ఏపీలో నిశ్శబ్ద విప్లవం.. ప్రజా తిరుగుబాటు తప్పదు.. చంద్రబాబు అరెస్ట్పై వీకే నరేష్ హాట్ కామెంట్స్
తెలుగు సినిమా పరిశ్రమలో వీకే నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదిలో ఆయన నటించిన చిత్రాలు భారీ విజయాలు అందుకొన్నాయి. భావోద్వేగమైన, వినోదాత్మకమైన పాత్రలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు.
తాజాగా ఆయన నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ చిత్రం అక్టోబర్ 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు, వెంకటేష్ మహా తదితరులు నటించారు. ఈ సినిమాకు తొలి చిత్ర దర్శకురాలు పూజా కొల్లూరి డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వీకే నరేష్ మాట్లాడుతూ...

సినిమాలో కొత్త టోన్ ఉంటుంది: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కోసం వర్క్ షాప్ కండక్ట్ చేశాం. చాలా రోజులు స్క్రిప్టు రీడింగ్ చేశాం. ఒక కొత్త వినోదంతో సహజత్వానికి, వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫి విషయానికి వస్తే.. కొత్త టోన్ కనిపిస్తుంది. తప్పకుండా హిట్ అవుతుంది. మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు అని వీకే నరేష్ అన్నారు.
నేను టార్గెట్ అలా అయ్యాను: సినిమా పరిశ్రమను వదిలేసి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశాను. నాకు మంచి అనిపిస్తే నేను ఏదైనా చేస్తాను. రియల్, ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్లో నేను దేనికి భయపడను.2000 సంవత్సరంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాంటి ప్రభుత్వాలు పడిపోయాయి. వాజ్పేయ్ లాంటి నేతలు ఉండాలని కోరుకొన్నాను. నీతివంతమైన రాజకీయాల కోసం అనంతపురం లాంటి ప్రదేశంలో పనిచేసి కొందరికి టార్గెట్ అయ్యారు. ఆ తర్వాత నేను మళ్లీ సినిమా పరిశ్రమలోకి వచ్చాను.

చంద్రబాబు అరెస్ట్పై: చంద్రబాబు అరెస్ట్ గురించి నేను మాట్లాడను. కానీ ధర్మం, న్యాయం చివరకి గెలుస్తుంది. వ్యక్తిగత దూషణలు, అణిచివేతకు గురిచేయడం వల్ల ఒక తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటును మనం చూస్తాం. రాజకీయంగా వారసులు రావడం తప్పని అనను. కానీ నీతి, నిజాయితీ ఉండాలి. కామన్ మ్యాన్కు ప్రయోజనం కలుగుతుందో అప్పుడు న్యాయం జరుగుతుంది అని వీకే నరేష్ తెలిపారు.
సినిమా పరిశ్రమ మౌనానికి కారణం ఏమిటంటే?: చంద్రబాబు అరెస్ట్పై సినీ పరిశ్రమ మౌనంగా ఎందుకు ఉన్నదంటే.. ఎన్టీఆర్ తరం నుంచి చూస్తే.. ప్రజలకు ఏదైనా విపత్తు, తెలుగు ప్రాంతం ఆపదలో ఉంటే.. సినీ నటులందరూ జనంలోకి వెళ్లి అండగా నిలబడ్డారు. సిని పరిశ్రమ ఓ పక్క వినోదం అందిస్తూ.. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి అండగా ఉంటాం. బేసిక్గా మేము వినోదాన్ని అందించే ఆర్టిస్టులం. దీనికి సమాధానం ప్రజలు చెప్పాలి. ప్రజల్లో మేము ఉన్నాం. మేము ఓటు వేస్తాం. ప్రస్తుతం రాజకీయాల్లో నిశ్శబ్ద విప్లవం దిశగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎంత మంది గెలుస్తారు? అనేది పక్కన పెడితే.. ప్రజలే నిర్ణయిస్తారు అని వీకే నరేష్ చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో క్లియర్ మ్యాండేట్గా ప్రజా తీర్పు: సినిమా పరిశ్రమ తరఫున చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఇతర నటీనటులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సమయంలో కోట్లాది రూపాయలు ప్రజల సంక్షేమం కోసం సహాయం చేశాం. అలాంటి పరిశ్రమ ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్పై మౌనంగా ఉందంటే.. ఒక తిరుగబాటు కోసం సిద్దమైంది. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కూడా ప్రస్తుత రాజకీయాలకు లింక్ అయి ఉంది. ప్రజాస్వామ్యం ఏంటనే కోణంలో కథ సాగుతుంది. సమైక్యాంధ్రలో గానీ, తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత కూడా తెలుగు ప్రజల తీర్పు క్లియర్గా ఉంది. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు కూడా క్లియర్గా ఉండబోతుందని వీకే నరేష్ జోస్యం చెప్పారు. అలాగే మార్టిన్ లూథర్ కింగ్కు ప్రేక్షకులు క్లియర్ మ్యాండెట్తో సక్సెస్ అందిస్తారన్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











