Akshay Kumar: వసూళ్ల గురించి అడిగి బాధ పెట్టకండి, సమాజంలో వస్తున్న మార్పు చూడండి: అక్షయ్ కుమార్
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎలాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారో అందరికీ తెలిసిందే. గతంలో వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్టు సినిమాలు చేసిన ఈయనకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. ముఖ్యంగా అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాలు చాలా వరకు డిజాస్టర్లుగా మారి వసూళ్ల వేటలో వెనక పడిపోతున్నాయి.
ముఖ్యంగా తాజాగా వచ్చిన చిత్రం మిషన్ రాణీగంజ్ కూడా వసూళ్లలో వెనకబడిపోయింది. ఈక్రమంలోనే అందరూ అక్షయ్ కుమార్ వసూళ్లు, బాక్సాఫీసు వద్ద ఎన్ని కోట్లు వసూలు చేసిందంటూ మాట్లాడుకుంటున్నారు. మరికొందరు అయితే నేరుగా అక్షయ్ కుమార్ నే బాక్సాఫీసు వద్ద ఎలాంటి వసూళ్లు సొంతం చేసుకుంటాయని ప్రశ్నిస్తున్నారు.

వారు అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేకపోయినప్పటికీ తాజాగా స్పందించారు. తాను చేస్తున్న సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తాయని పదే పదే అడిగి తనను ఇబ్బంది పెట్టద్దని చెప్పాడు. దాని వల్ల తాను నిరుత్సాహానికి గురవుతున్నానని వివరించాడు. ముఖ్యంగా తాను చేసిన సినిమాలు ఎలాంటి వసూళ్లను రాబట్టినా.. సమాజంలో మార్పు తీసుకు వచ్చే చిత్రాలు మాత్రమే చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను చేసే సినిమాలు అన్నీ బిజినెస్ పరంగానే కాకుండా కంటెంట్ పరంగా కూడా బాగున్నాయని.. అందుకే విజయాన్ని అందుకున్నాయని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. అలాగే తాను గతంలో చేసిన సినిమాలు, వాటిపై వచ్చిన వ్యతిరేకత గురించి మాట్లాడారు.

అభిమానులు అలా చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది: మంచి కథతో పాటు మసాలా మూవీలను కూడా తాను చేయగలనని అక్షయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మిషన్ రాణీగంజ్ చిత్రం ఆ కోవలోకే వస్తుందని... దాని కలెక్షన్లు ఎలా ఉన్నాయని అడుగుతూ ఒత్తిడికి గురి చేయవద్దని కోరారు. తాను చేసిన సినిమాలు సమాజానికి ఉపయోగపడితే చాలా సంతోషంగా అనిపిస్తుందని... ప్రేక్షకులు కూడా మంచి సినిమాలు చేస్తున్నావు, మా పిల్లలతో కలిసి థియేటర్లకు వెళ్తున్నామని ధైర్యంగా చెబితే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుందని అన్నారు. అభిమానులు అంతా తనను మోటివేట్ చేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.

గతంలో వచ్చిన టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథా, ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలు చేసినప్పుడు.. తనపై చాలా విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. కానీ ఆ రెండు చిత్రాలు సమాజాంలో చాలా మార్పు తీసుకొచ్చాయని చెప్పారు. అలాంటి కథలతో సినిమాలు తీస్తారా అని విమర్శించిన వారు కూడా సినిమా చూసి బాగుందని అన్నారని తెలిపారు. అలాగే ఆగస్టు 11వ తేదీన విడుదలైన ఓమై గాడ్ 2 సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్క్రీనింగ్ అవుతుందని... దేశంలోని యువత అంతా ఆ సినిమా చూస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఓమైగాడ్ 2 సినిమా ఎ సర్టిఫికేట్ వచ్చినందుకు తాను ఎవరినీ ప్రశ్నించాలనుకోలేదని అక్షయ్ కుమార్ అన్నారు. తనకు ఎవరితోనూ గొడవ పడడం ఇష్టం లేదని అలాగే నిబంధనల గురించి కూడా సరిగ్గా తెలియదని సూటిగా చెప్పేశారు. సర్టిఫికేట్ ఇచ్చే వాళ్లకు ఆ సినిమా ఎలా అనిపిస్తే అలా ఇస్తారని.. వారి అభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. తాము ఈ సినిమాను ఎవరి కోసం తీశామో వారికి చేరువైందని... అది తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications











