Bro మూవీపై ఏపీ పాలిటిక్స్ ప్రభావమా? రాజకీయ ప్రవేశంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ (ఇంటర్వ్యూ)
ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్షన్లో రూపొందిన తమిళ చిత్రం వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్గా రూపొందిన చిత్రం బ్రో (Bro The Avatar). పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఈ చిత్రం వస్తున్నది. ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 28 తేదీన బ్రో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలతో విరుచుకుపడటం అనే వివాదాలు బ్రో సినిమాపై పెద్దగా ప్రభావం ఉండదని అనుకొంటున్నాను. జనసేన పార్టీ తరఫున పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు వేరు, బ్రో సినిమా వేరు. సినిమా, రాజకీయాలను కలిపి చూడకూడదు. అలాంటిదేమైనా వస్తే.. వాటిని డీల్ చేసే ప్లాన్ కూడా ఉంది అని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.

ఏపీలో కొన్ని రాజకీయ అంశాలు సినిమాలపై ప్రభావం చూపాయి. ఆంధ్రలో అలాంటి వివాదాలు బ్రో సినిమాను చుట్టుముట్టవని అనుకొంటున్నాను. వకీల్ సాబ్ రిలీజైనప్పుడు పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్లో వకీల్ సాబ్ సినిమా ఇబ్బందుల్లో పడింది. అలాంటి పరిస్థితి బ్రో సినిమాకు రిపీట్ కాదని నమ్ముతున్నాం అని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణలో బ్రో సినిమా టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదు. ఏపీ, నైజాంలో ఉండే రెగ్యులర్ టికెట్ రేట్లకే కట్టుబడి ఉన్నాం. మా సినిమాను లిమిటెడ్ బడ్జెట్లోనే పూర్తి చేశాం. ప్రేక్షకుల నుంచి అధికంగా టికెట్లు రేట్లను వసూలు చేయం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోల కోసం కూడా ప్రభుత్వాన్ని అడిగే ఉద్దేశం కూడా లేదు అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
నేను పలు రంగాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నాను. సినిమా రంగంలో చాలా ప్లాన్స్ ఉన్నాయి. కంటెంట్ ప్రొడక్షన్ టీమ్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించాలనే విషయంపై కంటెంట్ గురించి రకరకాల ప్లాన్స్ చేస్తున్నాం. అయితే ఇలాంటి పనులతోనే బిజీగా ఉన్నాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. పాలిటిక్స్కు దూరంగా ఉంటాను అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు.
ప్రీమియర్ షోలు వేసే ఆలోచన ఇప్పటివరకు అయితే లేదు. చిన్న సినిమాలకు తమ కంటెంట్ను చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం కోసం ప్రీమియర్ షోలు వేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పెద్ద సినిమాలకు ఆ అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే ఫుల్ అవుతాయి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే చెప్పలేం. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటున్నాం అని టీజీ విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.
భారతీయ సినిమా పరిశ్రమలో వేగంగా 100 సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం. బ్రో అనేది మా 25వ సినిమా. త్వరలోనే 50 సినిమాల మైలురాయిని అందుకొంటాం. 100 మార్క్ దిశగా అడుగులు వేస్తాం. ప్రస్తుతం 15-20 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. అలాగే ఓటీటీ సినిమాలు కూడా చేయబోతున్నాం. బాలీవుడ్లో కూడా సినిమాలు చేసే ఆలోచనలు ఉన్నాయి. త్వరలోనే ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం అని టీజీ విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











