GodFather థియేట్రికల్ రైట్స్ ఎవరికీ అమ్మలేదు.. రికార్డు కలెక్షన్లకు కారణం అదే.. ఎన్వీ ప్రసాద్ (ఇంటర్వ్యూ)
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి కలిసి నటించిన గాడ్ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ సంయుక్తంగా ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. గాడ్ఫాదర్ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..

చరణ్ బాబు ఆలోచన వల్లే..
చరణ్ బాబు ఆలోచన వల్లే గాడ్ఫాదర్ సినిమాను మొదలుపెట్టాం. రిలీజ్ తర్వాత రాంచరణ్ పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. తన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు. మోహన్ రాజా చాలా అద్భుతంగా కథలో మార్పులు చేశారు. తమన్ కూడా తన అద్భుతమైన మ్యూజిక్ తో సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచారు అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.

లూసిఫర్ సినిమాను చూసినా..
గాడ్ఫాదర్ సినిమా మేము ఊహించిన దాని కంటే.. కలెక్షన్లు అద్బుతంగా ఉన్నాయి. ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో లూసిఫర్ను ఓటీటీలో చూశారు. అలాంటి సినిమాను రీమేక్ చేయడం పెద్ద ఛాలెంజ్. అయితే అలాంటి సినిమా ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఎవరికి అమ్మలేదు. సొంతంగా రిలీజ్ చేశాం. కలెక్షన్లు స్ట్రాంగ్గా ఉన్నాయి అని ఎన్వీ ప్రసాద్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

యూఎస్లో 1.1 మిలియన్ డాలర్లు
తెలుగు రాష్ట్రాల్లో గాడ్ఫాదర్ సినిమా 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో స్ట్రాంగ్గా ఉంది. యూఎస్లో 1.1 మిలియన్ డాలర్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. మా బ్యానర్లో ఈ సినిమా మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా అందించిన ఉత్తేజంతో రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు తీయడానికి ఆక్సిజన్లా పని చేసింది అని ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు.

హిందీలో బలంగా కలెక్షన్లు
గాడ్ఫాదర్ చిత్రం ఉత్తరాదితోపాటు ఓవర్సీస్లో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. హిందీలో తొలివారం 10 కోట్ల వసూళ్లను సాధించింది. తమిళంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమా స్ట్రాంగ్గా ఉంది. అక్టోబర్ 14వ తేదీన తమిళనాడులో భారీగా రిలీజ్ చేస్తున్నాం అని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

టికెట్ ధరల కారణంగానే భారీ వసూళ్లు
ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ విజయం చాలా అవసరం. ఇలాంటి విజయాలతో ఎగ్జిబిటర్ వ్యవస్థ మనుగడ ఉంటుంది. గాడ్ ఫాదర్ సక్సెస్తో ఎగ్జిబిటర్స్లో పండగలాంటి వాతావరణం కనిపిస్తున్నది. టికెట్ ధరలు పెంచాలనే ఆలోచన మొదటి నుంచి లేదు. మన ఆడియన్స్కు ఈ రేట్లు సరిపోతాయి. ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచి తగిన కథలు ఎంపిక చేసుకొంటే విజయం లభిస్తుందనే విషయం గాడ్ఫాదర్ రుజువు చేసింది అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











