ప్రపంచ స్థాయి ఉత్తమ దర్శకుల జాబితాలో ఉపేంద్రకు చోటు.. ఇండియా నుంచి ముగ్గురే.!
ఉపేంద్ర.. ఈ పేరు తెలియని వారు చాలా అరుదు. అంతలా ఆయన ప్రభావం చూపించాడు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని దక్షిణాదితో పాటు భారతదేశం అంతటా పాపులర్ అయ్యాడు. ఉపేంద్రకు సినీరంగంలోని దాదాపు అన్ని విభాగాలలో చాలా మంచి పరిజ్ఞానం ఉంది. దర్శకుడిగా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా, కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా మరియు నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అందుకే క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులో పాటు ఎన్నో పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాలకు తాత్కాలికంగా గ్యాప్ ఇచ్చిన ఆయన రాజకీయాల్లోకి వెళ్లాడు. కొద్దిరోజుల క్రితం పార్టీని కూడా స్థాపించాడు. ఇక, అప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

కర్ణాటకలోని ఉద్యోగాల్లో కన్నడిగులకే ఇవ్వాలంటూ ఉపేంద్ర డిమాండ్ చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన ప్రకటించాడు. దీనిలో భాగంగా ఈ నెల 14,15 తేదీల్లో బెంగళూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తున్నానని, తనకు యువత అండగా నిలవాలని ఉపేంద్ర కోరాడు. దీనికి సంబంధించిన ఆయన ఓ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఉపేంద్ర అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బీఎండీబీ అనే సంస్థ ప్రపంచ స్థాయి ఉత్తమ దర్శకుల జాబితాను విడుదల చేసింది. అందులో ఉపేంద్రకు 17వ స్థానం దక్కింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కడం విశేషం. అందులో ఒకరు రాజ్ కుమార్ హిరాణీ, మరొకరు సత్యజిత్ రే. వీరికి 2, 49 ర్యాంకులు వచ్చాయి. దీంతో ఉపేంద్ర అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అలాగే, 'ఉప్పీ 2' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











