ఇళయరాజాపై అలాంటి రూమర్లు, అపోహలు నిజం కాదు.. షష్టిపూర్తి దర్శకుడు పవన్ ప్రభ (ఇంటర్వ్యూ)
నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి, లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన ప్రధాన పాత్రల్లో రూపేశ్ హీరోగా, నిర్మాతగా మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ బ్యానర్పై తొలి చిత్ర దర్శకుడు పవన్ ప్రభ తెరకెక్కించిన చిత్రం షష్టిపూర్తి. ఈ మూవీలో హీరోయిన్గా ఆకాంక్ష సింగ్ నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకొన్న ఈ సినిమా మే 30న విడుదల కానున్నది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు పవన్ ప్రభ షష్టిపూర్తి సినిమా ప్రయాణంలో తన అనుభవాలను పంచుకొన్నారు. ఆయన ఫిల్మీబీట్తో మాట్లాడుతూ...
నేను నా కెరీర్ ఆరంభంలో ఈవీవీ సత్యనారాయణ వద్ద ఫిట్టింగ్ మాస్టర్ సినిమాకు పనిచేశాను. తొలుత నేను యాక్టింగ్పై ఇంట్రెస్ట్ పెట్టాను. ఆ తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్లాను. వాస్తవంగా నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ను. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. మంచి కథలు చెప్పాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా గురించి బాగా చదివాను. ఆ తర్వాత చాలా మందికి నా కథలు వినిపించాను. ఈ సినిమా కథ చెప్పినప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు. ఇళయరాజాతో కలిసి పనిచేయాలనుకొంటే.. నన్ను కింద మీదా చూశారు అని దర్శకుడు పవన్ ప్రభ తెలిపారు.

షష్టిపూర్తి కథ గురించి కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు.. తల్లిదండ్రుల పెళ్లిని చూడలేని పిల్లలు మళ్లీ వారి పెళ్లిని చూడటమే. ఈ కథలో ఉండే ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, విజువల్గా గొప్పగా రూపొందించిన చిత్రం. ఈ సినిమా కథ రాయడానికి కారణం మీడియాలో వచ్చిన కథనాలే. నా కుటుంబం చాలా పెద్దది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త ఇలా అందరి మధ్య పెరిగాను. కానీ ఇప్పుడు కొందరికి అమ్మానాన్నలు కూడా బరువు అవుతున్నారు. కుటుంబంలో బంధాలు, అనుబంధాలు గొప్పగా ఉంటాయి. ఫ్యామిలీ సభ్యులను అనాథ శరణాయాల్లో చేర్పించడం, తల్లిదండ్రులను బస్టాండ్లో వదిలేసిపోయిన సంఘటనలు నన్ను కదిలించాయి. ఆ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. నా సినిమాలోని భావోద్వేగాలను తెరపైనే చూపించాలి అని ఆయన అన్నారు.
గోదావరి నదీ తీరం, జాతీయ అవార్డు గ్రహీత అర్చన గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి కాంబినేషన్లో సినిమా కథను ఊహించుకొంటేనే అదో ఫీలింగ్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ నాకు ఓ టీచర్ కనిపించారు. ఈ రెండు పాత్రలు యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ ట్రావెల్ గురించిన స్టోరి. సినిమాలో పాత్ర చూస్తే తల్లిగా కనిపించాలని అనుకొన్నాను. అందుకే అర్చన గారిని ఎంచుకొన్నాను. నిజాయితీ, పెద్ద తరహా, జోవియల్ అంశాలు కలిసిన పాత్ర రాజేంద్ర ప్రసాద్ గారిది అని పవన్ ప్రభు తెలిపారు.
విజయవాడలో రిలీజ్ చేసిన షష్టిపూర్తి ట్రైలర్కు మంచి ఆదరణ లభించింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది నన్ను అభినందించారు. ఇళయరాజా మ్యూజిక్ గురించి గొప్పగా చెప్పారు. నాకు మంచి ఫీలింగ్ కలిగింది అని అన్నారు.
ఇళయరాజాతో వర్క్ చేయడం గొప్ప అనుభూతి. ఈ సినిమా కథ 90 శాతం గోదావరి నదీతీరంలోనే జరిగింది. ఆ సీన్లకు ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్ అనుకొన్నాను. నేను ఊహించుకొన్న కథను ఆయన చెబితే.. ఆయన దానిని నమ్మాడు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాకు మ్యూజిక్ చేశారు. నా కథ విన్న ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు చేయడానికి ఆసక్తి చూపించలేదు. కానీ రాజా సార్ నా విజన్ నమ్మారు అని పవన్ ప్రభ తెలిపారు.

ఇళయరాజా సార్ చాలా ఫ్రెండ్లీగా నాతో ఉన్నారు. బయట ప్రపంచంలో ఆయన మీద అనేక రూమర్లు, అపోహలు ఉన్నాయి. రాజా సార్తో ఒక ఫోటో దిగితే చాలు అనుకొనే వాడిని. అలాంటి వాడికి ఆయనతో సుమారుగా నెల రోజులు ట్రావెల్ అయ్యాను. కథ చెబితే.. సాంగ్స్ సిట్యుయేషన్ తీసేసి కథ చెప్పమన్నారు. కథ విన్న తర్వాత ఎక్కడెక్కడ సాంగ్స్ కావాలో నేను డిసైడ్ చేస్తాను అని చెప్పారు. ఆయన తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతారు. తమిళం, ఇంగ్లీష్తో ఫ్రెంచ్ కూడా మాట్లాడుతారు అని పవన్ ప్రభ చెప్పారు.
నేను కథలోని సన్నివేశాలు చెప్పగానే తన సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్లి ఆర్మోనియంపై ట్యూన్ ఇచ్చి.. ఇది సరిపోతుందా? వేరే ట్యూన్ ఏదైనా ఇవ్వాలా? భావం నీది.. సౌండ్ నాది అని చెబుతారు. ప్రతీ పాటను ఆయన అదే విధంగా పల్లవి, చరణాలను ఇచ్చేశాడు. ఆ తర్వాత సాయంత్రం రమ్మని చెప్పి మిగితా మిక్సింగ్ చేసి పూర్తి పాటను ఇచ్చే వారు. ఈ సినిమాలోని పాటలను చైతన్య ప్రసాద్, రెహ్మాన్, కీరవాణి రాశారు పవన్ ప్రభ తెలిపారు.
ఈ సినిమాలోని రెహ్మాన్తో మూడు పాటలు, చైతన్యప్రసాద్ మూడు పాటలు రాయించాలని అనుకొన్నాను. కానీ ట్యూన్స్ ఇచ్చిన తర్వాత ఓ పాటకు కీరవాణి రాస్తే బాగుంటుందని అనుకొన్నాను. చైతన్య ప్రసాద్ తో కలిసి కీరవాణి కలిశాం. ఆస్కార్ అవార్డు తీసుకొని అప్పుడే వచ్చారు. చంద్రముఖి 2 సినిమాకు వర్క్ చేస్తున్నారు. మేము అడిగిన వెంటనే పాటను రాయడానికి ఒప్పుకొన్నారు. ఇళయరాజకు చెప్పారా? అంటే మీరు ఒప్పుకొంటే చెబుతామన్నాం. ఆ తర్వాత మేము ఆయన వద్ద నుంచి ఇళయరాజా వద్దకు వెళ్లే సరికి పాట రాసి పంపారు అని పవన్ ప్రభ తెలిపారు.

షష్టిపూర్తి సినిమాలో ఓ పాటను యువన్ శంకర్ రాజాతో పాడించాలని అనుకొన్నాను. ఆ విషయం ఇళయరాజాకు చెబితే.. నీవు కొత్తవాడివి. నీ సినిమాలో కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి కదా అన్నాడు. దాంతో నేను మరో మాట మాట్లాడకుండా వచ్చాను. ఆ తర్వాత వేరే వాళ్లతో పాడించాను. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేయిస్తుండగా.. వాసు అనే అతను ఫోన్ చేసి.. ఆ పాటను యువన్ శంకర్ రాజా పాడతాడు. లిరిక్ పంపించండి అన్నారు. అలా ఆ పాటను యువన్ శంకర్ రాజా పాడారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ తోట తరణితో కలిసి పనిచేయడం మరో గొప్ప అనుభవం. ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను అని పవన్ ప్రభ వెల్లడించారు.
షష్టిపూర్తి సినిమాలో రూపేశ్, ఆకాంక్ష ఇద్దరూ అద్భుతంగా నటించారు. రూపేశ్ కారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆకాంక్ష అచ్చమైన తెలుగమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తరువాత ఆమెకు మరింత మంచి భవిష్యత్తు ఉంటుంది. లాంటి కథను నమ్మి పెట్టుబడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మనం కథను చెప్పేటప్పుడు.. మనం ఏం ఫీల్ అవుతామో.. అవతల ఉన్న నిర్మాత కూడా అదే ఫీల్ అయితే సినిమా ముందుకు వస్తుంది. ఇలాంటి చిత్రాల్ని డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం కష్టం. ఆ పనిని రూపేష్ చేశారు అని దర్శకుడు పవన్ ప్రభ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











