‘ఉప్పు దొంగతనం చేస్తే పూట గడిచిన పేద రోజులు.. యాక్టింగ్ అంటే మాట్లాడటం మానేశారు‘
తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ఫుల్ కెరీర్తో దూసుకెళ్తున్న యువ హీరో కిరణ్ అబ్బవరామ్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త నటీనటులను పరిచయం చేసి వారి ప్రతిభను తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేశారు. సాయి తేజ్, వేదా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, మాధవి ప్రసాద్, తేజ విహన్, సత్య నారాయణ, టీవీ రామన్, అన్షుమన్, లతీష్ కీలపట్టు తదితరులు సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఈ చిత్రం ద్వారా వీ మునిరాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
KA ప్రొడక్షన్స్, సుమైరా స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సీఈవో: రహస్య కిరణ్, మ్యూజిక్: వంశీకాంత్ రేఖానా, డీవోపీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్: రితికేష్ గోరక్ తదితరులు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం మే 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్ర సిద్ధయ్యగా నటించిన యాక్టర్ లతీష్ పెర్ఫార్మెన్స్కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయనతో ఫిల్మీబీట్ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆయన తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ అంశాలను పంచుకొన్నారు. ఆయన చెప్పిన భావోద్వేగమైన వివరాల్లోకి వెళితే..

చిత్తూరు జిల్లా నగరిలోని నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. అమ్మా, నాన్న, అన్నయ్య చాలా కష్టపడి చదివించారు. అయితే నాకు ఎప్పటి నుంచి సినిమాల్లోకి రావాలనే కోరిక ఉండేది. అయితే కుటుంబ పరిస్థితి వల్ల బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. సినిమా ఇండస్ట్రీపై మక్కువను చంపుకోలేక 2017లో హైదరాబాద్కు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. నా ప్రతిభను మెచ్చుకొన్నా ఆఫర్లు ఇవ్వలేదు. మహిపాల్ గారి వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్గా పని చేశాను. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను అని తెలిపారు.
మాది నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా చాలా సమస్యలు ఉండేవి. పూట గడవడానికి కష్టపడిన రోజులు ఉన్నాయి. ఉప్పు దొంగతనం చేసుకొన్న తిన్న రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం మానేసి సినిమాల్లో పనిచేస్తున్నానని చెప్పి ఫ్యామిలీ కోపం చేసింది. ఆ తర్వాత మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశారు. తిమ్మరాజు పల్లి సినిమా చూసిన తర్వాత కుటుంబ సభ్యులు మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ ఎమోషనల్ జర్నీలో అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు నాకు అండగా నిలిచారు అని లతీష్ తెలిపారు.
నటనలో శిక్షణ కోసం బీ స్టూడియోను సంప్రదించాను. లక్ష రూపాయల ఫీజు అడిగారు. నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడంతో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నాటకాలు వేయడం మొదలుపెట్టాను. ఆ క్రమంలోనే తిమ్మరాజుపల్లి సినిమా ఆఫర్ వచ్చింది. ఆడిషన్ క్లియర్ కావడంతో సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది అని లతీష్ చెప్పారు.
విలన్ పాత్ర చేయాలని చెప్పినప్పుడు చాలా విషయాలు గుర్తుకు వచ్చాయి. గతంలో విలన్ పాత్రలు వేసిన వారు పెద్ద యాక్టర్లు అయ్యారనే విషయాన్ని స్పూర్తిగా తీసుకొన్నాను. పాత్ర కోసం 30 కిలోల బరువు పెరిగాను. తెరపైన నన్ను చూసి మీరేనా? అని అందరూ ఆశ్చర్యపోయారు. సిద్దయ్య పాత్ర కోసం ప్రాణం పెట్టాను. అందుకే అందరూ అభినందిస్తున్నారు. నా పెర్ఫార్మెన్స్ చూసి కిరణ్ అబ్బవరం సార్, బషీర్ సార్, నరేష్ అగస్త్య మెచ్చుకొన్నారు. ప్రస్తుతం ఇంకా సినిమా ఆఫర్లు ఒప్పుకోలేదు. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని చెప్పారు.


Click it and Unblock the Notifications