బియ్యం గింజంత ఉంటే.. బిర్యానీలా.. మెగా ఫ్యామిలీతో విభేదాలపై ఘాటుగా శివానీ రాజశేఖర్
ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 బ్యానర్పై తేజా మార్ని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోట బొమ్మాలి పీఎస్. ఈ సినిమాను బన్నీ వాసు, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్, శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమా నవంబర్ 24వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీలో పవర్ఫుల్ పాత్రను పోషించిన శివానీ రాజశేఖర్ ఫిల్మీబీట్తో మాట్లాడుతూ..
మెగా ఫ్యామిలీకి మా ఫ్యామిలికి మధ్య కొన్ని గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. కానీ లోపల ఒకటి జరిగితే.. బయట ఒక ప్రచారం జరిగింది. లోపల బియ్యం గింజ ఉంటే.. బయట దానిని బిర్యాని చేశారు. అదే ఇంకా కంటిన్యూ అవుతున్నది. పాలిటిక్స్లో ఉన్న అభిప్రాయబేధాలు రావడం సహజం. అదే మా మధ్య జరిగాయి. దాని వల్ల తీవ్ర ఆరోణలు రెండు కుటుంబాలు చేసుకొన్నాయి. ఆ తర్వాత విభేదాలు రెండు కుటుంబాల మధ్య సమసిపోయాయి. ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్లం. కోపతాపాలు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి అని శివానీ రాజశేఖర్ అన్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు అలాంటి గొడవలు జరగడం జీవితంలో ఓ భాగం. కానీ కొందరు పనిగట్టుకొని అవాస్తవాలను ప్రచారం చేశారు. దాంతో అప్పట్లో వివాదం మరింత ముదిరింది. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఓ వివాదాన్ని మరింత ముదిరేలా చేయడం బయట వాళ్లకు అవసరమా? అలాంటి వాళ్లను చూస్తే జాలి వేస్తుంది. మా ఫ్యామిలీపై ట్రోల్ చేయడం వల్ల వాళ్లకే నష్టం జరుగుతుందనే విషయం తెలుసుకోలేకపోవడం దారుణం అని శివానీ రాజశేఖర్ తెలిపారు.

మా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గొడవలు ఉన్నా మేము వారి ప్రొడక్షన్లో వర్క్ చేశాం. ఆ కుటుంబం నుంచి నాగబాబు లాంటి వాళ్ల మా ప్రొడక్షన్లో వర్క్ చేయడం జరిగింది. వ్యక్తిగత జీవితంలో గొడవలు పెట్టుకోవాలని ఆలోచించలేదు. అలా ఆలోచించడం వల్లే గీతా ఆర్ట్స్ వాళ్లు నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. కోట బొమ్మాలిలో మంచి పాత్రను చేయమని అడిగారు. అందుకే వారంటే నాకు పూర్తిగా గౌరవం ఉంది అని శివానీ రాజశేఖర్ చెప్పారు.

గతంలో మా మధ్య కొన్ని వివాదాలు చోటుచేసుకొన్నాయి. గతంలో జరిగిన విషయాలను మరిచిపోయాం. ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. వాటిని మళ్లీ తవ్వుకోవడం మాకు ఇష్టం లేదు. వారికి ఇష్టం లేదు. మధ్యలో ఉండే వాళ్లే మా గురించి ఏదో రాస్తుంటారు. వాటిని మేము పట్టించుకోం అని శివానీ రాజశేఖర్ అన్నారు.

మీరు ఒక ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్నంత మాత్రాన మరో ఫ్యామిలీపై చెడుగా ప్రచారం చేయడం తప్పు. అలా చేయడం వల్ల ఎవరికి ఏమీ ఒరుగదు. దాని వల్ల రిలేషన్స్ దెబ్బ తింటాయి. అలా పనిగట్టుకొని ప్రచారం చేసే వారిని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. ఇలాంటి మానుకొంటే.. అందరూ మంచిగా ఉంటారని తెలుసుకొంటారని అనుకొంటాను అని శివానీ అన్నారు.


Click it and Unblock the Notifications











