‘ఇండస్ట్రీని రాజమౌళి పాడు చేస్తున్నాడు.. పాన్ ఇండియా పిచ్చితో మహేష్ను..’
భారతీయ సినిమా పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అగ్ర హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారు. సినిమా థియేటర్లకు ఆడియెన్స్ రావడం కష్టంగా మారింది. చిన్న సినిమాల విషయం అసలు చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ర హీరోల సినిమాలు వస్తే.. కాస్త సందడిగా ఉండటమే కాకుండా బిజినెస్ పరంగా జోష్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోలు మూడేళ్లకు ఓ సినిమా చేయడంపై డిస్టిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ డిస్టిబ్యూటర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వ్యవస్థ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్సంటేజీపైనే బిజినెస్ జరుగుతున్నది. కానీ తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం పర్సెంటేజీ విధానం లేదు. ఇగోలకు పోయి ఇండస్ట్రీని బ్రష్టుపట్టిస్తున్నారు. ఇగోలు మానుకొంటేనే పరిశ్రమ పురోగతి చెందుతుందని ఈస్ట్ గోదావరి డిస్టిబ్యూటర్ సత్యనారాయణ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా పరిశ్రమలో తప్పు జరగడానికి కారణం నిర్మాతనే. హీరోకు రెమ్యునరేషన్స్ ఇష్టానుసారంగా పెంచుతున్నారు. మీరు పాన్ ఇండియా హీరో అని కథానాయకులను మభ్య పెడుతున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలతో హీరోల రెమ్యునరేషన్ పెరగడంతో బడ్జెట్లు కూడా పెరిగిపోతున్నాయి. దీనంతటికి కారణం ఎస్ఎస్ రాజమౌళినే. ఇండస్ట్రీని ఆయన పాడు చేస్తున్నాడు. ఇండియాకు ఆయన గర్వ కారణమైనప్పటికీ.. బిజినెస్ లెక్కల పరంగా ఇండస్ట్రీని పాడు చేస్తున్నారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన అన్నారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. ఆయన సినిమా మూడేళ్లపాటు రాదని చెబితే అభిమానులకు ఎంత బాధగా ఉంటుంది. వాస్తవానికి హీరో మహేష్ బాబు సంవత్సరానికి ఒక్క సినిమా తీసేవాడు. గత ఏడాదిన్నర క్రితం ఆయన సినిమా రిలీజైంది. ఇంకో ఏడాదిన్నర పాటు మహేష్ సినిమా రాదు. దాదాపు ఒక్క హీరోతోనే మూడేళ్లు సినిమా తీస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి. అందుకే నేను రాజమౌళి ఇండస్ట్రీని పాడు చేస్తున్నాడని అన్నానని డిస్టిబ్యూటర్ సత్యనారాయణ అన్నారు.
ఇదిలా ఉండగా, మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఒడిశా, యూరప్, హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమా 2026 అక్టోబర్ గానీ, 21027 సంక్రాంతికి గానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహేష్ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
ఇక రాజమౌళి రూపొందించే సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, జాన్ అబ్రహం విలన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలోని ఫైట్స్ను ఇటీవల హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేసి గ్లోబల్ ఆడియెన్స్ రీచ్ అయ్యేలా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











