున్నారు. మర్యాద రామన్న బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినా.. తర్వాత సలోనీకి క్రేజీ ఆఫర్లేమీ రాలేదు. సో.. అదన్న మాట మ్యాటర్.


Click it and Unblock the Notifications











