Matthew Perry: బుల్లితెర రంగంలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
ఈ మధ్య కాలంలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎన్నో చిత్ర పరిశ్రమల్లో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎంతో పేరున్న నటీనటులు, టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు ఇటీవలి కాలంలో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హాలీవుడ్లో పెను విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రముఖ బుల్లితెర నటుడు, నిర్మాత మాథ్యూ పెర్రీ (54) కన్నుమూశారు. ఈ విషయాన్ని లాస్ ఏంజిల్స్ టైమ్స్ సంస్థ అధికారికంగా ప్రచురించింది.
'ఫ్రెండ్స్' అనే టీవీ సిరీస్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న మాథ్యూ పెర్రీ శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తన నివాసంలో విగతజీవిగా పడి ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని అతడి భౌతిక కాయాన్ని పరీక్షించారు. అప్పటికే మాథ్యూ మరణించినట్లు వాళ్లు ధృవీకరించారు.

నటుడు మాథ్యూ పెర్రీ విగతజీవిగా పడి ఉన్న ప్రదేశంలో ఎటువంటి డ్రగ్స్ గుర్తులు, అనుమానాస్పద వస్తువులు లేవని చెప్పారు. మొత్తానికి ఈ సీనియర్ నటుడు కార్డిక్ అరెస్ట్తోనే మృతి చెందాడని అధికారులు ప్రాథమికంగా స్పష్టం చేశారు. మాథ్యూ మృతిపై ఆయన అభిమానులు, సినీ ప్రియులు మొత్తం దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 1994 నుంచి 2004 వరకూ 10 సీజన్ల పాటు ప్రసారం అయిన 'ఫ్రెండ్స్' సిరీస్లో మాథ్యూ పెర్రీ చాండ్లర్ అనే పాత్రను పోషించారు. దీనివల్లే ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతేకాదు, ఇందులోని నటనకు గానూ అతడు రెండు సార్లు ప్రైమ్టైమ్ ఎమ్మీ నామినేషన్ను అందుకున్నారు. అలా మరింత పేరు ప్రఖ్యాతలను సంపాదించారు.
మాథ్యూ పెర్రీ 'ఫ్రెండ్స్' మాత్రమే కాకుండా 'స్టూడియో 60 ఆన్ ది సన్సెట్ స్ట్రిప్', 'గో ఆన్', 'ది ఆడ్ కపుల్' వంటి టెలివిజన్ ధారావాహికలలో కనిపించాడు. మరీ ముఖ్యంగా 'ది వెస్ట్ వింగ్' సిరీస్లో జో క్విన్సీ పాత్రకు గానూ అత్యుత్తమ అతిథి నటుడిగా 2003. 2004లో రెండు ఎమ్మీ నామినేషన్లు సాధించాడు.


Click it and Unblock the Notifications











