Pushpa కన్నడ మీడియాకు క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్.. అసలేం జరిగిందంటే!
అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్బస్టర్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17వ తేదీన రిలీజ్కు సిద్దమవుతున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియాగా పుష్ప చిత్రం రూపొందడంతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. దాంతో దేశంలోనే ప్రధాన నగరాలైన బెంగళూరు, కోచి, ముంబైలో ప్రమోషన్ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ నిమగ్నమయ్యారు.
డిసెంబర్ 15వ తేదీ బుధవారం బెంగళూరులో మీడియాతో బన్నీ ఇంటారాక్ట్ అయ్యారు. బెంగళూరు ప్రెస్ మీట్ కోసం ప్రత్యేక విమానంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న తదితరులు వెళ్లారు. అయితే ఆలస్యంగా వెళ్లిన అల్లు అర్జున్ను మీడియా ప్రతినిధులు నిలదీయడంతో కాస్త గందరగోళం నెలకొన్నది.

వాస్తవానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ 11.30 నిమిషాలకు నిర్వహించాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ 1.30 నిమిషాలకు వేదిక మీదకు చేరుకొన్నారు. అయితే ఆలస్యంగా వచ్చిన బన్నీ కనీసం సారీ కూడా చెప్పలేదని మీడియా రిపోర్టర్ ప్రశ్నించాడు.
బెంగళూరు మీడియాకు చెందిన రిపోర్టర్ మాట్లాడుతూ ముందుగా యాంకర్ను కడిగిపడేశాడు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగినప్పుడు యాంకర్ సుమ చక్కగా తెలుగులో మాట్లాడారు. కానీ మీరు కన్నడ భాషను కించపరిచే విధంగా ఇంగ్లీష్, తెలుగు భాషలో మాట్లాడారు. ఇది సరికాదు. కన్నడ భాషను అగౌరవపరిచినట్టు అంటూ ప్రశ్నించాడు.
యాంకర్ను తప్పుపట్టిన తర్వాత అల్లు అర్జున్తో మాట్లాడుతూ.. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. కనీసం మీడియాకు సారీ కూడా చెప్పలేదు. రెండు గంటలుగా ఇక్కడ వేచి ఉన్నాం. కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు అని ప్రశ్నించగా.. అల్లు అర్జున్ సారీ చెప్పారు. తాను ప్రత్యేక విమానంలో వచ్చాను. పొగ మంచు కారణంగా ఫ్లయిట్ ఆలస్యం అయింది. నాకు ఈ ప్రొగ్రాం షెడ్యూల్ అసలు తెలియదు. అందుకు సారీ చెబుతున్నా. సారీ చెప్పడంలో వ్యక్తిగా పెరిగిపోతాను అంటూ అల్లు అర్జున్ చెప్పారు.
అయితే మీ నుంచి సారీ చెప్పించుకోవడానికి మేము ప్రశ్నించలేదు. కనీసం మా పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని ఆశించాం. అది మీ వద్ద నుంచి కనిపించకపోవడంతో అడుగాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే మీడియా రిపోర్టర్లకు సారీ చెప్పి కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు బన్నీ చక్కగా సమాధానం చెప్పారు.


Click it and Unblock the Notifications











