సినిమాకు పనికి రావన్నారు.. ఆ అవమానంతోనే కసిగా.. ఎన్టీఆర్ వల్లే.. మోహన్ బాబు ఎమోషనల్
విలక్షణ నటుడు, విలన్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం విడుదలకు సిద్దమైంది. సమకాలీన రాజకీయాలపై విమర్శనాస్త్రం సంధించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఫిల్మీబీట్తో మోహన్ బాబు మాట్లాడుతూ..

స్వర్గీయ ఎన్టీఆర్ స్పూర్తితోనే
స్వర్గీయ నందమూరి తారక రామారావు నటనను చూసి నేను సినిమాల్లోకి రావాలనుకొన్నాను. నేను సినిమా నటుడిని కావాలనుకోవడానికి ఎన్టీఆర్ స్పూర్తి. అయితే రాయలసీమ వాడికి యాక్టింగ్ రాదు అని నన్ను కొందరు అవలంబించారు. రాయలసీమ వాళ్లకు తెలుగు భాషకు రాదు. మీ ప్రాంతం నుంచి నటులు లేరు. నీవు ఎలా నటుడివి అవుతావు. నటుడు కావాలంటే.. కృష్ణా, గంటూరు వాళ్లే సినిమాకు పనికి వస్తారని నాతో అవమానకరంగా మాట్లాడారు. వారి మాటలు తప్పు అని నిరూపించడానికి ఎన్టీఆర్ డైలాగ్ డెలివరిని చూసి నా కంటూ ఒక డైలాగ్ డెలివరిని అలవర్చుకొన్నాను. ప్రేక్షకులు ఆదరించారు అని మోహన్ బాబు తెలిపారు.

తెలుగు భాష పుట్టింది తిరుపతిలో
చరిత్రను పరిశీలిస్తే, అధ్యయనం చేస్తే తిరుపతిలోనే వాస్తవానికి తెలుగు భాష పుట్టింది. అనేక మంది కవులు, చరిత్రకాలు, తెలుగు సాహిత్యకారులు అక్కడే పుట్టారు. ప్రాంతాల వారీగా ఒక యాస ఉంటుంది. రాయలసీమది ఒక యాస. అంతేగానీ రాయలసీమ వాళ్లు సినిమాకు పనికిరారు అనడం బాధ కలిగింది. నా గురువు దాసరి నారాయణరావు ప్రోత్సాహం అందించడంతో నా కెరీర్ రివ్వును దూసుకెళ్లింది అని మోహన్ బాబు తెలిపారు.

అమ్రీష్ పురి నాకు అలాంటి ప్రశంస
దేశంలో ఎన్నో చిత్రాల్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించాను. నేను ఎన్నో విలన్ పాత్రలు పోషించాను. ప్రతీ విలన్ పాత్రకు ఓ మేనరిజం ఉండేలా చూసుకొన్నాను. కన్నడ నటుడు అంబరీష్, అమ్రీష్ పురి లాంటి వాళ్లు నా నటనను మెచ్చుకొన్నారు. ఓ సందర్భంలో అమ్రీష్ పురి మాట్లాడుతూ.. మీ నటనను, మీ సినిమాలను చూస్తుంటాను. మీ విలనిజం ఓ విభిన్నమైనది. మీకు మీరే సాటి అని అన్నారు.

విలన్ పాత్రకు రెడీ అంటూ
నాకు ఇప్పటికీ విలన్ పాత్రలు చేయాలని ఉంది. కానీ మన రచయితలు, దర్శకులు మూస ధోరణితో వెళ్తున్నారు. నాకు స్థాయికి తగిన విలన్ పాత్రలు వస్తే.. నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను. రజనీకాంత్తో ఓ విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ రజనీకాంత్ వద్దని అన్నారు. నిన్ను నేను కొట్టడం, నీవు నన్ను కొట్టడాన్ని ప్రేక్షకులకు నచ్చదు. నీకు నాకు మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో ఉండే విలనిజం ఉంటే నేను చేయడానికి సిద్ధమని రజనీకాంత్ చెప్పారు అని మోహన్ బాబు తెలిపారు.

సన్ ఆఫ్ ఇండియా ద్వారా సందేశం ఇదే..
సన్ ఆఫ్ ఇండియా చిత్రం విషయానికి వస్తే.. ఒక రాజకీయ నాయకుడి వల్ల అమాయకుడి జీవితం ఎలా నాశనం అయింది. అలా నాశనం అయిన ఓ వ్యక్తి.. నాలాగ ఎంతమంది ఇలా నాశనం అయ్యారని తెలుసుకొనే క్రమంలో ఆ వ్యక్తి ఎదుర్కొన్న సంఘటనలే ఈ చిత్ర కథ అని మోహన్ బాబు తెలిపారు.

సన్ ఆఫ్ ఇండియాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాశ్, బండ్ల గణేష్ తదితరులు
రచన, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
స్క్రీన్ ప్లే: మోహన్ బాబు
నిర్మాత: విష్ణు మంచు
సినిమాటోగ్రఫి: సర్వేశ్ మురారీ
ఎడిటింగ్: గౌతమ్ రాజు
మ్యూజిక్: ఇళయరాజా
బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
రిలీజ్ డేట్: 2022-02-18


Click it and Unblock the Notifications











