‘విజయ్ దేవరకొండకు 23 కోట్ల రెమ్యునరేషనా? సమంతకు, నాకు ఎంత పారితోషికం అంటే?’
నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన తాజా చిత్రం ఖుషి. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్పై ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు కలిసి నటించిన ఈ సినిమాలోని పాటలు ట్రెండింగ్గా నిలిచాయి. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ..
ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే?: ఖుషి సినిమా కోసం మంచి సౌండ్ కావాలని అనుకొన్నాం. నాకు దర్శన పాట ఇష్టం. అందుకే మలయాళం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహబ్ను పిలిచి..ట్రై చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి పాటలు ఇవ్వడంతో హ్యాపీగా ఫీలయ్యాం. ఖుషి సినిమా మ్యూజిక్ అనుకొన్న దానికంటే ఎక్కువగా హిట్ అయింది. పాటలకు మంచి రెస్సాన్స్ రావడం మాకు మరింత జోష్ పెంచింది అని శివ నిర్వాణ తెలిపారు.

విజయ్ దేవరకొండ ప్లాన్ అది: అందుకే ఖుషి సినిమా కోసం పాటలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని అనుకొన్నాం. అందుకే మేము రీల్స్, షార్ట్స్తో ఎక్కువగా ప్రమోట్ చేశాం. ఇక మ్యూజిక్ కాన్సెర్ట్ పెట్టాలని విజయ్ చెప్పాడు. ఆయన ఆలోచన ప్రకారమే మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టడం, దానికి కూడా మంచి రెస్సాన్స్ రావడం హ్యాపీగా అనిపించింది అని శివ నిర్వాణ చెప్పారు.

మణిరత్నం సినిమా పేర్లతో పాట: ఖుషి సినిమాలో కాశ్మీర్, మణిరత్నం అంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్కు ఇష్టం. అందుకే ఓ పాటలో రోజా, దిల్ సే, అంజలి, గీతాంజలి సినిమా పేర్లు వచ్చేలా పాటను కంపోజ్ చేశాం. ఆ పాట పూర్తయిన తర్వాత వెంటనే తీసుకొచ్చి నిర్మాతలకు చూపించాం. వారికి కూడా నచ్చడంతో మిగితా పాటలు కూడా అదే జోష్తో చేశాం. ఆరాధ్య ఇతర పాటలు కూడా బాగా వచ్చాయి. అన్ని పాటలు నేనే రాశాను. ఇక ముందు సినిమాల్లో కూడా ఇతర రచయితలతోపాటు నేను కూడా పాటలు రాస్తాను అని శివ నిర్వాణ తెలిపారు.

సమంత ఆ వ్యాధి సోకడంతో: ఏప్రిల్ 2021లో సినిమా మొదలుపెట్టాం. నాలుగు నెలల్లో పూర్తి చేయాలని అనుకొన్నాం. కశ్మీర్లో తొలి షెడ్యూల్ చాలా క్విక్గా పూర్తి చేశాం. ఆ తర్వాత సమంత అనారోగ్యంతో బాధపడటం.. మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో సినిమా ఆగిపోయింది. అయితే సమంత 15 రోజుల్లో వస్తుందని అనుకొన్నాం. కానీ పరిస్థితి చేజారడంతో చాలా కాలం షూటింగ్ ఆగిపోయింది. సమంత పరిస్థితి తెలిసిన తర్వాత విజయ్ దేవరకొండ, నిర్మాతలందరూ ఆమె ఆరోగ్యం బాగైన తర్వాతే షూటింగ్ మొదలుపెడుదామని అనుకొన్నాం అని శివ నిర్వాణ చెప్పారు.

విజయ్ దేవరకొండ, తన రెమ్యునరేషన్ గురించి: ఖుషి సినిమా కోసం 13 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొన్నానని మీడియాలో వచ్చిన వార్తలను దర్శకుడు శివ నిర్వాణ కొట్టిపడేశాడు. నాకు మాత్రమే 13 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే.. నిర్మాతలు సినిమా తీయగలరా? ఆ వార్తల్లో నిజం లేదు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి.. చాలా మంది నా ఫ్రెండ్స్ కాల్ చేసి.. సైలెంట్గా బాగా సంపాదిస్తున్నావు కదరా అని అన్నారు. నా ఫ్రెండ్స్ను వదిలేస్తే.. మా అమ్మ కూడా 13 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్నావా? అని అడిగింది. మీడియాలో నా రెమ్యునరేషన్ గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు అని శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు.

మైత్రీ మూవీస్ నిర్మాతలు ఎలాంటి వారంటే?: విజయ్ దేవరకొండకు 23 కోట్ల రూపాయలు, సమంతకు మూడు కోట్ల రూపాయలు, నాకు 13 కోట్ల రూపాయలు ఇస్తే ... నిర్మాతలు సినిమా తీయడం సాధ్యమా? మీడియాలో వచ్చిన రెమ్యునరేషన్ వార్తల్లో నిజం లేదు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ క్వాలిటికి ప్రాధాన్యం ఇచ్చే నిర్మాతలు. వారు ఇచ్చే ఫ్రీడమ్ యూజ్ చేసుకొంటే.. మంచి సినిమా తీయవచ్చు. నిన్ను కోరి సినిమా నుంచి నాతో సినిమా చేయాలని అనుకొన్నారు. 2017 నుంచి సినిమా చేయాలని అనుకొన్నాం అని శివ నిర్వాణ చెప్పారు.


Click it and Unblock the Notifications











