ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్లో.. హనుమంతుడికి ఓ సీటు.. కారణం వెల్లడించిన టీజీ విశ్వ ప్రసాద్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారథ్యంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను నిర్మిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆదిపురుష్ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నది. జూన్ 16న 'ఆదిపురుష్' విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ సినిమాలు, ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ...
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై స్పీడ్గా 100 సినిమాలు నిర్మించాలని టార్గెట్ పెట్టుకొన్నాం. త్వరలోనే మా బ్యానర్లో 25 సినిమాలు పూర్తి అవుతాయి. మా మొదటి 25 సినిమాల కోసం మేం కాస్త ఎక్కువ సమయం తీసుకొన్నాం. కానీ నెక్ట్స్ 25 సినిమాలను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదిన్నర సమయంలోనే 50 సినిమాలు పూర్తి చేస్తాం అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఇప్పటికే 4 సినిమాలు పూర్తయ్యాయి. మరో 15 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల క్రియేటివిటి పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా రిలీజ్ సమస్యలు కూడా రావొచ్చు. మాది ఫ్యాక్టరీ తరహా సినీ నిర్మాణం. మాకు బలమైన టీమ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకొంటూ చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. మంచి సినిమాలు అందించడానికి, ప్రేక్షకులకు మంచి వినోదం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని టీజీ విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రం మాకు 25వ సినిమా. మా 50వ సినిమా గురించి మరో ఆరు నెలల్లో ప్రకటిస్తాం. వచ్చే రెండు మూడేళ్ళలో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్తో సంప్రదింపులు జరుపుతున్నాం. పాన్ వరల్డ్ సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.

ప్రస్తుతం ఓటీటీ ప్రభావం సినిమా బిజినెస్పై భారీగా ఉంది. థియేట్రికల్ బిజినెస్పై ఆధారపడితే సినిమాలు తీయడం చాలా కష్టం. ఓటీటీ పరంగా మంచి బిజినెస్ ఉంది కాబట్టి మేము ఎక్కువ సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే ఏడాదిన్నరలో 25 సినిమాలు పూర్తి చేస్తాం. ఓటీటీ వల్ల మేము సినిమాల వేగం పెంచాం అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.
ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లో హనుమంతుడికి ఒక సీటు కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నాం. రామాయణం అనేది అద్బుతమైన పౌరాణిక కథ. ఆ సినిమా ప్రదర్శించే సమయంలో దివ్యత్వం ఉంటుందనే అభిప్రాయం ఉంది. అందుకే హనుమంతుడికి ప్రతి థియేటర్లో ఒక సీటు కేటాయించడం అనేది అది ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనం అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఆదిపురుష్ సినిమాకు ఉచితంగా టికెట్లు ఇవ్వాలనేది పబ్లిసిటీ స్టంట్ కాదు. సెలబ్రిటీలు స్వచ్చందంగా ముందుకు వచ్చారు అని టీజీ విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











