చాలా నిరాశ చెందా.. నా వైపు నుంచి తప్పు లేదు కానీ: అల్లు వారబ్బాయి
అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కెరీర్ లో నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కెరీర్లో సరైన హిట్ కొట్టి సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా తెరకెక్కిన ఏబీసీడీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న అల్లు శిరీష్ తన కెరీర్ విశేషాలను, తన లైఫ్ లోని కీలక సంఘటనలను తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడిన అల్లు శిరీష్.. తన సినీ కెరీర్లో ఒక్క క్షణం మూవీ తర్వాత నేను చేసిన సినిమా ఏబీసీడీ అని తెలుపుతూ ఒక్క క్షణం తాలూకు విషయాలను పంచుకున్నారు. ఒక్క క్షణం మూవీ చూసిన వారంతా సినిమా సూపర్ అనే టాక్ వెలిబుచ్చినప్పటికీ తీరా చూస్తే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాక పోవడం తనకు నిరాశ మిగిల్చిందని ఆయన అన్నారు. అయితే అలా ఎందుకు జరిగిందనే కోణంలో ఆరాతీయగా ఎన్నో కారణాలు దృష్టికి వచ్చాయని, భవిష్యత్ లో అలాంటి తప్పు చేయనని శిరీష్ పేర్కొన్నారు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విషయమై స్పందిస్తూ.. చిత్రానికి, మరో చిత్రానికి గ్యాప్ తీసుకోవాలనేది తన డిసీజన్ కాదని, తన వైపు తప్పు లేకున్నా పరిస్థితులు అలా వచ్చాయని శిరీష్ అన్నాడు. తనకు ప్రేమకథలంటేనే ఇష్టమని పేర్కొన్న ఆయన త్వరలోనే కొత్త సినిమా విశేషాలను తెలియజేస్తానని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

ఇక ఏబీసీడీ విషయానికొస్తే.. మలయాళంలో వచ్చిన ఏబీసీడీ చిత్ర రీమేక్ గా సంజీవ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మధుర శ్రీధర్ రెడ్డి , బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఏబీసీడీ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. రాజా, కోటా శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ రోజే (మే 17) విడుదలైన ఈ సినిమాపై ట్విట్టర్ రివ్యూలు పాజిటివ్గా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











