అలాంటి చిల్లర పనులు చేయను.. కృతి సనన్కు స్టార్ హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
బాలీవుడ్లో తాజాగా మరో సోషల్ మీడియా వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి యామీ గౌతమ్ (Yami Gautam)పేరు అనూహ్యంగా ఒక వైరల్ ఘటనతో వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్టు కారణంగా ఆమెపై విమర్శలు వెల్లువెత్తగా, నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా మరో బాలీవుడ్ స్టార్ కృతిసనన్ ( Kriti Sanon)పేరుతో ఈ విషయం ముడిపడటంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వివాదం ఎలా మొదలైంది? అసలు నిజం ఏంటి?
ఎలా మొదలైంది వివాదం?
గత కొంతకాలంగా హీరోయిన్ కృతిసనన్, యామీ గౌతమ్ మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్లో కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' సినిమాకుగానూ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఈ సమయంలో కృతీ సనన్కు బదులుగా యామీ గౌతమ్కు ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని కొందరూ ఓ వీడియో క్రియేట్ చేశారు. అందులో తాను అవార్డులను పట్టించుకోను అంటూ యామీ గతంలో అన్న మాటల్ని ఆ వీడియోలో యాడ్ చేశారు.

కృతిని విమర్శిస్తున్న ఆ వీడియోను యామీ లైక్ కొట్టడంతో వివాదం స్టార్ అయింది. దీంతో ఈ విషయం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. కృతిసనన్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుపై వ్యంగ్యంగా మాట్లాడినట్లు కనిపించడంతో, యామీ గౌతమ్పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
యామీ గౌతమ్ స్పందన
ఈ వివాదం పెరగడంతో యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన పేరు మరో నటిని విమర్శించినట్లు చూపించేలా ప్రచారం జరగడం తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. తన పోస్టులో ఆమె ఇలా పేర్కొన్నారు. 'ఒక నటిని అవమానించేలా ఉన్న రీల్కు నేను లైక్ చేశానని నాకు తెలిసింది. ప్రతి రోజూ మమ్మల్ని చాలా పోస్టుల్లో ట్యాగ్ చేస్తుంటారు. అవార్డులకు సంబంధించిన ఒక సాధారణ ట్యాగ్లా అది కనిపించింది. నేను ఉద్దేశపూర్వకంగా లైక్ చేయలేదు. పొరపాటున క్లిక్ అయ్యి ఉండవచ్చు.' అని తెలిపారు.
చీప్ పీఆర్ స్టంట్స్ చేయను
ఇంకా యామీ మాట్లాడుతూ తాను ఎప్పుడూ చీప్ పీఆర్ స్టంట్స్కు పాల్పడలేదని స్పష్టం చేశారు. 'నా కెరీర్లో నేను ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్స్ చేయలేదు. నా పని ఏమిటో అదే చేస్తూ ముందుకు సాగాను' అని తెలిపారు. ఇలాంటి చిన్న విషయాలను క్లిక్బైట్ వార్తలుగా మార్చి ప్రచారం చేయడం సరికాదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. 'ఈ రోజుల్లో క్లిక్బైట్ కోసం చిన్న విషయాలను కూడా పెద్ద గాసిప్లుగా మార్చేస్తున్నారు. కానీ నేను సంపాదించుకున్న గౌరవం దానికి మించినదని భావిస్తున్నా'అని ఆమె పేర్కొన్నారు.
తనకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదని కూడా యామీ గౌతమ్ స్పష్టం చేశారు. అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని చాలా కాలం క్రితమే వెల్లడించానని, తాను ఇప్పుడు పూర్తిగా తన పనిపైనే దృష్టి పెడుతున్నానని చెప్పారు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వివాదంపై యామీ గౌతమ్ ఇచ్చిన వివరణతో విషయం కొంతవరకు క్లారిటీకి వచ్చింది. అయినప్పటికీ ఈ సంఘటనపై నెటిజన్ల మధ్య చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











